నిఖత్‌కు పతకం ఖాయం

ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు)  అదరగొట్టింది. మహిళల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్స్‌లో సెమీఫైనల్‌ చేరడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది.

Published : 23 Mar 2023 03:00 IST

లవ్లీనా, స్వీటీ, నీతులకు కూడా..
సెమీస్‌లో నలుగురు భారత బాక్సర్లు
మహిళల ప్రపంచ బాక్సింగ్‌

ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు)  అదరగొట్టింది. మహిళల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్స్‌లో సెమీఫైనల్‌ చేరడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది. లవ్లీనా (75 కేజీలు) నీతు గాంగాస్‌ (48 కేజీలు), స్వీటీ బూర (81 కేజీలు) కూడా సెమీస్‌ చేరడంతో భారత్‌కు మొత్తం నాలుగు పతకాలు ఖరారయ్యాయి. టోర్నీ ఫేవరెట్‌ నిఖత్‌ బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 5-2తో థాయ్‌లాండ్‌కు చెందిన రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ కాంస్య పతక విజేత చుతామత్‌ రక్సాత్‌ను ఓడించింది. జాగ్రత్తగా ఎటాకింగ్‌ చేసిన నిఖత్‌ తొలి రెండు రౌండ్లలో ప్రత్యర్థిపై పదునైన పంచ్‌లు విసిరింది. అయితే చివరి రౌండ్లో ఆమె జోరు కాస్త తగ్గింది. నిఖత్‌ సెమీస్‌లో కొలంబియా అమ్మాయి ఇంగ్రిట్‌ వాలెన్సియాతో తలపడుతుంది. మరో క్వార్టర్స్‌లో లవ్లీనా 5-0తో రాడీ గ్రామేన్‌ (మొజాంబిక్‌)ను చిత్తు చేసింది. లవ్లీనా ఆద్యంతం ఆదిపత్యాన్ని ప్రదర్శించి మూడో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పతకాన్ని ఖాయం చేసుకుంది. కామన్వెల్త్‌ క్రీడల పసిడి విజేత నీతు క్వార్టర్స్‌లో మడోక వాదా (జపాన్‌)ను చిత్తుచేసింది. దూకుడు మీదున్న 22 ఏళ్ల నీతు బౌట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆమె పంచ్‌లకు ప్రత్యర్థికి తట్టుకోలేకపోయింది. దీంతో రెండో రౌండ్లో బౌట్‌ను ఆపిన రిఫరీ నీతును విజేతగా ప్రకటించాడు. ఈ టోర్నీలో వరుసగా మూడో బౌట్లోనూ ఆమె ప్రత్యర్థిని నాకౌట్‌ చేయడం విశేషం. మరోవైపు తొలి బౌట్లో బై లభించిన స్వీటీ క్వార్టర్స్‌లో సత్తాచాటింది. 30 ఏళ్ల స్వీటీ 5-0తో విక్టోరియా కెబికావా (బెలారస్‌)పై అలవోకగా గెలిచింది. సమయానుకూలంగా, పరిస్థితులకు తగినట్లు దాడి చేయడంతో పాటు ఆమె రక్షణాత్మకంగానూ వ్యవహరించింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రెండో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పతకాన్ని ఖాయం చేసుకుంది. స్వీటీ 2014లో రజతం నెగ్గింది. సాక్షి చౌదరి (52 కేజీలు), మనీషా (57 కేజీలు) క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. సాక్షి 0-5తో యూ వూ (చైనా) చేతిలో, మనీషా 1-4తో అమీన జిదాని (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయారు. జాస్మీన్‌ లంబోరియా (60కేజీ), నుపుర్‌ షెరాన్‌ (+81కేజీ) కూడా క్వార్టర్స్‌ దాటలేకపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు