Kapil Dev: నిన్న సచిన్‌.. నేడు కోహ్లి.. రేపు మరొకరు!

తరాలు మారుతున్నాకొద్దీ అత్యుత్తమ క్రికెటర్లు వస్తారని.. మెరుగైన ప్రదర్శన చేస్తారని దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ అన్నాడు.

Updated : 23 Jan 2023 08:24 IST

దిల్లీ: తరాలు మారుతున్నాకొద్దీ అత్యుత్తమ క్రికెటర్లు వస్తారని.. మెరుగైన ప్రదర్శన చేస్తారని దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ అన్నాడు. సచిన్‌ తెందుల్కర్‌, విరాట్‌ కోహ్లీలలో ఎవరు మెరుగైన బ్యాటర్‌ అన్న ప్రశ్నకు కపిల్‌ పైవిధంగా స్పందించాడు.    ‘‘ఆ స్థాయి ఆటగాడిగా ఒకరో, ఇద్దరినో ఎంచుకోలేం. 11 మంది ఆటగాళ్ల సమూహం జట్టు. అయితే ప్రతి తరం మెరుగవుతూనే ఉంటుంది. మా కాలంలో సునీల్‌ గావస్కర్‌ గొప్ప ఆటగాళ్లలో ఒకడు. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌ వచ్చారు. ప్రస్తుత తరంలో రోహిత్‌శర్మ, విరాట్‌ ఉన్నారు. తర్వాతి తరంలో మరింత మెరుగైన వాళ్లు వస్తారు. అత్యుత్తమ ఆటగాళ్లు.. మెరుగైన ప్రదర్శన చూస్తాం’’ అని కపిల్‌ అన్నాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ అవకాశాలపై స్పందిస్తూ.. ‘‘విజేతగా నిలిచేందుకు టీమ్‌ఇండియాకు అర్హత ఉంది. అలాంటి జట్లు మరికొన్ని ఉన్నాయి. ప్రపంచకప్‌ గెలవడానికి అదృష్టం, సరైన కూర్పు, ప్రధాన ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం అత్యంత కీలకం. ఎక్కువ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు గాయాలు అవుతాయి. టోర్నీలో ఆడుతున్నప్పుడు వారికి గాయాలు కావొద్దని ఆశిద్దాం’’ అని కపిల్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు