Nikhat Zareen: ఇక లక్ష్యం ఒలింపిక్సే

సంవత్సరం మారినా.. వేదిక మారినా.. తలపడే విభాగం మారినా.. నిఖత్‌ జరీన్‌ దూకుడు మాత్రం మారలేదు. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ తెలంగాణ బాక్సర్‌.. ఇక ఒలింపిక్స్‌ పసిడిని ముద్దాడడమే లక్ష్యమంటోంది.

Updated : 27 Mar 2023 03:58 IST

‘ఈనాడు’తో నిఖత్‌ జరీన్‌
ఈనాడు - హైదరాబాద్‌

సంవత్సరం మారినా.. వేదిక మారినా.. తలపడే విభాగం మారినా.. నిఖత్‌ జరీన్‌ దూకుడు మాత్రం మారలేదు. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ తెలంగాణ బాక్సర్‌.. ఇక ఒలింపిక్స్‌ పసిడిని ముద్దాడడమే లక్ష్యమంటోంది. ఆ కలను అందుకునే దిశగా సాగుతానని చెప్పిన ఆమె ‘ఈనాడు’తో మాట్లాడుతూ ఎన్నో విషయాలు పంచుకుంది.

వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలవడం ఎలా అనిపిస్తోంది?

ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. వరుసగా రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ కావడం అద్భుతమైన అనుభూతినిస్తోంది. స్వదేశంలో జరిగిన ఈ పోటీల్లో మద్దతుగా నిలబడ్డ అభిమానులకు ధన్యవాదాలు. ఈ స్వర్ణం దేశానికి అంకితం.

ఈ విజయాలు సాధించడంలో మీకు ప్రేరణగా నిలుస్తున్నదేంటి?

ఆటపై ప్రేమే నన్ను నడిపిస్తోంది. దేశం కోసం పతకాలు సాధించాలనే పట్టుదల, రింగ్‌లో దిగితే వంద శాతం పోరాడాలనే అంకిత భావంతో సాగుతున్నా. ప్రత్యర్థి ఎవరైనా గెలవాలనే ధైర్యం ప్రదర్శిస్తా. ఒలింపిక్స్‌ ఆడాలి. అందులో స్వర్ణం గెలవాలి. ఇదే నిత్యం నన్ను ప్రేరేపిస్తోంది.

ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీ ఎలా ఉంది?

ఇప్పటివరకూ నా కెరీర్‌లో అత్యంత కఠినమైన ఛాంపియన్‌షిప్స్‌ ఇదే. బరువు విభాగం మారడంతో సీడింగ్‌ దక్కలేదు. దీంతో ఆరు బౌట్లలో తలపడాల్సి వచ్చింది. పైగా ప్రతి ప్రత్యర్థి కూడా గట్టి సవాలు విసిరారు. రెండో రౌండ్లో టాప్‌సీడ్‌, ఆఫ్రికా ఛాంపియన్‌ రొమేసా, సెమీస్‌లో రియో ఒలింపిక్స్‌ కాంస్య విజేత వాలెన్సియాతో తలపడి గెలిచా. హెరెరాతో  ప్రిక్వార్టర్స్‌లో పెదవి గాయమైనా పైచేయి సాధించా. అప్పటికే మూడు బౌట్లు ఆడడంతో క్వార్టర్స్‌లో రక్సాత్‌తో పోరులో అలసిపోయినట్లు     అనిపించింది. కానీ తిరిగి పుంజుకుని 5-2తో నెగ్గా. ఇక ఫైనల్‌ సమరం కూడా హోరాహోరీగానే సాగింది.

స్వదేశంలో అంచనాలు అందుకోవాలనే ఒత్తిడికి గురయ్యారా?

స్వదేశంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడడం ఎంతో ఆనందంగా ఉంది. తరచుగా ఈ అవకాశం రాదు. సొంత అభిమానుల మధ్యలో విజయాలు సాధించడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. తల్లిదండ్రుల ముందు టైటిల్‌ నెగ్గడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఒత్తిడి అనేదే లేదు. నేను సవాళ్లను ఇష్టపడతా. ఒత్తిడిలోనే అత్యుత్తమ ప్రదర్శన చేస్తా. ఇక్కడి ప్రజల మద్దతు కారణంగా ప్రత్యర్థితో పోలిస్తే మనకే ప్రయోజనం కలుగుతుంది.

నిరుడు 52 కేజీల విభాగంలో టైటిల్‌ గెలిచారు. ఇప్పుడు 50 కేజీల విభాగంలోనూ పసిడి పట్టారు. ఈ బరువు తగ్గడం కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ ఆడిన తర్వాత.. పారిస్‌ ఒలింపిక్స్‌ దృష్టిలో పెట్టుకుని బరువు విభాగం మారాలనుకున్నా. 54తో పోలిస్తే 50 కేజీలకు మారడమే సులువనిపించింది. బరువు పెరగడం కంటే తగ్గాలనే నిర్ణయించుకున్నా. అందుకోసం కష్టపడ్డా. ఆహార నియమాలు పాటించా. ఒలింపిక్స్‌కు ముందు ఈ విభాగంలో మన ప్రదర్శన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే నిరుడు కామన్వెల్త్‌ క్రీడల్లో 50 కేజీల విభాగంలో తలపడ్డా. అప్పుడు పసిడి నెగ్గా. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిల్‌ గెలిచా.

మీ తర్వాతి ప్రణాళికలు ఏమిటీ?

ముందుగా ఈ విజయాన్ని ఆస్వాదిస్తా. ఆ తర్వాత ఆసియా క్రీడల కోసం సన్నద్ధమవ్వాలి. అందులో మెరుగైన ప్రదర్శనతో పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలి. ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించి నా కలతో పాటు దేశం స్వప్నాన్ని సాకారం చేయాలన్నదే లక్ష్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని