రికీ అజేయ సెంచరీ

మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌ను ఆంధ్ర బలంగా ఆరంభించింది. రికీ భుయ్‌ (115 బ్యాటింగ్‌; 200 బంతుల్లో 12×4, 1×6) అజేయ సెంచరీతో మెరవడంతో భారీ స్కోరుకు పునాది వేసుకుంది.

Published : 01 Feb 2023 02:40 IST

ఆంధ్ర 262/2
మధ్యప్రదేశ్‌తో రంజీ క్వార్టర్స్‌

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌ను ఆంధ్ర బలంగా ఆరంభించింది. రికీ భుయ్‌ (115 బ్యాటింగ్‌; 200 బంతుల్లో 12×4, 1×6) అజేయ సెంచరీతో మెరవడంతో భారీ స్కోరుకు పునాది వేసుకుంది. తొలి రోజు, మంగళవారం ఆట చివరికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 262/2తో నిలిచింది. రికీతో పాటు కరణ్‌ షిండే (83 బ్యాటింగ్‌; 222 బంతుల్లో 9×4, 1×6) సత్తా చాటాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 58/2తో ఇబ్బందుల్లో పడింది. కెప్టెన్‌ హనుమ విహారి (16) కూడా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అవేశ్‌ఖాన్‌ బౌన్సర్‌ను ఆడే క్రమంలో విహారి మణికట్టుకు గాయమైంది. ఈ స్థితిలో కరణ్‌తో కలిసి రికీ ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. ఈ క్రమంలో భుయ్‌ సెంచరీ చేయగా.. కరణ్‌ శతకానికి చేరువలో ఉన్నాడు.

9వ స్థానంలో వచ్చి శతకం

రాజ్‌కోట్‌: 148/8.. పంజాబ్‌తో క్వార్టర్స్‌లో ఒక దశలో సౌరాష్ట్ర స్కోరిది. కనీసం 150 అయినా దాటుతుందా అనిపించింది. కానీ 303తో తొలి ఇన్నింగ్స్‌ ముగించింది సౌరాష్ట్ర. కారణం పార్థ్‌ భట్‌ (111 నాటౌట్‌; 155 బంతుల్లో 11×4, 4×6). తొమ్మిదో స్థానంలో వచ్చి అజేయ సెంచరీతో అదరగొట్టిన ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ సౌరాష్ట్రకు ఊహించని స్కోరు సాధించి పెట్టాడు. మయాంక్‌ మార్కండె (4/84), బాల్‌ తేజ్‌ (3/60), సిద్ధార్థ్‌ కౌల్‌  (2/81)ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయిన సౌరాష్ట్రను చేతన్‌ సకారియా (22), యవరాజ్‌సింగ్‌ (17)తో కలిసి పార్థ్‌ 300 దాటించాడు. తొమ్మిదో వికెట్‌కు సకారియాతో 61 పరుగులు జోడించిన పార్థ్‌.. పదో వికెట్‌కు యువరాజ్‌తో కలిసి 95 పరుగులు జత చేశాడు. ఆట చివరికి పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3/0తో నిలిచింది.

విజృంభించిన ఆకాశ్‌దీప్‌, ముకేశ్‌

కోల్‌కతా: పేసర్లు ఆకాశ్‌దీప్‌ (4/62), ముకేశ్‌ కుమార్‌ (3/61) విజృంభించడంతో బెంగాల్‌తో రంజీ క్వార్టర్స్‌లో ఝార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది. కుమార్‌ సూరజ్‌ (89 నాటౌట్‌) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. పంకజ్‌ (21), ఆశిష్‌ (12)తో కలిసి సూరజ్‌ ఝార్ఖండ్‌ను ఆదుకున్నాడు. వెలుతురు లేమి కారణంగా బెంగాల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించలేదు. బెంగళూరులో ఉత్తరాఖండ్‌తో ఆరంభమైన క్వార్టర్స్‌లో కర్ణాటక తొలి రోజే మ్యాచ్‌పై పట్టు బిగించింది. కర్ణాటక బౌలర్ల ధాటికి ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. కునాల్‌ (31) టాప్‌ స్కోరర్‌. పేసర్‌ వెంకటేశ్‌ (5/36) ప్రత్యర్థి పతనంలో కీలకపాత్ర పోషించాడు. గౌతమ్‌ (2/22), విద్వత్‌ (2/17) కూడా రాణించారు. ఆట చివరికి కర్ణాటక 123/0తో నిలిచింది. సమర్థ్‌ (54), కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (65) క్రీజులో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు