మేజర్‌ లీగ్‌తో పొట్టి కప్పుకు బాటలు

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) ఆరంభ సీజన్‌ను విజయవంతంగా నిర్వహించి, వచ్చే ఏడాది తమ దేశం ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై నెలకొన్న సందేహాలను పటాపంచాలు చేయాలనే ఉద్దేశంతో యుఎస్‌ఏ క్రికెట్‌ (యుఎస్‌ఏసీ) ఉంది.

Published : 08 Jun 2023 02:17 IST

బెంగళూరు: మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) ఆరంభ సీజన్‌ను విజయవంతంగా నిర్వహించి, వచ్చే ఏడాది తమ దేశం ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై నెలకొన్న సందేహాలను పటాపంచాలు చేయాలనే ఉద్దేశంతో యుఎస్‌ఏ క్రికెట్‌ (యుఎస్‌ఏసీ) ఉంది. 2024 టీ20 ప్రపంచకప్‌ను యుఎస్‌ఏ, వెస్టిండీస్‌లో ఉమ్మడిగా నిర్వహించనున్నామని ఐసీసీ గతంలో ప్రకటించింది. కానీ అమెరికాలో క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి సరైన మౌలిక సదుపాయాలు లేవనే కారణంతో ఈ పొట్టికప్పును ఇంగ్లాండ్‌కు తరలిస్తారనే వార్తలొస్తున్నాయి. ‘‘ప్రపంచకప్‌ను తరలించడం గురించి ఐసీసీతో చర్చించలేదు. మరో ఏడాదిలో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం. యుఎస్‌ఏలో తరచుగా క్రికెట్‌ టోర్నీలు జరగవు కాబట్టి ఈ పొట్టికప్పు వేదికను తరలిస్తారనే ఆందోళన ఉండడం సహజమే. కానీ ఎంఎల్‌సీని విజయవంతంగా నిర్వహించి ఆ పొట్టికప్పు ఆతిథ్యంపై ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తాం. లీగ్‌ను ఆరంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనబోతుండడంతో ఈ లీగ్‌ భారీగా మారనుంది’’ అని ఓ యుఎస్‌ఏసీ ప్రతినిధి తెలిపాడు. మరోవైపు 2024 టీ20 ప్రపంచకప్‌ను తరలించే ప్రతిపాదన లేదని, త్వరలోనే టోర్నీ వేదికలను ప్రకటిస్తామని ఓ ఐసీసీ సభ్యుడు పేర్కొన్నాడు. వచ్చే నెల 13 నుంచి 30 వరకు జరిగే ఎంఎల్‌సీ ఆరంభ సీజన్‌లో ఆరు జట్లు తలపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని