పోరాడి ఓడిన సేన్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత్‌ కథ ముగిసింది. బరిలో మిగిలిన లక్ష్యసేన్‌ కూడా ఓడిపోయాడు.

Published : 04 Jun 2023 02:13 IST

థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత్‌ కథ ముగిసింది. బరిలో మిగిలిన లక్ష్యసేన్‌ కూడా ఓడిపోయాడు. శనివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో లక్ష్య 21-13, 17-21, 13-21తో కున్లావత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌ ఆరంభంలో సేన్‌కు గట్టిపోటీ ఎదురైంది. విరామ సమయానికి భారత షట్లర్‌ 11-6తో నిలిచాడు. బ్రేక్‌ తర్వాత విజృంభించిన వితిద్‌సర్న్‌ 10-11తో సేన్‌ను సమీపించాడు. కానీ పట్టువదలని లక్ష్య.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. ఒక దశలో 10-10 స్కోరు సమమైంది. కానీ క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌లతో చెలరేగిన కున్లావత్‌ ఆధిక్యంలోకి వెళ్లడమే కాక అదే జోరుతో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఆరంభంలో థాయ్‌ ఆటగాడు 5-2తో ఆధిక్యంలోకి వెళ్లినా.. సేన్‌ పుంజుకుని ప్రత్యర్థి స్కోరు సమం చేశాడు. అయితే ద్వితీయార్ధంలో అలసిపోయిన భారత స్టార్‌.. నెమ్మదిగా ఆటపై పట్టుకోల్పోయి 12-18తో వెనుకబడిపోయాడు. అదే ఊపులో కున్లావత్‌ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని