భారత్‌కురెండు స్వర్ణాలు

ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ను భారత్‌ ఘనంగా ముగించింది. పోటీల చివరి రోజైన బుధవారం మరో రెండు స్వర్ణాలు మన ఖాతాలో చేరాయి. మహిళల 1500 మీటర్ల పరుగులో లక్షిత వినోద్‌ సాండిలా పసిడితో సత్తాచాటింది.

Published : 08 Jun 2023 05:36 IST

ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌

ఇంచియాన్‌: ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ను భారత్‌ ఘనంగా ముగించింది. పోటీల చివరి రోజైన బుధవారం మరో రెండు స్వర్ణాలు మన ఖాతాలో చేరాయి. మహిళల 1500 మీటర్ల పరుగులో లక్షిత వినోద్‌ సాండిలా పసిడితో సత్తాచాటింది. 4 నిమిషాల 24.23 సెకన్లలో రేసు ముగించి తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మహిళల 4×400 మీటర్ల రిలేలోనూ భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అనుష్క, రియా, టీనా, హీనాలతో కూడిన మన బృందం 3 నిమిషాల 40.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని బంగారు పతకాన్ని ముద్దాడింది. ఈ పోటీల్లో భారత్‌ 6 స్వర్ణాలు, 7 రజతాలు,  6 కాంస్యాలు కలిపి 19 పతకాలతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. జపాన్‌ (14 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలు), చైనా (11 స్వర్ణాలు, 5 రజతాలు,  3 కాంస్యాలు) వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి.


సమీర్‌కు 2 రజతాలు

జుల్‌ (జర్మనీ): జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సమీర్‌ సత్తా చాటాడు. బుధవారం 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో అతడు రజత పతకాలు నెగ్గాడు. ఫైనల్లో సమీర్‌ (26 పాయింట్లు) రెండో స్థానంలో నిలవగా... యాన్‌ (ఫ్రాన్స్‌, 27) స్వర్ణం సొంతం చేసుకున్నాడు. మరో భారత షూటర్‌ మహేష్‌ ఆనందకుమార్‌ (19) కాంస్యం సాధించాడు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో రాజ్‌కుమార్‌ సింగ్‌, జతిన్‌తో కలిసి సమీర్‌ రజతం నెగ్గాడు. 1722 పాయింట్లతో భారత బృందం రెండో స్థానంలో నిలవగా.. కొరియా (1728) పసిడి నెగ్గింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని