సంక్షిప్త సమాచారం (4)

‘ద హండ్రెడ్‌’ టీ20 టోర్నమెంట్లో భారత మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌.. ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టు తరఫున బరిలో దిగనుంది.

Published : 25 Mar 2023 01:55 IST

ట్రెంట్‌ రాకెట్స్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌

లండన్‌: ‘ద హండ్రెడ్‌’ టీ20 టోర్నమెంట్లో భారత మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌.. ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టు తరఫున బరిలో దిగనుంది. వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన.. సదరన్‌ బ్రేవ్‌కు ఆడనుంది. తాజాగా ప్రకటించిన డ్రాఫ్ట్‌లో పురుషులు, మహిళల్లో కలిపి 64 మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. మహిళల డ్రాఫ్ట్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. పాకిస్థాన్‌ స్టార్లు షహీన్‌షా అఫ్రిది, హారిస్‌ రవూఫ్‌లను వెల్స్‌ ఫైర్‌ జట్టు తీసుకోగా.. బాబర్‌ అజామ్‌పై ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. మాజీ వెస్టిండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌, న్యూజిలాండ్‌ పేసర్‌ బౌల్ట్‌ కూడా అమ్ముడుపోలేదు. ఆగస్టు 1న ‘ద హండ్రెడ్‌’ టోర్నీ ఆరంభం కాబోతోంది.


సలీమాకు ఏహెచ్‌ఎఫ్‌ అవార్డు

దిల్లీ: ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్‌) 2022 ఉత్తమ వర్ధమాన మహిళా క్రీడాకారిణి అవార్డు భారత స్టార్‌ సలీమా టెట్‌ను వరించింది. కొరియాలో జరిగిన ఏహెచ్‌ఎఫ్‌ వార్షిక సమావేశంలో సలీమా ఈ పురస్కారాన్ని అందుకుంది. ‘‘మైదానంలో నా ప్రతిభను గుర్తించినందుకు ఆసియా హాకీ సమాఖ్యకు కృతజ్ఞతలు. మా జట్టు సభ్యుల సహకారం లేకుండా ఈ గుర్తింపు వచ్చేది కాదు’’ అని సలీమా చెప్పింది. 2016లో అరంగేట్రం చేసిన నాటి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్న ఈ మిడ్‌ఫీల్డర్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ నాలుగో స్థానంలో నిలవడంలో ముఖ్య భూమిక పోషించింది. 2018లో యూత్‌ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన జట్టులోనూ ఆమె ఉంది. మరోవైపు హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి బోళానాథ్‌ సింగ్‌కు ‘వర్ధమాన స్పోర్ట్‌ లీడర్‌’ అవార్డు లభించింది.


ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విషీ మాట

దిల్లీ: ఆటతో ప్రపంచ చెస్‌ను ఏలిన భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌.. రాబోయే ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో మాటతోనూ అలరించబోతున్నాడు. ఈ టోర్నీలో అతడు వ్యాఖ్యాతగా కొత్త పాత్రలో కనిపించనున్నాడు. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో వచ్చే నెల 7న ఆరంభమయ్యే ఈ ఈవెంట్లో ఎనిమిదిసార్లు యుఎస్‌ మహిళల ఛాంపియన్‌ ఇరినా క్రష్‌తో కలిసి విషీ.. తొలి నాలుగు గేమ్‌లకు వ్యాఖ్యానం అందిస్తాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) పోటీకి దూరం కావడంతో కాండిడేట్స్‌ చెస్‌ విజేత ఇయాన్‌ నిపొమ్‌నియాచి (రష్యా)తో రన్నరప్‌ డింగ్‌ లీరెన్‌ (చైనా) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం తలపడనున్నాడు. చెస్‌లో 2013 తర్వాత కొత్త ప్రపంచ ఛాంపియన్‌ రాబోతున్నాడు. ఆనంద్‌ను ఓడించి మాగ్నస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచాక మరెవరూ అతడిని ఓడించలేదు. ఆసక్తి లేకపోవడం వల్ల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోరుకు దూరమవుతున్నానని కార్ల్‌సన్‌ ఇదివరకే ప్రకటించాడు.


‘బీసీసీఐ ఎలాంటి ఆదేశాలివ్వలేదు’

దిల్లీ: టీమ్‌ఇండియా ఆటగాళ్ల పనిభార నిర్వహణకు సంబంధించి బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీలకు నివేదిక పంపిందని, స్పష్టమైన ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని దిల్లీ క్యాపిటల్స్‌ సీఈవో ధీరజ్‌ మల్హోత్రా చెప్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో క్రికెటర్ల పని భారంపై బీసీసీఐ ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా అన్న ప్రశ్నకు అతడు బదులిస్తూ.. ‘‘లేదు. కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల పనిభార నిర్వహణకు సంబంధించి జాతీయ క్రికెట్‌ అకాడమీ ఫ్రాంఛైజీలకు ఓ నివేదిక పంపింది. మా నుంచి వారు ఏమి కోరుకుంటున్నారన్నదానిపై అందులో ఎలాంటి సమాచారం లేదు’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని