సంక్షిప్త వార్తలు (8)

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్‌ ఎవరన్నది శనివారం తేలిపోనుంది. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన అయిదో సీడ్‌ సబలెంక (బెలారస్‌).. మొదటి సారి ఈ టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించిన 22వ సీడ్‌ రిబకినా (కజకిస్థాన్‌)తో తలపడుతోంది.

Updated : 28 Jan 2023 03:46 IST

ఛాంపియన్‌ ఎవరో?
మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు
సబలెంకతో రిబకినా ఢీ
మధ్యాహ్నం 2 నుంచి

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్‌ ఎవరన్నది శనివారం తేలిపోనుంది. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన అయిదో సీడ్‌ సబలెంక (బెలారస్‌).. మొదటి సారి ఈ టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించిన 22వ సీడ్‌ రిబకినా (కజకిస్థాన్‌)తో తలపడుతోంది. ఎవరు గెలిచినా వాళ్లకిదే తొలి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ కానుంది. 23 ఏళ్ల రిబకినా గతేడాది వింబుల్డన్‌తో గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టింది. మరోవైపు సబలెంకకు ఈ ఏడాది ఓటమన్నదే లేదు. ఇప్పటివరకూ ఆడిన పది మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. పైగా ఒక్క సెట్‌ కూడా కోల్పోలేదు. అంతే కాకుండా ఇప్పటివరకూ రిబకినాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆమెదే పైచేయి.


ముగిసిన భారత్‌ పోరాటం

జకర్తా: ఇండోనేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. స్టార్‌ ఆటగాడు లక్ష్యసేన్‌, డబుల్స్‌ జోడీ అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టోలకు చుక్కెదురైంది. శుక్రవారం పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఏడో సీడ్‌ లక్ష్యసేన్‌ 21-15, 10-21, 13-21తో నాలుగో సీడ్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో అశ్విని- తనీషా జోడీ 13-21, 18-21తో ఫుకుషిమా- సయాక (జపాన్‌) జంట చేతిలో పరాజయం చవిచూసింది.


అక్కడ అంతా మహిళా అంపైర్లే

దుబాయ్‌: దక్షిణాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 10న ఆరంభమయ్యే అమ్మాయిల టీ20 ప్రపంచకప్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ టోర్నీలో అంపైర్లు, రిఫరీలంతా మహిళలే! వీరిలో భారత్‌ నుంచి జీఎస్‌ లక్ష్మీ, వృందా రాఠి, జనని నారాయణన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రిఫరీ లక్ష్మీది ఆంధ్రప్రదేశ్‌. ఈ టోర్నీకి ఐసీసీ ముగ్గురు రిఫరీలు, పది మంది అంపైర్లను ఎంపిక చేసింది. జనని, వృందా మొదటిసారి టీ20 ప్రపంచకప్‌లో బాధ్యతలు చేపట్టనున్నారు.


హైదరాబాద్‌కు ఆరో ఓటమి

ఈనాడు, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీలో వరుసగా ఆరో పరాజయంతో హైదరాబాద్‌ సీజన్‌ను ముగించింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో దిల్లీ 9 వికెట్ల తేడాతో ఆతిథ్య హైదరాబాద్‌ను చిత్తుచేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 90/5తో నాలుగో రోజు ఉదయం ఆట కొనసాగించిన హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులకు ఆలౌటైంది. హర్షిత్‌ రాణా (7/45), దివిజ్‌ మెహ్రా (3/34) విజృంభించారు. 47 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న హైదరాబాద్‌ తర్వాత అన్ని మ్యాచ్‌ల్లో ఓడింది.  ఒకేఒక్క పాయింటుతో గ్రూపు-బి అట్టడుగు (8వ) స్థానానికి పరిమితమైంది. ఈ గ్రూప్‌లో సౌరాష్ట్ర, ఆంధ్ర, మహారాష్ట్ర  26 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే బోనస్‌ పాయింట్ల ఆధారంగా సౌరాష్ట్ర, ఆంధ్ర క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించాయి.


విజృంభించిన అనూష

వడోదర: బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే మ్యాచ్‌లో అనూష (5/10) విజృంభించడంతో శుక్రవారం త్రిపురపై ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట అనూష ధాటికి త్రిపుర 26.1 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. అనూషతో పాటు శ్రీచరణి (2/11), పుష్పలత (2/13) కూడా రాణించారు. ఛేదనలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఆంధ్ర 20 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఝాన్సీలక్ష్మి (35 నాటౌట్‌) మెరిసింది. గువాహతిలో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌ 3 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్‌ చేతిలో ఓడింది.


చాలా పని చేయాలి: ఫార్ములా-ఈ సీఈవో

దిల్లీ: హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనున్న ఫార్ములా-ఈ ఛాంపియన్‌షిప్‌ నిర్వహణ కోసం ఇంకా చాలా పని చేయాల్సి ఉందని దాని సీఈవో జేమీ రీగల్‌ అన్నాడు. అయితే గడువు లోపు అన్ని అడ్డంకుల్ని అధిగమిస్తామని తెలిపాడు. వచ్చేనెల 11న హైదరాబాద్‌లో మొదటి ఫార్ములా-ఈ ఛాంపియన్‌షిప్‌ జరుగనుంది. ‘‘హైదరాబాద్‌ వెళ్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ప్రపంచంలో ఎప్పుడైనా కొత్త నగరానికి మొదటి సారి వెళ్తున్నప్పుడు అడ్డంకులు కచ్చితంగా ఉంటాయి. రేసుకు ఇంకా కొన్ని వారాలే గడువుంది. ఇంకా చాలా పని చేయాల్సి ఉంది. అయితే ఇలాంటివి గతంలో చూశాం. అడ్డంకుల్ని అధిగమించడం ఫార్ములా-ఈ కథలో భాగం’’ అని రీగల్‌ పేర్కొన్నాడు.


జకో మ్యాచ్‌కు తండ్రి దూరం

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు అతని తండ్రి సర్జాన్‌ దూరంగా ఉన్నాడు. క్వార్టర్స్‌లో రష్యా ఆటగాడు రుబ్లెవ్‌పై జకో గెలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ అనంతరం రష్యా జాతీయ పతాకాలను ప్రదర్శించిన కొంతమంది గుంపులో సర్జాన్‌ కూడా చిక్కుకున్నాడు. రష్యా జెండాలను ప్రదర్శించిన వ్యక్తులను నిర్వాహకులు బయటకు పంపించారు. అయితే ఆ వ్యక్తులతో తాను కూడా ఉన్నట్లు వీడియోలో రావడంతో సర్జాన్‌ సెమీస్‌ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలారస్‌ ప్లేయర్లను తటస్థ అథ్లెట్లుగా టోర్నీలో ఆడేందుకు అనుమతించారు. మ్యాచ్‌ల సందర్భంగా ఆ దేశాల జెండాలను ప్రదర్శించడాన్ని నిషేధించారు. మరోవైపు 2008 తర్వాత తొలిసారి జకోవిచ్‌ ఆట చూడడం కోసం అతని తల్లిదండ్రులు, సోదరుడు ఆస్ట్రేలియాకు వచ్చారు.


పోటీలకు దూరంగా అగ్రశ్రేణి రెజ్లర్లు

దిల్లీ: పోటీలకు సిద్ధంగా లేమని చెప్తూ జాగ్రెబ్‌ ఓపెన్‌ నుంచి వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా సహా ఎనిమిది మంది రెజ్లర్లు తప్పుకోవడం చర్చనీయాంశమైంది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) వ్యవహారాలు చూసుకుంటున్న పర్యవేక్షక కమిటీ బుధవారం ఆరంభమయ్యే టోర్నీ కోసం 36 మంది రెజ్లర్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కానీ వినేశ్‌ (53 కేజీలు), బజ్‌రంగ్‌ (65 కేజీలు) రవి దహియా (57 కేజీలు), దీపక్‌ పునియా (86 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు), బజ్‌రంగ్‌ భార్య సంగీత ఫొగాట్‌ (62 కేజీలు), సరితా మోర్‌ (59 కేజీలు), జితేంద్ర కిన్హా (79 కేజీలు) టోర్నీలో పాల్గొనబోమని సమాచారమిచ్చారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై పలు ఆరోపణలతో మూడు రోజులు ధర్నా చేసిన రెజ్లర్లు.. అతణ్ని పదవి నుంచి తప్పించేంతవరకూ జాతీయ లేదా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనబోమని అప్పుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాగ్రెబ్‌ ఓపెన్‌కు ఎంపిక చేసిన తర్వాత, పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేమని చెప్పడం గమనార్హం. ‘‘పోటీపడేందుకు వంద శాతం సిద్ధంగా లేమని ఈ రెజ్లర్లు తెలిపారు. జట్టుకు ఎంపికైన తర్వాత వీళ్లు పోటీపడాల్సింది. కానీ ఇలా చేయడం సరికాదు’’ అని సాయ్‌ వర్గాలు చెప్పాయి. ధర్నా కారణంగా రెజ్లర్లు సాధనకు దూరమయ్యారని, అందుకే పోటీల నుంచి తప్పుకున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని