సంక్షిప్త వార్తలు (3)

డేవిస్‌ కప్‌ ప్రపంచ గ్రూపు-1లో చోటును కాపాడుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభమయ్యే ప్లేఆఫ్‌ పోరులో డెన్మార్క్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది.

Published : 03 Feb 2023 03:47 IST

భారత్‌కు డెన్మార్క్‌ సవాల్‌
నేటినుంచే డేవిస్‌కప్‌ పోరు

హిలెరోడ్‌ (డెన్మార్క్‌): డేవిస్‌ కప్‌ ప్రపంచ గ్రూపు-1లో చోటును కాపాడుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభమయ్యే ప్లేఆఫ్‌ పోరులో డెన్మార్క్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. నిరుడు మార్చిలో స్వదేశంలో జరిగిన పోరులో భారత్‌ 4-0తో డెన్మార్క్‌ను చిత్తుచేసింది. అయితే ఈసారి డెన్మార్క్‌ను ఓడించడం అంత సులువు కాకపోవచ్చు. భారత జట్టులో 300లోపు ర్యాంకింగ్‌ కలిగిన ఆటగాడు ఒక్కరూ లేరు. అదే సమయంలో ప్రపంచ 9వ ర్యాంకర్‌ హోల్గర్‌ రూన్‌ ఆధ్వర్యంలో డెన్మార్క్‌ బరిలో దిగుతుంది. ఇటీవలి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌ చేరుకున్న రూన్‌.. 2022లో మూడు ఏటీపీ టైటిళ్లు గెలిచాడు. భారత ప్రపంచ గ్రూపు ఆశలకు 19 ఏళ్ల రూన్‌ అతిపెద్ద అడ్డంకి. దీంతో తక్కువ ర్యాంకర్లు ఆగస్ట్‌ హోల్మ్‌గ్రెన్‌ (484), ఎల్మెర్‌ మోలర్‌ (718)లను లక్ష్యంగా చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. సింగిల్స్‌లో యుకి బాంబ్రి (571), సుమిత్‌ నగాల్‌ (509)లపై ఆశలు పెట్టుకుంది. రూన్‌తో యుకి, హోల్మ్‌గ్రెన్‌తో సుమిత్‌ తలపడనున్నారు. డబుల్స్‌లో రోహన్‌ బోపన్న అనుభవం పనికొస్తుందని జట్టు నమ్మకంతో ఉంది. 2019లో కొత్త ఫార్మాట్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌ ప్రపంచ గ్రూపు-1లో కొనసాగుతోంది. ఇప్పుడు ఆ స్థానాన్ని కాపాడుకోవడం సవాలే.


అమన్‌కు కాంస్యం

జాగ్రెబ్‌ (క్రొయేషియా): భారత యువ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ సత్తా చాటాడు. జాగ్రెబ్‌ ఓపెన్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మెరిశాడు. పురుషుల 57 కేజీల కాంస్య పతక పోరులో అతడు 10-4తో జాన్‌ రోడ్స్‌ (అమెరికా)ను ఓడించాడు. మరో భారత రెజ్లర్‌ పృథ్వీరాజ్‌ పాటిల్‌ (92 కేజీ) సెమీస్‌లో ఓడినా.. రెపిచేజ్‌కు అర్హత సాధించి కాంస్య పతక రేసులో నిలిచాడు.


మలన్‌, బట్లర్‌ శతకాలు

మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ విజయం

కింబర్లీ (దక్షిణాఫ్రికా): కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (131; 127 బంతుల్లో 6×4, 7×6), డేవిడ్‌ మలన్‌ (118; 114 బంతుల్లో 7×4, 6×6) శతక్కొట్టడంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు ఊరట విజయం లభించింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో దక్షిణాఫ్రికా సిరీస్‌ను గెలుచుకోగా.. ఆఖరి పోరులో గెలుపుతో ఇంగ్లాండ్‌ పరువు కాపాడుకుంది. మూడో వన్డేలో 59 పరుగుల ఆధిక్యంతో ఆతిథ్య జట్టును చిత్తుచేసింది. తొలుత ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 346 పరుగులు సాధించింది. 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న జట్టును ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బట్లర్‌, ఓపెనర్‌ మలన్‌ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 232 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ (41; 23 బంతుల్లో 2×4, 4×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ స్కోరును 300 పరుగులు దాటించాడు. సఫారీ బౌలర్‌ ఎంగిడి (4/62) రాణించాడు. అనంతరం జోఫ్రా ఆర్చర్‌ (6/49) దెబ్బకు దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. 43.1 ఓవర్లలో 287 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది. హెండ్రిక్స్‌ (52; 61 బంతుల్లో 6×4), క్లాసెన్‌ (80; 62 బంతుల్లో 7×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని