కళ్లు మెరిసేలా.. మనసు మెచ్చేలా!

పర్వతాలు, నదులు, సరస్సులు, అంతరిక్షం, చందమామ.. ఇంకా మరెన్నో శనివారం హాంగ్‌జౌలోని స్టేడియానికి వచ్చాయి.

Published : 24 Sep 2023 03:41 IST

అట్టహాసంగా ఆసియా క్రీడల ఆరంభోత్సవం

పర్వతాలు, నదులు, సరస్సులు, అంతరిక్షం, చందమామ.. ఇంకా మరెన్నో శనివారం హాంగ్‌జౌలోని స్టేడియానికి వచ్చాయి. వీటితో కలిసి కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. అట్టహాసంగా నిర్వహించిన ఆసియా క్రీడల ఆరంభోత్సవ వేడుకలో జరిగిన మాయే ఇది. సాంకేతికత ఉపయోగించి ఈ ప్రారంభోత్సవాన్ని చైనా ఘనంగా నిర్వహించింది. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో అథ్లెట్లు, వీక్షకుల మనసులను దోచుకుంది. చైనా చారిత్రక, సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టేలా.. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. ఎంతో ఆహ్లాదంగా, అందంగా సాగిన కళాకారుల ప్రదర్శనలు మనసుకు హత్తుకున్నాయి.

హాంగ్‌జౌ: 19వ ఆసియా క్రీడలను చైనా అధికారికంగా ప్రారంభించింది. శనివారం కన్నుల పండుగగా సాగిన ఆరంభోత్సవ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. సరికొత్తగా తీర్చిదిద్దిన హాంగ్‌జౌ ఒలింపిక్‌ స్పోర్ట్స్‌ కేంద్రం స్టేడియం దీనికి వేదికైంది. 80 వేల సామర్థ్యం కలిగిన పెద్ద తామర పువ్వుగా అభివర్ణించే ఈ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. నీరు, పర్వతాలు, చంద్రుడు నేపథ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రధానంగా హాంగ్‌జౌలో ప్రవహించే కియాంటాంగ్‌ నదిని నేపథ్యంగా తీసుకున్నారు. శరదృతువు వెలుగుల్లో నీరుగా పేర్కొంటూ సాగిన భారీ నృత్య ప్రదర్శనతో ఈ వేడుక ఆరంభమైంది. చైనా వారసత్వం, ఆ దేశ సాంకేతిక పురోగతి, కృత్రిమ మేధతో పాటు పర్యావరణ అనుకూల వ్యవహారానికి నివాళిగా ఈ ప్రదర్శన నిలిచింది. ఆ దేశ జాతీయ పతాకాన్ని ఎగరేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. మస్కట్ల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ క్రీడల్లో పాల్గొనే దేశాల కవాతు మొదలైంది. మొదట అఫ్గానిస్థాన్‌ బృందం వచ్చింది. ఈ కవాతులో భారత అథ్లెట్లు సంప్రదాయ వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. మహిళలు చీర కట్టుకోగా.. పురుషులు కుర్తా, పైజామా, పైన కోటు ధరించారు. పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, అగ్రశ్రేణి బాక్సర్‌ లవ్లీనా బోర్గోహెయిన్‌ కలిసి జాతీయ పతాకాన్ని పట్టుకుని మన బృందాన్ని నడిపించారు. చివరగా చైనా బృందం రాకతో కవాతు ముగిసింది. అనంతరం ఆసియా క్రీడలు ప్రారంభమైనట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటించారు. వెంటనే బాణాసంచా వెలుగులతో స్టేడియం వెలిగిపోయింది. ఆ వెంటనే ఆసియా ఒలింపిక్‌ మండలి జెండాను ఆవిష్కరించారు. చైనా సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా ఓ వీడియో ప్రదర్శించారు. పర్వతాలు, సరస్సులు, జలపాతల నేపథ్యంలో కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం గాల్లో తేలుతూ ఇద్దరు చైనా కళాకారుల (అమ్మాయి, అబ్బాయి) ప్రదర్శన కూడా అలరించింది. ఆసియా క్రీడల జ్యోతిని స్టేడియంలో అథ్లెట్లు ఒకరి తర్వాత ఒకరు అందుకుంటూ సాగారు. మరోవైపు జ్యోతి పట్టుకుంటూ డిజిటల్‌ ఆకారం నగరం మొత్తం పరుగెత్తడం కనిపించింది. చివరకు ఆ ఆకారం స్టేడియానికి చేరుకోగానే.. చైనా అథ్లెట్‌ భారీ జ్యోతిని వెలిగించాడు. కళ్లు మిరిమిట్లు గొలిపేలా బాణాసంచా వెలుగులతో ఈ కార్యక్రమం ముగిసింది. పర్యావరణ హితం కోసం డిజిటల్‌ బాణాసంచా వెలుగులను ఉపయోగించడం విశేషం.


ఆసియా క్రీడల్లో ఈనాడు

బాక్సింగ్‌: ప్రీతి × సిలీనా (జోర్డాన్‌)- ఉ.11.45; నిఖత్‌ జరీన్‌ × న్యూయెన్‌ (వియత్నాం)- సా.4.30
క్రికెట్‌: మహిళల సెమీస్‌ (భారత్‌ × బంగ్లాదేశ్‌)- ఉ.6.30
చెస్‌: వ్యక్తిగత తొలి, రెండో రౌండ్లు(విదిత్‌, అర్జున్‌, హంపి, హారిక)- మ.12.30
ఫుట్‌బాల్‌: మహిళలు (భారత్‌ × థాయ్‌లాండ్‌)- మ.1.30; పురుషులు (భారత్‌ × మయన్మార్‌)- సా.5
హాకీ- పురుషులు (భారత్‌ × ఉజ్బెకిస్థాన్‌)- ఉ.8.45
రోయింగ్‌: మహిళల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ ఫైనల్‌ బి (పతక ఈవెంట్‌ కాదు) (కిరణ్‌, అన్షిక)- ఉ.6.30; పురుషుల   లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ ఫైనల్‌ ఎ (అర్జున్‌ లాల్‌, అర్వింద్‌)-  ఉ.7.10; పురుషుల డబుల్‌ స్కల్స్‌ ఫైనల్‌ ఎ (పర్మిందర్‌, సత్నాం)- ఉ.8; మహిళల కాక్స్‌లెస్‌ ఫోర్‌ ఫైనల్‌ ఎ (అశ్వతి, మృణామయి, ప్రియ, రుక్మిణి)-   ఉ 8.20; పురుషుల కాక్స్‌లెస్‌ పెయిర్‌ ఫైనల్‌ ఎ (బాబులాల్‌, లేఖ్‌ రామ్‌)- ఉ.8.40; పురుషుల కాక్స్‌డ్‌ ఎయిట్‌ ఫైనల్‌ ఎ (చరణ్‌జీత్‌, డీయూ పాండే, నరేశ్‌, నీరజ్‌, నీతేష్‌,   ఆశిష్‌, భీమ్‌, జస్విందర్‌, పునిత్‌)- ఉ.9
షూటింగ్‌: మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌, వ్యక్తిగత     క్వాలిఫికేషన్‌, ఫైనల్‌ (ఆశి, మెహులి, రమిత)- ఉ.6
స్విమ్మింగ్‌: పురుషుల 100మీ.ఫ్రీస్టైల్‌ హీట్స్‌, ఫైనల్‌ (ఆనంద్‌, తనీష్‌)- ఉ.7.30; పురుషుల 100మీ.బ్యాక్‌స్ట్రోక్‌ హీట్స్‌, ఫైనల్‌ (శ్రీహరి నటరాజ్‌, ఉత్కర్ష్‌)- ఉ.7.30; మహిళల 4×100మీ.ఫ్రీస్టైల్‌ రిలే హీట్స్‌, ఫైనల్‌ (జాహ్నవి, ధినిధి, మాన పటేల్‌, శివాంగి)- ఉ.7.30
టేబుల్‌ టెన్నిస్‌: మహిళల ప్రిక్వార్టర్స్‌ (భారత్‌ × థాయ్‌లాండ్‌)- ఉ.7.30; పురుషుల ప్రిక్వార్టర్స్‌ (భారత్‌ × కజకిస్థాన్‌)- ఉ.9.30


నేటి నుంచే పతక వేట
రోయింగ్‌లో అయిదు ఫైనల్స్‌లో భారత అథ్లెట్లు

ఆసియా క్రీడల్లో భారత్‌కు ఆదివారం తొలి పతకం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోయింగ్‌లో ఏకంగా అయిదు విభాగాల్లో భారత అథ్లెట్లు ఫైనల్లో తలపడబోతున్నారు. మరోవైపు షూటింగ్‌లోనూ మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో టీమ్‌తో పాటు వ్యక్తిగత విభాగాల్లోనూ నేడే క్వాలిఫికేషన్‌తో పాటు ఫైనల్స్‌ జరుగుతాయి. మరి మన షూటర్లు   రమిత, మెహులి ఘోష్‌, ఆశి చోక్సీ ఏం చేస్తారో చూడాలి. ఇక మహిళల క్రికెట్‌ సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఇందులో గెలిస్తే టీమ్‌ఇండియాకు పతకం ఖాయమవుతుంది.
నిఖత్‌కు సవాలు..: తొలిసారి ఆసియా క్రీడల్లో బరిలో దిగుతోన్న నిఖత్‌ జరీన్‌కు తొలి రౌండ్లోనే కఠిన సవాలు ఎదురు కానుంది. మహిళల 50 కేజీల విభాగం తొలి రౌండ్లో నిఖత్‌.. న్యూయెన్‌  తి తామ్‌ (వియత్నాం)తో పోటీపడనుంది. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూయెన్‌పైనే నిఖత్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సవాలు దాటితే సెమీస్‌లో నిఖత్‌కు.. రెండు సార్లు ప్రపంచ కాంస్య విజేత రక్సత్‌ (థాయ్‌లాండ్‌) ఎదురయ్యే అవకాశముంది. మరోవైపు 75 కేజీల విభాగంలో లవ్లీనాకు తొలి రౌండ్లో బై లభించింది. ఇప్పుడామె క్వార్టర్స్‌లో సియాంగ్‌ (కొరియా)ను ఢీ కొడుతుంది. ఈ ఒక్క బౌట్‌ గెలిచినా లవ్లీనా పతకం దక్కించుకుంటుంది. ఆసియా క్రీడల్లో సత్తాచాటే బాక్సర్లు.. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తులూ గెలుచుకునే అవకాశం ఉంది.


హాకీ.. పారిస్‌ లక్ష్యంగా..

పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు లక్ష్యంగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు ఆదివారం తన తొలి మ్యాచ్‌ (పూల్‌- ఎ)లో ఉజ్బెకిస్థాన్‌ను ఢీ కొడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న హర్మన్‌ప్రీత్‌ సేననే.. ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ర్యాంకు జట్టు.గత క్రీడల్లో కాంస్యం గెలిచిన పురుషుల జట్టు.. ఈ సారి పసిడి నెగ్గాలనే లక్ష్యంతో ఉంది. పూల్‌- ఎలో పాకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, సింగపూర్‌, జపాన్‌, బంగ్లాదేశ్‌తో కలిసి భారత్‌ ఉంది. ఇక చెస్‌లో అదరగొట్టేందుకు గుకేశ్‌, విదిత్‌, అర్జున్‌, హరికృష్ణ, ప్రజ్ఞానంద, కోనేరు హంపి, హారిక, వైశాలి, వంతిక, సవిత సిద్ధమయ్యారు. మరోవైపు ఆసియా క్రీడల్లో తొలిసారి పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్న ఈ- స్పోర్ట్స్‌లోనూ భారత్‌ ప్రాతినిథ్యం వహిస్తోంది. లీగ్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ గేమ్‌లో టాప్‌ సీడ్‌ కారణంగా భారత్‌ నేరుగా క్వార్టర్స్‌ ఆడనుంది.
ప్రిక్వార్టర్స్‌లో టీటీ జట్లు: ఆసియా క్రీడల టేబుల్‌ టెన్నిస్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ప్రిక్వార్టర్స్‌ చేరాయి. శనివారం మహిళల గ్రూప్‌- ఎఫ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-0తో నేపాల్‌ను చిత్తుచేసింది. దియా 11-1, 11-6, 11-8తో శ్రేష్ఠపై, ఐహిక 11-3, 11-7, 11-2తో నబితపై, సుతీర్థ 11-1, 11-5, 11-2తో ఎవానాపై గెలిచారు. గ్రూప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌.. అగ్రస్థానంతో ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు పురుషుల గ్రూప్‌- ఎఫ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-0తోనే తజకిస్థాన్‌ను ఓడించింది. మానవ్‌ 11-8, 11-5, 11-8తో అఫ్జల్‌ఖాన్‌పై, మానుష్‌ 13-11, 11-7, 11-5తో సుల్తానోవ్‌పై, హర్మీత్‌ 11-1, 11-3, 11-5తో ఇబ్రోకిమ్‌పై నెగ్గారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పురుషుల జట్టు కూడా అగ్రస్థానంతో ముందంజ వేసింది. మరోవైపు సెయిలింగ్‌లో భారత్‌కు ఆశించిన ఫలితాలు రాలేదనే చెప్పాలి. మరో అయిదు రేసులు మిగిలి ఉన్న పురుషుల డింఘీ ఈవెంట్‌లో విష్ణు రెండో స్థానానికి పడిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని