సిరీస్‌ పట్టేస్తారా?

తొలి టీ20లో నెగ్గినా.. జట్టు ప్రదర్శన అంత ఆశాజనకంగా అయితే లేదు. మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.

Updated : 05 Jan 2023 06:51 IST

లంకతో భారత్‌ రెండో టీ20 నేడు
రాత్రి 7 నుంచి

ఒక్క రోజే విరామం. అంతలోనే భారత్‌, శ్రీలంక జట్లు మరో టీ20 సమరానికి సిద్ధమైపోయాయి. వేదిక ముంబయి నుంచి పుణెకు మళ్లింది. గురువారమే రెండో టీ20. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20లో రెండు పరుగుల తేడాతో గట్టెక్కిన టీమ్‌ఇండియా.. ఈసారి సాధికారికమైన ఆటతో మ్యాచ్‌ను నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.

పుణె: తొలి టీ20లో నెగ్గినా.. జట్టు ప్రదర్శన అంత ఆశాజనకంగా అయితే లేదు. మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. బ్యాటింగ్‌లో బాగా తడబడ్డ భారత్‌.. చివర్లో దీపక్‌ హుడా, అక్షర్‌ల మెరుపులు లేకుంటే స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యేదే. ఇక బౌలర్లు ఆరంభంలో బాగా బౌలింగ్‌ చేసి, మధ్యలో పట్టు కోల్పోయే బలహీనతను కొనసాగించారు. లంక ఈ మ్యాచ్‌లో విజయానికి చేరువగా వెళ్లి త్రుటిలో ఓడింది.

కుర్రాళ్లు సత్తాచాటాలి: లేక లేక అవకాశాలు అందుకున్న యువ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయారు. టెస్టులు, వన్డేల్లో సత్తా చాటుకుని మంగళవారమే టీ20 అరంగేట్రం చేసిన శుభ్‌మన్‌ తీవ్రంగా నిరాశ పరిచాడు. 7 పరుగులకే వెనుదిరిగాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు నెమ్మదిగా ఆడడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. అతను ఓ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడడమే కాక, స్ట్రైక్‌ రేట్‌ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవడం అవసరం. ఇక చాన్నాళ్ల తర్వాత తుది జట్టులోకి వచ్చిన సంజు శాంసన్‌ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అతను గాయపడడంతో రుతురాజ్‌, రాహుల్‌ త్రిపాఠిల్లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఇక భీకర ఫామ్‌తో సిరీస్‌లో బరిలోకి దిగిన కొత్త వైస్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ కూడా ముంబయిలో విఫలమయ్యాడు. అతడి నుంచి అభిమానులు 360 డిగ్రీ మెరుపులను ఆశిస్తున్నారు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌, కెప్టెన్‌ హార్దిక్‌లతో పాటు దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌ తొలి టీ20లో చక్కటి ఇన్నింగ్స్‌ ఆడారు. బౌలింగ్‌లో అరంగేట్ర బౌలర్‌ శివమ్‌ మావితో పాటు ఉమ్రాన్‌ మాలిక్‌ సత్తా చాటారు. మరో పేసర్‌ హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టినా.. ఎప్పట్లాగే ఎక్కువ పరుగులు ఇచ్చేశాడు. తిరిగి తుది జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్‌ స్పిన్నర్‌  చాహల్‌.. పూర్తిగా తేలిపోయాడు. వికెట్‌ పడగొట్టలేదు. ధారాళంగా పరుగులిచ్చేశాడు. అక్షర్‌ పటేల్‌ చివరి ఓవర్లో ఆకట్టుకున్నా.. మొత్తంగా అతడి బౌలింగ్‌ ప్రదర్శన అంత గొప్పగా లేదు. బ్యాటర్లు, బౌలర్లు పట్టు వదలకుండా నిలకడగా రాణిస్తేనే సిరీస్‌ విజయం సొంతమవుతుంది.

స్పిన్‌తో జాగ్రత్త: ప్రస్తుత లంక జట్టుతో అంత తేలిక కాదని టీమ్‌ఇండియాకు తొలి టీ20లో బాగానే అర్థమై ఉంటుంది. ఆ  జట్టు బౌలర్లు ఎంతో మెరుగైన ప్రదర్శన చేశారు ముంబయిలో. ముఖ్యంగా స్పిన్నర్లు హసరంగ, తీక్షణ, ధనంజయ బాగా ఇబ్బంది పెట్టారు. పుణె పిచ్‌ కూడా స్పిన్‌కు సహకరించేదే కావడంతో వీరితో జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ శానక, వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌లతోనే ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. తొలి టీ20లో విఫలమైనప్పటికీ నిశాంక, అసలంక, రాజపక్స ప్రమాదకారులే. పుణె పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తూనే బ్యాటింగ్‌కూ అనుకూలిస్తుందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని