సంక్షిప్త వార్తలు (4)

భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనిక బత్రా కెరీర్‌లో ఉత్తమ ర్యాంకు సాధించింది. గురువారం ప్రకటించిన ప్రపంచ టీటీ మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 33వ ర్యాంకులో నిలిచింది.

Updated : 27 Jan 2023 03:01 IST

మనిక @ 33

దిల్లీ: భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనిక బత్రా కెరీర్‌లో ఉత్తమ ర్యాంకు సాధించింది. గురువారం ప్రకటించిన ప్రపంచ టీటీ మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 33వ ర్యాంకులో నిలిచింది. గతేడాది నవంబర్‌లో ఆసియాకప్‌లో చరిత్రాత్మక కాంస్య పతకం గెలిచిన 27 ఏళ్ల మనిక... తాజాగా దోహాలో జరిగిన డబ్ల్యూటీటీ కంటెండర్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరింది. దీంతో 140 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆమె మూడు ర్యాంకులు మెరుగుపరుచుకుంది.


ఆంధ్ర ఇన్నింగ్స్‌ విజయం

ఈనాడు, విజయనగరం: రంజీ ట్రోఫీ గ్రూపు దశను ఆంధ్ర ఘనంగా ముగించింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఎలైట్‌ గ్రూపు-బి మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్‌, 95 పరుగుల ఆధిక్యంతో అస్సాంను చిత్తుచేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 62/5తో గురువారం ఉదయం ఆట కొనసాగించిన అస్సాం రెండో ఇన్నింగ్స్‌లో 54.1 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. లలిత్‌ మోహన్‌ (5/40), షోయబ్‌ఖాన్‌ (2/30), మాధవ రాయుడు (2/34) విజృంభించి జట్టుకు విజయాన్ని అందించారు. 26 పాయింట్లు సాధించిన ఆంధ్ర ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గ్రూపు దశ ముగిశాక పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే ఆంధ్ర ప్రథమ స్థానం సాధించినా.. క్వార్టర్స్‌ బెర్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సౌరాష్ట్ర (26), మహారాష్ట్ర (25), ముంబయి (23) కూడా రేసులో ఉండటమే కారణం. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సమర్పించుకుంది. మ్యాచ్‌ డ్రా అయితే సౌరాష్ట్రకు ఒక పాయింటు లభిస్తుంది. అప్పుడు సౌరాష్ట్ర క్వార్టర్స్‌ చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే పాయింట్లేమీ రావు. అదే జరిగితే ఆంధ్ర, సౌరాష్ట్ర 26 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. గ్రూపు దశలో సౌరాష్ట్రపై నెగ్గిన ఆంధ్ర ముందంజ వేస్తుంది. మహారాష్ట్ర, ముంబయి మధ్య మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. రెండు జట్ల తొలి ఇన్నింగ్స్‌ స్కోర్లు టై అవడం విశేషం. మహారాష్ట్ర 384 పరుగులు సాధించగా.. ముంబయి కూడా సరిగ్గా 384 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే మహారాష్ట్ర, ముంబయిలకు చెరో పాయింటు లభిస్తుంది. అప్పుడు ముంబయి క్వార్టర్స్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. 26 పాయింట్లతో ఆంధ్ర, మహారాష్ట్ర సమంగా నిలుస్తాయి. ఈ రెండు జట్ల మధ్య ఒక జట్టు ముందుకెళ్లాల్సి వస్తే గ్రూపు దశలో ఆంధ్రపై గెలిచిన మహారాష్ట్ర ముందంజ వేస్తుంది.


కష్టాల్లో హైదరాబాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ సీజన్‌ గ్రూపు దశ చివరి మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌కు ఊరట దక్కేలా లేదు. దిల్లీతో మ్యాచ్‌ ఆఖరి రోజు బ్యాటర్లతో పాటు బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేస్తేనే హైదరాబాద్‌ ఓటమి నుంచి బయటపడుతుంది. ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గురువారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో  5 వికెట్లకు 90 పరుగులు చేసింది. దిల్లీ పేసర్‌ హర్షిత్‌ రానా (5/27) దెబ్బకు హైదరాబాద్‌ ఆటగాళ్లు బ్యాట్లెత్తేశారు. సంతోష్‌గౌడ్‌ (20 బ్యాటింగ్‌), శశాంక్‌ లోకేశ్‌ (12 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 12 పరుగుల ముందంజలో ఉన్న హైదరాబాద్‌ ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యం ఉంచుతుందన్నది కీలకం. శుక్రవారం మ్యాచ్‌కు చివరి రోజు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 223/5తో మూడో రోజు ఉదయం ఆట కొనసాగించిన దిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 433 పరుగులకు ఆలౌటైంది. 78 పరుగుల ఆధిక్యం సంపాదించింది.


పారిస్‌లోనూ తటస్థ అథ్లెట్లుగా రష్యా క్రీడాకారులు: ఐఓసీ

జెనివా: 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రష్యన్‌ క్రీడాకారులు తటస్థ అథ్లెట్లుగా పోటీపడాలని తాము కోరుకుంటున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) స్పష్టంచేసింది. రష్యా క్రీడాకారులను తటస్థ క్రీడాకారులుగా కూడా ఒలింపిక్స్‌లో పోటీపడనివ్వొద్దని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన విజ్ఞప్తిని ఐఓసీ తోసిపుచ్చింది. కేవలం పాస్‌పోర్ట్‌ ఆధారంగా అథ్లెట్లు వివక్షను ఎదుర్కోకూడదని పేర్కొంది. ‘‘కఠినమైన షరతులకు లోబడి అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మార్గం అన్వేషించాలి’’ అని ఐఓసీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని