IND vs AUS: ఉచ్చులో పడ్డారు
కాస్త తడబడితేనేమీ.. కాస్త పరీక్షను ఎదుర్కొంటేనేమీ.. సొంతగడ్డపై టీమ్ఇండియాకు ఎదురులేదని మరోసారి రుజువైంది.
జడేజా మాయ
ఆసీస్ 113కే ఆలౌట్
భారత్దే రెండో టెస్టు
కాస్త తడబడితేనేమీ.. కాస్త పరీక్షను ఎదుర్కొంటేనేమీ.. సొంతగడ్డపై టీమ్ఇండియాకు ఎదురులేదని మరోసారి రుజువైంది. తొలి రెండు రోజుల ఆటతో కోట్లాను కొట్టేయొచ్చనుకున్న ఆసీస్కు శరాఘాతం!
కంగారూలను స్పిన్ ఉచ్చులో బిగించి ఉక్కిరిబిక్కిరి చేసిన భారత్.. రెండో టెస్టులోనూ నెగ్గి సిరీస్లో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది. హీరో రవీంద్ర జడేజా!
మ్యాచ్లో ఆస్ట్రేలియా తనకంటూ అవకాశాలు సృష్టించుకున్నా.. టీమ్ఇండియా పుంజుకున్న తీరు అద్భుతం. కఠినమైన పిచ్పై మూడో రోజు ప్రత్యర్థి కనీసం 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా ఛేదించడం కష్టం అనుకుంటే, ఓ దశలో ఆ జట్టు 85/2తో ఇంకా మంచి స్కోరే సాధించేలా కనిపించి భయపెట్టింది. కానీ జడేజా స్పిన్ మాయాజాలానికి దాసోహమంటూ 28 పరుగుల తేడాలో చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయి కుప్పకూలింది.
అయినా భారత్ పని తేలిక కాలేదు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్ఇండియాకు చెమటోడ్చక తప్పలేదు. వందో టెస్టు ఆడుతున్న పుజారా.. క్లిష్ట పరిస్థితుల్లో ఇన్నింగ్స్కు ఇరుసులా నిలిచి జట్టును విజయపథంలో నడిపించాడు. అసలైన బహుమతి ఏంటంటే.. ఈ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తుకు భారత్ మరింత చేరువైంది.
ఆస్ట్రేలియాలో ఆశలు రేగినా దిల్లీలో ఆఖరికి టీమ్ఇండియాదే పైచేయి. మూడు రోజుల్లోనే ఖేల్ఖతం. జడేజా (7/42) విజృంభించిన వేళ రెండో టెస్టులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్లో 2-0 ఆధిక్యం సంపాదించింది. ఓవర్నైట్ స్కోరు 61/1తో మూడో రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. జడేజా ధాటికి 113 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. హెడ్ (43), లబుషేన్ (35) మినహా ఆసీస్ బ్యాటర్లలో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి కష్టంగా ఛేదించింది. రోహిత్ (31; 20 బంతుల్లో 3×4, 2×6) ధాటైన బ్యాటింగ్తో విలువైన పరుగులు చేయగా.. పుజారా (31 నాటౌట్; 74 బంతుల్లో 4×4), భరత్ (23 నాటౌట్; 22 బంతుల్లో 3×4, 1×6) కీలక ఇన్నింగ్స్తో కంగారూలకు అడ్డుగా నిలిచారు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై భారత్కు ఇది 100వ విజయం కావడం విశేషం. జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.మూడో టెస్టు మార్చి 1న ఇండోర్లో ఆరంభమవుతుంది.
జడ్డూ చుట్టేశాడు: బ్యాటింగ్కు అత్యంత కఠినంగా ఉన్న పిచ్పై టీమ్ఇండియా ముందు స్వల్ప లక్ష్యమే నిలిచిందంటే ప్రధాన కారణం జడేజానే. కంగారూలను అతడు తన స్పిన్తో బెంబేలెత్తించాడు. పేలవ షాట్లూ కంగారూలను ముంచాయి. బంతి తక్కువ ఎత్తులో వస్తున్న పిచ్పై ఆరుగురు ఆసీస్ బ్యాటర్లు స్వీప్ లేదా రివర్స్ స్వీఫ్ షాట్లకు ఔట్ కావడం గమనార్హం. జడేజా బంతిని పెద్దగా స్పిన్ చేయకుండానే ఆ జట్టును దెబ్బతీశాడు. ఓవర్నైట్ స్కోరు 61/1తో మూడో రోజు బ్యాటింగ్ను కొనసాగించిన ఆసీస్.. హెడ్ వికెట్ను కోల్పోయినా ఓ దశలో 85/2తో నిలవడంతో భారత్కు ఆందోళన తప్పలేదు. ఎందుకంటే ఆ పిచ్పై 150 లక్ష్యాన్ని ఛేదించడం కూడా కష్టమన్నది అంచనా. పైగా బ్యాటర్లు స్వీప్ షాట్లు బాగా ఆడుతున్నారు. కానీ జడేజా ఆ జట్టు ఆట సాగనివ్వలేదు. అయితే మూడో రోజు ఆ జట్టు పతనానికి బలమైన పునాది వేసింది మాత్రం అశ్వినే. మొదట హెడ్ను ఔట్ చేసిన అతడు.. కీలక సమయంలో స్మిత్ (9)ను వెనక్కి పంపాడు. స్లాగ్ స్వీప్ ఆడబోయిన స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ ఆసీస్ మంచి స్థితిలోనే ఉంది. కానీ ఆసీస్ లైనప్ను జడేజా కకావికలం చేశాడు. ఆ జట్టు ఒకే స్కోరు (ఆసీస్ 95) వద్ద ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్లో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఇందులో జడేజా తీసినవే మూడు. ఓ బంతిని నేరుగా వేసి లబుషేన్ను బౌల్డ్ చేసిన అతడు.. తన తర్వాతి ఓవర్లో హ్యాండ్స్కాంబ్ (0), కమిన్స్ (0)ను వెనక్కి పంపాడు. హ్యాండ్స్కాంబ్ క్యాచ్ ఔట్ కాగా.. స్వీప్ షాట్ ఆడబోయి కమిన్స్ బౌల్డయ్యాడు. వీళ్లకన్నా ముందు అశ్విన్ బౌలింగ్లో స్వీప్ చేసే ప్రయత్నంలో రెన్షా (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. కేరీ (7)దీ అదే కథ. పెద్దగా టర్న్ కాని జడేజా బంతిని రివర్స్ స్వీప్ చేసే ప్రయత్నంలో బోల్తా కొట్టాడు. బౌల్డై ఎనిమిదో వికెట్గా నిష్క్రమించాడు. లైయన్ (8), కునెమన్ (0)లను జడ్డూ ఎంతో సేపు నిలవనివ్వలేదు. ఇద్దరినీ బౌల్డ్ చేశాడు.
పుజారా నిలిచాడు: లక్ష్యం చిన్నదే అయినా తేలికైందేమీ కాదు. ఈ నేపథ్యంలో రాహుల్ (1) పేలవ ఫామ్ను కొనసాగించాడు. రెండో ఓవర్లోనే అతణ్ని ఔట్ చేయడం ద్వారా భారత్కు లైయన్ షాకిచ్చాడు. లంచ్ సమయానికి స్కోరు 14/1. అయితే లంచ్ తర్వాత రోహిత్ ఎటాకింగ్కు దిగాడు. తక్కువ ఎత్తులో బంతి వస్తున్న పిచ్పై స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో చూపిస్తూ విలువైన పరుగులు చేశాడు. లైయన్ ఓవర్లో లాఫ్టెడ్ షాట్తో సిక్స్, స్వీప్తో ఫోర్ కొట్టిన అతడు.. కునెమన్ ఓవర్లోనూ ఓ సిక్స్ దంచాడు. ఓ వైపు పుజారా నిలబడితే.. మరోవైపు బ్యాటర్ ధాటిగా ఆడి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాలన్నది జట్టు ఆలోచన. దానికి తగ్గట్లే బ్యాటింగ్ చేసిన రోహిత్.. దురదృష్టవశాత్తు జోరు మీదున్న దశలో పుజారాతో సమన్వయ లోపంతో రనౌటయ్యాడు. మరోవైపు పుజారా మాత్రం పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ను నడిపించాడు. ఆసీస్ బౌలర్లు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కోహ్లి (20; 31 బంతుల్లో 3×4), శ్రేయస్ (12; 10 బంతుల్లో 1×4, 1×6) కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగారు. ముందుకొచ్చి ఆడబోయిన కోహ్లి స్టంపౌట్ కాగా.. శ్రేయస్ డీప్ మిడ్వికెట్లో దొరికిపోయాడు. అయితే భారత్ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగింది. కానీ ముప్పు మాత్రం తొలగిపోలేదు. శ్రేయస్ ఔటయ్యేప్పటికి స్కోరు 88/4. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన వికెట్కీపర్ కేఎస్ భరత్.. ఆస్ట్రేలియాకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ధనాధన్ బ్యాటింగ్తో భారత్ను వేగంగా లక్ష్యం దిశగా నడిపించాడు. మర్ఫీ బౌలింగ్లో పుజారా ముందుకొచ్చి బౌండరీ సాధించడంతో టీమ్ఇండియా విజయాన్నందుకుంది.
రాహుల్కు మద్దతిస్తూనే ఉంటాం: ద్రవిడ్
టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి మద్దతుగా నిలిచాడు. ‘‘రాహుల్ కెరీర్లో ఇది ఒక దశ మాత్రమే. అతడు విదేశాల్లో మా విజయవంతమైన ఓపెనర్లలో ఒకడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లలో శతకాలు సాధించాడు. రాహుల్కు మా మద్దతు కొనసాగిస్తాం. ప్రస్తుత స్థితి నుంచి బయటపడే నైపుణ్యం రాహుల్ వద్ద ఉంది’’ అని ద్రవిడ్ అన్నాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263
భారత్ తొలి ఇన్నింగ్స్: 262
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖవాజా (సి) శ్రేయస్ (బి) జడేజా 6; హెడ్ (సి) భరత్ (బి) అశ్విన్ 43; లబుషేన్ (బి) జడేజా 35; స్మిత్ ఎల్బీ (బి) అశ్విన్ 9; రెన్షా ఎల్బీ (బి) అశ్విన్ 2; హ్యాండ్స్కాంబ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; కేరీ (బి) జడేజా 7; కమిన్స్ (బి) జడేజా 0; లైయన్(బి) జడేజా 8; మర్ఫీ నాటౌట్ 3; కునెమన్ (బి) జడేజా 0; ఎక్స్ట్రాలు 0 మొత్తం: (31.1 ఓవర్లలో ఆలౌట్) 113; వికెట్ల పతనం: 1-23, 2-65, 3-85, 4-95, 5-95, 6-95, 7-95, 8-110, 9-113; బౌలింగ్: అశ్విన్ 16-3-59-3; షమి 2-0-10-0; జడేజా 12.1-1-42-7; అక్షర్ పటేల్ 1-0-2-0
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ రనౌట్ 31; రాహుల్ (సి) కేరీ (బి) లైయన్ 1; పుజారా నాటౌట్ 31; కోహ్లి (స్టంప్డ్) కేరీ (బి) మర్ఫీ 20; శ్రేయస్ అయ్యర్ (సి) మర్ఫీ (బి) లైయన్ 12; భరత్ నాటౌట్ 23; ఎక్స్ట్రాలు 0 మొత్తం: (26.4 ఓవర్లలో 4 వికెట్లకు) 118; వికెట్ల పతనం: 1-6, 2-39, 3-69, 4-88; బౌలింగ్: కునెమన్ 7-0-38-0; లైయన్ 12-3-49-2; మర్ఫీ 6.4-2-22-1; ట్రావిస్ హెడ్ 1-0-9-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ