భారత్‌పై విజయం.. యాషెస్‌ కంటే గొప్పది!

భారత్‌లో టెస్టు సిరీస్‌ విజయం యాషెస్‌ గెలుపు కంటే గొప్పదని స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ సహా ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు అన్నారు.

Published : 07 Feb 2023 03:15 IST

నాగ్‌పుర్‌: భారత్‌లో టెస్టు సిరీస్‌ విజయం యాషెస్‌ గెలుపు కంటే గొప్పదని స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ సహా ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు అన్నారు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ గురువారం ప్రారంభంకానుంది. ‘‘సిరీస్‌ సంగతి అటుంచితే భారత్‌లో టెస్టు మ్యాచ్‌ గెలవడమే కష్టం. ఒకవేళ ఆ పని చేయగలిగితే చాలా గొప్ప విషయమే. భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలిస్తే యాషెస్‌ విజయం కంటే గొప్పదని భావిస్తున్నా’’ అని స్మిత్‌ తెలిపాడు. ‘‘గత యాషెస్‌ సిరీస్‌లో భాగమవడం అద్భుతంగా అనిపించింది. అయితే భారత్‌కు వెళ్లి.. వారి సొంతగడ్డపైనే ఓడించడం టెస్టు క్రికెట్లోనే అత్యంత కఠినమైన సవాల్‌. ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు. ‘‘భారత్‌లో ఆసీస్‌ గెలిచి చాలా కాలమై ఉండొచ్చు. లేదా తక్కువ నెగ్గి ఉండొచ్చు. భారత్‌లో సిరీస్‌ విజయం ప్రపంచ క్రికెట్లో ప్రతి ఒక్కరి లక్ష్యం’’ అని పేసర్‌ హేజిల్‌వుడ్‌ వివరించాడు. భారత్‌లో సిరీస్‌ విజయం ఆసీస్‌కు చాలా ప్రత్యేకమని.. అక్కడి పరిస్థితులు క్లిష్టంగా ఉంటాయని పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అన్నాడు. ‘‘భారత్‌లో సిరీస్‌ గెలవడం యాషెస్‌తో సమానం. చాలా అరుదు కూడా. కెరీర్‌లోనే గొప్ప ఘనత అవుతుంది’’ అని కెప్టెన్‌ కమిన్స్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని