పంచ్‌ అదిరె..పసిడి చేరె

వేదిక దిల్లీలోని కె.డి. జాదవ్‌ ఇండోర్‌ హాల్‌.. సమయం సాయంత్రం. ప్రేక్షకులతో పాటు దేశంలోని బాక్సింగ్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన వేళ.. స్టేడియంలోని వెలుతురంతా తమపైనే ఉండగా..

Published : 26 Mar 2023 03:27 IST

స్వర్ణాలు నెగ్గిన నీతు, స్వీటీ 
మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

వేదిక దిల్లీలోని కె.డి. జాదవ్‌ ఇండోర్‌ హాల్‌.. సమయం సాయంత్రం. ప్రేక్షకులతో పాటు దేశంలోని బాక్సింగ్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన వేళ.. స్టేడియంలోని వెలుతురంతా తమపైనే ఉండగా.. మొదట నీతు, ఆ తర్వాత స్వీటీ.. దేశం ఆశలు మోస్తూ రింగ్‌లో అడుగుపెట్టారు. సొంతగడ్డపై అంచనాలను అందుకుంటూ.. రింగ్‌లో ఆత్మవిశ్వాసంతో పోరాడారు. ప్రత్యర్థులపై తిరుగులేని పంచ్‌లు విసిరి.. తొలిసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. దేశానికి స్వర్ణాలు అందించారు. మొత్తం మీద భారత్‌ నుంచి విశ్వ విజేతగా నిలిచిన ఆరో బాక్సర్‌గా నీతు.. ఏడో బాక్సర్‌గా స్విటీ ఘనత సాధించారు.

దిల్లీ : భారత అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో నీతు గాంగాస్‌, స్వీటీ బూర పసిడి పతకాలు ముద్దాడారు. మొదట 48 కేజీల విభాగం ఫైనల్లో నీతు 5-0 తేడాతో లుత్సాయిఖాన్‌ (మంగోలియా)ను చిత్తుచేసింది. తుదిపోరులో ఆమె పంచ్‌లకు ప్రత్యర్థి నుంచి సమాధానమే లేకపోయింది. బౌట్‌ ఆరంభం నుంచి నీతుదే దూకుడు. తొలి పంచ్‌ ఆమెదే. మొదటి రౌండ్‌ను మెరుగ్గా ఆరంభించిన ఆమె.. ఏ దశలోనూ తడబడలేదు. కుడి చేయి చూపిస్తూ ఎడమ చేతి పంచ్‌లతో ప్రత్యర్థి పైకి దూసుకెళ్లింది. లుత్సాయిఖాన్‌ తన మీద పడుతున్నా.. కిందకు వంగి తప్పించుకోవాలని చూస్తున్నా.. నీతు వదల్లేదు. ఈ క్రమంలో కింద పడ్డా తిరిగి లేచిన నీతు.. పంచ్‌ల వర్షం కురిపించింది. ప్రత్యర్థి ముఖాన్ని లక్ష్యంగా చేసుకుని.. బలమైన పంచ్‌లు ఇచ్చింది. నీతు జోరు ముందు ప్రత్యర్థి పూర్తిగా తేలిపోయింది. ముఖాన్ని దాచుకుంటూ.. రక్షణాత్మకంగా వ్యవహరించింది. రెండో రౌండ్‌లో నీతు మరింతగా చెలరేగింది. రింగ్‌లో సివంగిలా కదులుతూ.. క్షణం కూడా వృథా చేయకుండా పంచ్‌ల వర్షం కురిపించింది. హుక్‌, అప్పరకట్‌ పంచ్‌లిచ్చింది.  ఇక చివరి రౌండ్‌లో నీతు తెలివిగా ఆడింది. అనవసరమైన తప్పిదాలు చేయకుండా.. రింగ్‌లో తిరుగుతూ అవకాశం కోసం ఎదురు చూసింది. ఒక్కసారి అదను దొరగ్గానే వరుసగా పంచ్‌లు విసిరింది. దీంతో అయిదుగురు జడ్జీలు నీతూకే ఓటేశారు. మరోవైపు 81 కేజీల విభాగం టైటిల్‌ పోరులో స్వీటీ 4-3తో వాంగ్‌ లీనా (చైనా)పై పోరాడి గెలిచింది. తనకంటే ఎత్తున్న ప్రత్యర్థిపై స్వీటీ ఆరంభంలో అనుకున్నట్లు పంచ్‌లు ఇవ్వలేకపోయింది. దీంతో వ్యూహం మార్చింది. అప్పర్‌కట్‌తో పంచ్‌లిచ్చింది. ప్రత్యర్థి వేగం ప్రదర్శించినా.. స్వీటీ దీటుగా నిలబడింది. తలను కిందకు వంచి.. వాంగ్‌ ముఖంపై పంచ్‌లు విసిరింది. తొలి రౌండ్లో స్వీటీనే ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్‌ మరింత హోరాహోరీగా సాగింది. వాంగ్‌ దూకుడుకు ఏ మాత్రం తగ్గకుండా స్వీటీ వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేసి రెండో రౌండ్లోనూ పైచేయి సాధించింది. చివరి మూడు నిమిషాల్లోనూ స్వీటీ ఏ మాత్రం తగ్గలేదు. కింద పడిపోతున్నా.. మళ్లీ పైకి లేచి ముష్ఠిఘాతాలు కురిపించింది. బాక్సర్లిద్దరూ పంచ్‌లతో విరుచుకుపడడంతో పోరు రసవత్తరంగా ముగిసింది. చివరకు బౌట్‌ సమీక్షలో స్వీటీనే విజేతగా నిలిచింది. ఆనందం పట్టలేకపోయిన ఆమె రింగ్‌లో త్రివర్ణ పతాకంతో పరుగులు పెట్టింది. స్వర్ణాలతో పాటు రూ.82 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ నీతు, స్వీటీ సొంతమైంది.

నీతు, స్వీటీలకు ప్రధాని అభినందన: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకాలు సాధించిన నీతు గాంగాస్‌, స్వీటీ బూరలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘నీతు గాంగాస్‌కు అభినందనలు. ఆమె ఘనతతో దేశం సంబరపడుతోంది’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. స్వీటీ బూర ప్రదర్శన అసాధారణమని, ఆమె విజయం ఎంతోమంది వర్ధమాన అథ్లెట్లకు ప్రేరణగా నిలుస్తుందని మరో ట్వీట్లో పేర్కొన్నారు.

12

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌చరిత్రలో భారత్‌ ఇప్పటివరకూ గెలిచిన స్వర్ణాలు. అందులో మేరీకోమ్‌ ఆరు (2002, 2005, 2006, 2008, 2010, 2018) సార్లు విజేతగా నిలిచింది. సరితాదేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ (2006), నిఖత్‌ జరీన్‌ (2022) ఒక్కోసారి టైటిల్‌ దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని