ఎదురులేని నిఖత్‌

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ అదరగొడుతోంది. టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా ఈ తెలంగాణ అమ్మాయి మరో అడుగు ముందుకేసింది.

Published : 22 Mar 2023 02:25 IST

క్వార్టర్స్‌లోకి ప్రవేశం
నీతు, మనీషా, జాస్మిన్‌ కూడా
ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ అదరగొడుతోంది. టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా ఈ తెలంగాణ అమ్మాయి మరో అడుగు ముందుకేసింది. మంగళవారం 50 కేజీల ప్రిక్వార్టర్స్‌లో ఆమె 5-0తో ప్యాట్రిసియా అల్వరెజ్‌ (మెక్సికో)ను చిత్తు చేసింది. ఆరంభం నుంచి పంచ్‌ పవర్‌ చూపించిన నిఖత్‌.. ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వలేదు. మంచి ఫుట్‌వర్క్‌కు తోడు లెఫ్ట్‌, రైట్‌ హుక్‌ల మేళవింపుతో దాడికి దిగిన జరీన్‌ ముందు ప్యాట్రిసియా తేలిపోయింది. ప్రతి రౌండ్లోనూ న్యాయ నిర్ణేతలంతా నిఖత్‌కే ఓటేయడంతో ఆమె ఘన విజయాన్ని అందుకుంది. మరోవైపు నీతు గాంగాస్‌ (48 కేజీ), మనీషా మౌన్‌ (57 కేజీ), జాస్మిన్‌ (60 కేజీ) క్వార్టర్‌ఫైనల్‌ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో సుమైయా ఖొసిమోవా (తజకిస్థాన్‌)ను నీతు నాకౌట్‌ చేసింది. తొలి రౌండ్లోనే నీతు పంచ్‌లకు సుమైవా తాళలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను ఆపేశాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో నూర్‌ తుర్హాన్‌ (తుర్కియే)పై మనీషా నెగ్గింది. ప్రత్యర్థి బాక్సర్‌ కంటే పొడగరి అయిన మనీషా  పదునైన పంచ్‌లతో అటాక్‌ చేసి విజయాన్ని అందుకుంది. మనీషా దూకుడుకు నూర్‌ ఆటను కొనసాగించలేకపోవడంతో రిఫరీ మ్యాచ్‌ను ఆపి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించాడు. ఇంకో ప్రిక్వార్టర్స్‌లో సమదోవా (తజకిస్థాన్‌)ను జాస్మిన్‌ ఓడించింది. మరోవైపు శశి చోప్రా (63 కేజీ), మంజు (66 కేజీ) టోర్నీ నుంచి నిష్క్రమించారు. కిటో (జపాన్‌) చేతిలో శశి.. ఖామిదోవా (ఉబ్బెకిస్థాన్‌) చేతిలో మంజు చిత్తయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని