IND Vs BAN: పట్టు చిక్కింది
తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. ప్రత్యర్థికి మ్యాచ్లో దాదాపుగా అవకాశం లేకుండా చేసింది. తొలి రోజు సమంగా నిలిచిన బంగ్లాదేశ్పై రెండో రోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది.
కుల్దీప్ ఆల్రౌండ్ జోరు, విజృంభించిన సిరాజ్
బంగ్లాతో తొలి టెస్టులో భారత్ పైచేయి
తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. ప్రత్యర్థికి మ్యాచ్లో దాదాపుగా అవకాశం లేకుండా చేసింది. తొలి రోజు సమంగా నిలిచిన బంగ్లాదేశ్పై రెండో రోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారత్ హీరో. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన అతడు.. బ్యాటుతో జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు బంతితో బంగ్లా వెన్ను విరిచాడు. బ్యాటుతో రాణించిన అశ్విన్, బంతితో విజృంభించిన సిరాజ్లదీ రెండో రోజు భారత్ పైచేయి సాధించడంలో కీలక పాత్రే. 271 పరుగులు వెనుకబడి, తొలి ఇన్నింగ్స్లో చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్న బంగ్లాకు టీమ్ఇండియాను నిలువరించడం చాలా కష్టమైన పనే.
మొదటి టెస్టులో టీమ్ఇండియా తిరుగులేని స్థితిలో నిలిచింది. విజయానికి బలమైన పునాది వేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 278/6తో రెండో రోజు, గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 404 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ (58; 113 బంతుల్లో 2×4, 2×6), కుల్దీప్ యాదవ్ (40; 114 బంతుల్లో 5×4) విలువైన ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం కుల్దీప్ (4/33), సిరాజ్ (3/14) ధాటికి బంగ్లాదేశ్ నిలవలేకపోయింది. ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్ (28) టాప్ స్కోరర్. మెహదీ హసన్ మిరాజ్ (16), ఎబాదత్ హుస్సేన్ (13) క్రీజులో ఉన్నారు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే బంగ్లా ఇంకా 72 పరుగులు చేయాలి.
బంగ్లా విలవిల: బంగ్లాదేశ్ను భారత బౌలర్లు ఏ దశలోనూ కుదురుకోనివ్వలేదు. మందకొడి పిచ్పై బంగ్లా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికి నజ్ముల్ శాంటో (0)ను ఔట్ చేయడం ద్వారా బంగ్లా పతనాన్ని సిరాజ్ ఆరంభించాడు. నాలుగో ఓవర్లోనే యాసిర్ అలీ (4)ని ఉమేశ్ ఔట్ చేయగా.. కాసేపటి తర్వాత, చక్కగా బ్యాటింగ్ చేస్తున్న లిటన్ దాస్ (24)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. పట్టుదలగా ప్రతిఘటిస్తున్న మరో ఓపెనర్ జకీర్ హసన్ (20)ను కూడా సిరాజ్ వెనక్కి పంపడంతో బంగ్లా 56/4కు పరిమితమైంది. ఆ తర్వాత కుల్దీప్ తన స్పిన్తో బంగ్లాను కకావికలం చేశాడు. షకిబ్ (3), నురుల్ (16), ముష్ఫికర్, తైజుల్ (0)లను చకచకా ఔట్ చేయడం ద్వారా ఆ జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. బంగ్లా 102/8తో నిలవగా.. మెహదీ హసన్, ఎబాదత్ అభేద్యమైన 9వ వికెట్కు 31 పరుగులు జోడించారు.
ఆ ఇద్దరి పోరాటం..: టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో నాలుగొందలు దాటడం ఊహించనిదే. ఎందుకంటే ఓవర్నైట్ స్కోరు 278/6తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ జట్టు కాసేపటికే ఓవర్నైట్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ (86; 254 బంతుల్లో 10×4)ను కోల్పోయింది. సెంచరీ చేస్తాడనుకున్న అతడు కేవలం నాలుగు పరుగులే జోడించి జట్టు స్కోరు 293 వద్ద ఏడో వికెట్గా ఔటయ్యాడు. ఆ దశలో అశ్విన్, కుల్దీప్ చక్కటి బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను నడిపించారు. బంగ్లా బౌలర్లను నిస్పృహకు గురి చేస్తూ ఎనిమిదో వికెట్కు 92 పరుగులు జోడించి భారత్ను బలమైన స్థితిలో నిలిపింది ఈ జంట. 22 నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 22పై సగటున్న అతడు పట్టుదలగా నిలిచాడు. మంచి డిఫెన్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన కుల్దీప్.. 18 బంతుల తర్వాత ఖాతా తెరిచాడు. ఆ తర్వాత స్లాగ్ స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఖాతాలో అయిదు టెస్టు శతకాలున్న అశ్విన్.. ఎంతో సంయమనాన్ని, పరిణతిని ప్రదర్శిస్తూ కుల్దీప్తో బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో 13వ అర్ధశతకాన్ని సాధించే క్రమంలో అతడు రెండు సిక్స్లు కూడా కొట్టడం విశేషం. కుల్దీప్, అశ్విన్లు ఇద్దరూ ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా బ్యాటింగ్ చేశారు. లంచ్ తర్వాత మెహదీ హసన్ బౌలింగ్లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయి అశ్విన్ స్టంపౌట్ కావడంతో ఎనిమిదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపట్లోనే కుల్దీప్, సిరాజ్ (4) వెనుదిరగడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) రెండు సిక్స్లతో అలరించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 404; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: నజ్ముల్ శాంతో (సి) పంత్ (బి) సిరాజ్ 0; జకీర్ హసన్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; యాసిర్ అలీ (బి) ఉమేశ్ 4; లిటన్ దాస్ (బి) సిరాజ్ 24; ముష్ఫికర్ ఎల్బీ (బి) కుల్దీప్ 28; షకిబ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 3; నురుల్ హసన్ (సి) శుభ్మన్ (బి) కుల్దీప్ 16; మెహదీ హసన్ మిరాజ్ బ్యాటింగ్ 16; తైజుల్ (బి) కుల్దీప్ 0; ఎబాదత్ బ్యాటింగ్ 0; ఎక్స్ట్రాలు 9 మొత్తం: (44 ఓవర్లలో 8 వికెట్లకు) 133; వికెట్ల పతనం: 1-0, 2-5, 3-39, 4-56, 5-75, 6-97, 7-102, 8 - 102; బౌలింగ్: సిరాజ్ 9-1-14-3; ఉమేశ్ యాదవ్ 8-1-33-1; అశ్విన్ 10-1-34-0; కుల్దీప్ యాదవ్ 10-3-33-4; అక్షర్ పటేల్ 7-3-10-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..