WTC Final: ఓవల్‌ ఎవరికి కలిసొచ్చేనో?

ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు వేదికైన లండన్‌లోని ఓవల్‌ మైదానంలో టెస్టుల్లో ఆస్ట్రేలియా రికార్డు పేలవం. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశం.

Updated : 02 Jun 2023 09:14 IST

మెల్‌బోర్న్‌: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు వేదికైన లండన్‌లోని ఓవల్‌ మైదానంలో టెస్టుల్లో ఆస్ట్రేలియా రికార్డు పేలవం. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇంగ్లాండ్‌లో 140 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రను పరిశీలిస్తే ఓవల్‌లో కంగారూల ప్రదర్శన అంతంతమాత్రమే. 1880లో ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిచ్చిన మొట్టమొదటి టెస్టును ఓవల్‌లో ఆడిన ఆసీస్‌.. ఇప్పటివరకూ ఆ మైదానంలో 38 టెస్టులాడి కేవలం 7 విజయాలు మాత్రమే సాధించగలిగింది. విజయాల శాతం 18.42గా ఉంది. గత 50 ఏళ్లలో ఇక్కడ ఆస్ట్రేలియా రెండు సార్లు మాత్రమే నెగ్గింది. ఇంగ్లాండ్‌ వ్యాప్తంగా చూసుకుంటే ఓవల్‌లోనే ఆ జట్టుకు పేలవ రికార్డు ఉంది. అదే లార్డ్స్‌లో అయితే 29 మ్యాచ్‌ల్లో 17 విజయాలు (43.59 శాతం) నమోదు చేసింది. హెడింగ్లీలో 34.62 శాతం, ట్రెంట్‌బ్రిడ్జ్‌లో 30.43 శాతం, ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో 29.03 శాతం, ఎడ్జ్‌బాస్టన్‌లో 26.67 శాతంగా ఆ జట్టు విజయాల ప్రదర్శన ఉంది. ఇక టీమ్‌ఇండియా విషయానికి వస్తే ఓవల్‌లో ఆస్ట్రేలియా కంటే కాస్త మెరుగైన రికార్డే ఉన్నప్పటికీ మరీ ఉత్తమం అని చెప్పలేం. ఇక్కడ రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్‌.. ఏడు డ్రాలు నమోదు చేసింది. 5 మ్యాచ్‌ల్లో ఓడింది. కానీ 2021లో ఇంగ్లాండ్‌పై 157 పరుగుల తేడాతో నెగ్గి.. 40 ఏళ్లలో ఓవల్‌లో తొలి విజయాన్ని అందుకోవడం రోహిత్‌ సేన ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. మరోవైపు గురువారం నుంచి బెకెన్‌హమ్‌లో కంగారూ జట్టు ప్రాక్టీస్‌ మొదలెట్టినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని