సంక్షిప్త వార్తలు (4)

భారత మహిళల హాకీ స్టార్‌ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్‌బరేలీలోని ఒక స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని ‘రాణీస్‌ గర్ల్స్‌ హాకీ టర్ఫ్‌’ పేరిట పిలవనున్నారు.

Published : 22 Mar 2023 02:24 IST

స్టేడియానికి రాణి రాంపాల్‌ పేరు

దిల్లీ: భారత మహిళల హాకీ స్టార్‌ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్‌బరేలీలోని ఒక స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని ‘రాణీస్‌ గర్ల్స్‌ హాకీ టర్ఫ్‌’ పేరిట పిలవనున్నారు. మంగళవారం రాణీనే ఈ స్టేడియాన్ని ప్రారంభించింది. హాకీలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఆమే. ‘‘ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటల్లేవ్‌. యువతరానికి ఇదో స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని రాణి ట్విటర్‌లో పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్రాత్మక ప్రదర్శన తర్వాత గాయంతో చాలారోజులు భారత జట్టుకు దూరమైన ఈ మాజీ కెప్టెన్‌.. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనతో పునరాగమనం చేసింది.


క్లాసెన్‌ మెరుపు శతకం

విండీస్‌తో మూడో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం

పోచెఫ్‌స్ట్రూమ్‌: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. మంగళవారం మూడో వన్డేలో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (119 నాటౌట్‌; 61 బంతుల్లో 15×4, 5×6) సాధించడంతో 261 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు 6 వికెట్లు కోల్పోయి 29.3 ఓవర్లలోనే ఛేదించింది. విండీస్‌ బౌలర్లలో అల్జారి జోసెఫ్‌ (3/50), అకీల్‌ హొసీన్‌ (2/49) సత్తా చాటారు. మొదట జాన్సన్‌ (2/46), ఫోర్టుయిన్‌ (2/46), కొయెట్జీ (2/53)ల ధాటికి విండీస్‌ 260 పరుగులకే ఆలౌటైంది. కింగ్‌ (72) టాప్‌స్కోరర్‌. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో విండీస్‌ నెగ్గింది.


వన్డే ప్రపంచకప్‌ వేదికగా హైదరాబాద్‌!

దిల్లీ: ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌ వేదికల్లో ఒకటిగా హైదరాబాద్‌ను ప్రాథమికంగా బీసీసీఐ ఎంపిక చేసినట్లు సమాచారం. తుది నిర్ణయం తర్వాత బీసీసీఐ ఆ వేదికలను ప్రకటిస్తుంది. అందులో హైదరాబాద్‌ ఉంటే తెలుగు రాష్ట్రాల అభిమానులకు పండగే. ఈ ప్రపంచకప్‌ తేదీలు, వేదికలపై బీసీసీఐ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అక్టోబర్‌ 5న ఈ మెగా టోర్నీని ప్రారంభించి, నవంబర్‌ 19న ఫైనల్‌ నిర్వహించే అవకాశం ఉంది. 10 జట్లు పోటీపడే ఈ ప్రపంచకప్‌ వేదికలుగా కనీసం 12 మైదానాలను బీసీసీఐ ప్రాథమికంగా ఎంపిక చేసిందని సమాచారం. అహ్మదాబాద్‌ స్టేడియంలో ఫైనల్‌ జరిగే ఆస్కారముంది. దీంతో పాటు బెంగళూరు, చెన్నై, దిల్లీ, ధర్మశాల, గువాహతి, హైదరాబాద్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ఇందౌర్‌, రాజ్‌కోట్‌, ముంబయి వేదికలుగా బీసీసీఐ తొలి జాబితా రూపొందించిందని తెలిసింది.


ప్రధాన డ్రాకు సిక్కిజోడీ

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి- రోహన్‌ కపూర్‌ జోడీ ప్రధాన డ్రాకు అర్హత సాధించింది. మంగళవారం క్వాలిఫయర్స్‌లో ఈ జంట 21-17, 15-21, 21-18 తేడాతో ఫ్రాంజిస్కా- ప్యాట్రిక్‌ (జర్మనీ)పై గెలిచింది. తొలి రౌండ్లో ఈ భారత ద్వయం.. హీ యాంగ్‌- వీ హాన్‌ (సింగపూర్‌)తో తలపడుతుంది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి- ఆరతి 21-15, 15-21, 21-18తో పాలా- లారెన్‌ (అమెరికా)పై నెగ్గి ముందంజ వేసింది. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌ కూడా ప్రధాన డ్రాలో చోటు దక్కించుకుంది. క్వాలిఫయర్స్‌లో ఆమె 21-17, 21-7తో లారెన్‌ (అమెరికా)పై గెలిచింది. తొలి రౌండ్లో కిమ్‌ గా (కొరియా)ను ఆమె ఢీ కొడుతుంది. ఆకర్షి కశ్యప్‌, కిరణ్‌ జార్జ్‌, మిథున్‌ మంజునాథ్‌ కూడా అర్హత రౌండ్లో ఆడాల్సింది. కానీ ఇతర ప్లేయర్లు తప్పుకోవడంతో వీళ్లకు నేరుగా ప్రధాన డ్రా మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. మరోవైపు సింగిల్స్‌లో ప్రియాన్షు, మీరబా మైస్నమ్‌, డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప- సుమీత్‌ రెడ్డి, తనీష- అశ్విని పొన్నప్ప, సుమీత్‌- రోహన్‌ క్వాలిఫయర్స్‌లో ఓడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని