IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం

జూనియర్‌ పురుషుల హాకీ ఆసియా కప్‌లో భారత ఆధిపత్యానికి తిరుగులేదు. టైటిల్‌ను నిలబెట్టుకుంటూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ మరోసారి అదరగొట్టింది.

Published : 02 Jun 2023 07:18 IST

భారత్‌దే హాకీ జూనియర్‌ ఆసియా కప్‌

సలాలా: జూనియర్‌ పురుషుల హాకీ ఆసియా కప్‌లో భారత ఆధిపత్యానికి తిరుగులేదు. టైటిల్‌ను నిలబెట్టుకుంటూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ మరోసారి అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి.. నాలుగో టైటిల్‌తో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించింది. మూడు టైటిళ్లతో పాక్‌ రెండో స్థానానికి పరిమితమైంది. గురువారం ఫైనల్లో భారత్‌ 2-1 తేడాతో పాక్‌పై విజయం సాధించింది. అంగద్‌ వీర్‌ సింగ్‌ (13వ నిమిషంలో), అరిజీత్‌ సింగ్‌ (20వ) చెరో గోల్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థి తరపున అలీ బషారత్‌ (38వ) గోల్‌ కొట్టాడు.

ఈ టోర్నీలో అజేయంగా సాగిన భారత్‌.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించింది. పూల్‌ దశలో పాక్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న మన కుర్రాళ్లు.. ఆఖరి సమరంలో మాత్రం అదరగొట్టారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్‌.. తొలి నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ సాధించినా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. ఆరో నిమిషంలో దక్కిన మరో పెనాల్టీ కార్నర్‌ను పాక్‌ గోల్‌కీపర్‌ అడ్డుకున్నాడు. ఆ తర్వాత దాడులను భారత్‌ మరింత ఉద్ధృతం చేసింది. ఎట్టకేలకు అంగద్‌ గోల్‌తో మన జట్టు ఖాతా తెరిచింది.

రెండో క్వార్టర్‌లో భారత్‌ మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ఈ సారి అరిజీత్‌ ఫీల్డ్‌గోల్‌తో ఆధిక్యం రెట్టింపైంది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని దాటుకుని అతను బంతిని గోల్‌పోస్టు లోపలికి పంపించాడు. అక్కడి నుంచి భారత్‌ను అందుకునేందుకు పాక్‌ వేగం పెంచింది. అబ్దుల్‌ నుంచి పాస్‌ అందుకున్న అలీ.. బంతిని లోపలికి పంపించడంతో పాక్‌ ఖాతా తెరిచింది. ఇక చివరి క్వార్టర్‌లో పోరు మరోస్థాయికి చేరింది. స్కోరు సమం చేసేందుకు పాక్‌.. ఆధిక్యాన్ని పెంచుకునేందుకు భారత్‌ పోటాపోటీగా తలపడ్డాయి. ఆఖర్లో పాక్‌ పెనాల్టీ కార్నర్లను మన రక్షణ శ్రేణి గొప్పగా ఆపగలిగింది. చివరి వరకూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించి భారత్‌ విజేతగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని