సంక్షిప్త వార్తలు (3)

కొత్త కెప్టెన్‌ షై హోప్‌ (128) సెంచరీ కొట్టడంతో రెండో వన్డేలో వెస్టిండీస్‌ 48 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

Updated : 20 Mar 2023 04:31 IST

రెండో వన్డేలో వెస్టిండీస్‌ విజయం

ఈస్ట్‌లండన్‌: కొత్త కెప్టెన్‌ షై హోప్‌ (128) సెంచరీ కొట్టడంతో రెండో వన్డేలో వెస్టిండీస్‌ 48 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. సారథిగా హోప్‌కు ఇదే తొలి వన్డే. హోప్‌తో పాటు రోమన్‌ పావెల్‌ (46), పూరన్‌ (39), మేయర్స్‌ (36), బ్రెండన్‌ కింగ్‌ (30) రాణించడంతో మొదట విండీస్‌ 8 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 41.4 ఓవర్లలో 287 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్‌ బవుమా (144) శతకం వృథా అయింది. అకీల్‌ హొసీన్‌ (3/59), అల్జారి జోసెఫ్‌ (3/63) ఆ జట్టును దెబ్బతీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్‌ 1-0తో ఆధిక్యం సాధించింది. తొలి వన్డే వర్షం వల్ల రద్దయింది.


భారత ఆర్చర్లకు 10 పతకాలు

దిల్లీ: ఆసియాకప్‌ జూనియర్‌ స్టేజ్‌-1 ఆర్చరీ టోర్నమెంట్లో భారత్‌ మెరిసింది. ఈ టోర్నీలో మన ఆర్చర్లు అయిదు స్వర్ణాలు సహా పది పతకాలు కైవసం చేసుకుని భారత్‌ను అగ్రస్థానంలో నిలిపారు. చైనీస్‌ తైపీలోని టోయువాన్‌లో ముగిసిన ఈ పోటీల్లో చివరిరోజు మహిళల కాంపౌండ్‌ ఫైనల్లో భారత్‌ (ప్రగతి, ఐశ్వర్య, పర్ణీత్‌ కౌర్‌) 227-215తో కజకిస్థాన్‌ను ఓడించింది. పురుషుల కాంపౌండ్‌ తుది సమరంలో పవన్‌, వెంకట్‌, ప్రియాంశ్‌తో కూడిన మన బృందం 225-226తో మలేసియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ఫైనల్లో ప్రగతి 141-141తో సహచర ఆర్చర్‌ పర్ణీత్‌తో సమంగా నిలిచింది. కానీ లక్ష్యం మధ్య భాగానికి ఎక్కువ బాణాలు తగిలిన ప్రగతినే పసిడి వరించింది. పురుషుల రికర్వ్‌ తుది పోరులో పవన్‌-పార్థ్‌, రాంపాల్‌తో కూడిన భారత్‌ బృందం 5-2తో సౌదీ అరేబియాను ఓడించి స్వర్ణం అందుకుంది. పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత ఫైనల్లో రాంపాల్‌పై నెగ్గి రాహుల్‌ పసిడి నెగ్గాడు.


ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌ మళ్లీ పంకజ్‌కే

దోహా: భారత క్యూ సూపర్‌ స్టార్‌ పంకజ్‌ అద్వాని మరోసారి ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఫైనల్లో అతను 5-1తో బ్రిజేష్‌ దమానిపై విజయం సాధించాడు. పంకజ్‌కిది తొమ్మిదో ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని