గాయత్రి జోడీ జైత్రయాత్ర

సింధు నిష్క్రమించింది.. శ్రీకాంత్‌ పరాజయంపాలయ్యాడు, ప్రణయ్‌ వెనుదిరిగాడు, లక్ష్యసేన్‌ కథ ముగిసింది, డబుల్స్‌లో స్టార్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ జంట ఓడింది.

Published : 18 Mar 2023 02:19 IST

సెమీస్‌లో భారత జంట
శ్రీకాంత్‌, ప్రణయ్‌ పరాజయం
ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌
బర్మింగ్‌హామ్‌

సింధు నిష్క్రమించింది.. శ్రీకాంత్‌ పరాజయంపాలయ్యాడు, ప్రణయ్‌ వెనుదిరిగాడు, లక్ష్యసేన్‌ కథ ముగిసింది, డబుల్స్‌లో స్టార్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ జంట ఓడింది.   అగ్రశ్రేణి క్రీడాకారులు వరుసగా ఇంటిముఖం పడుతున్నా.. భారత ఆశలను మోస్తూ యువ జంట గాయత్రి గోపీచంద్‌, ట్రీసా జాలీ సత్తా చాటుతోంది. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఈ ఘనత సాధించింది. శుక్రవారం క్వార్టర్‌ఫైనల్లో గాయత్రి- ట్రీసా జోడీ 21-14, 18-21, 21-12తో వెన్‌ మీ- ల్యూ షువాన్‌ (చైనా) జంటపై విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 17-21, 15-21తో కొడయ్‌ నరవొక (జపాన్‌) చేతిలో, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 20-22, 21-15, 17-21తో ఆంథోనీ జింటింగ్‌ (ఇండోనేసియా) చేతిలో, లక్ష్యసేన్‌ 13-21, 15-21తో ఆండర్స్‌ ఆంథోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం చవిచూశారు.

నిరుడు చివరి నిమిషంలో ఆల్‌ ఇంగ్లాండ్‌ మెయిన్‌ డ్రాలో అడుగుపెట్టి రాణించిన గాయత్రి- ట్రీసా జంట ఈసారి రెట్టించిన ఉత్సాహంతో అదరగొడుతోంది. ఇప్పటికే తొలి రౌండ్లో ఏడో సీడ్‌.. ప్రిక్వార్టర్స్‌లో మాజీ నంబర్‌వన్‌ జోడీలకు షాకిచ్చింది. క్వార్టర్స్‌లో అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంది. పదునైన స్మాష్‌లు, అద్భుతమైన డ్రాప్‌లు, సాధికారిక ర్యాలీ గేమ్‌తో చైనా జంటను చిత్తుచేసింది. 54 నిమిషాల పోరులో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన గాయత్రి- ట్రీసా జోడీ 6-2తో మొదటి గేమ్‌ను మొదలుపెట్టింది. 6-6తో చైనా జంట పాయింట్లను సమం చేసినా పుంజుకుని 11-8తో పైచేయి కనబరిచింది. షటిల్‌పై పూర్తి నియంత్రణతో షాట్లు ఆడుతూ పాయింట్లు రాబట్టిన గాయత్రి- ట్రీసా జంట 18-12తో ముందంజ వేసింది. 21-14తో సాధికారికంగా తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌లోనూ 10-6తో ఆధిపత్యం ప్రదర్శించింది. లయ దొరకబుచ్చుకున్న వెన్‌- షువాన్‌ జోడీ పోటాపోటీగా ఆడింది. 13-15తో వెనుకంజలో ఉన్న స్థితి నుంచి 17-15తో ఆధిక్యం సంపాదించింది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 21-18తో రెండో గేమ్‌ నెగ్గింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఏకపక్షంగా సాగింది. గాయత్రి- ట్రీసా జోడీ వరుస పాయింట్లతో విజృంభించింది. 8-1తో గేమ్‌ను మొదలుపెట్టి 13-5తో ఆధిక్యం సంపాదించింది. చైనా జంటకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-12తో విజయభేరి మోగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని