ఈ సిరీస్‌లో ఏముంది?

అయిదేళ్ల విరామం తర్వాత, ఈ ఏడాదే టీ20 ప్రపంచకప్‌ జరగబోతోంది. ఆతిథ్యమివ్వబోతున్నది భారతే. శుక్రవారం ఆరంభమయ్యే ఇంగ్లాండ్‌ సిరీస్‌తోనే టీమ్‌ఇండియా సన్నాహం మొదలు కాబోతోంది. టెస్టుల్లో ఓడి, పరిమిత ఓవర్ల క్రికెట్లో బదులు తీర్చుకోవడానికి బలమైన జట్టుతో

Published : 11 Mar 2021 01:25 IST

ఈనాడు క్రీడావిభాగం

అయిదేళ్ల విరామం తర్వాత, ఈ ఏడాదే టీ20 ప్రపంచకప్‌ జరగబోతోంది. ఆతిథ్యమివ్వబోతున్నది భారతే. శుక్రవారం ఆరంభమయ్యే ఇంగ్లాండ్‌ సిరీస్‌తోనే టీమ్‌ఇండియా సన్నాహం మొదలు కాబోతోంది. టెస్టుల్లో ఓడి, పరిమిత ఓవర్ల క్రికెట్లో బదులు తీర్చుకోవడానికి బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది ఇంగ్లిష్‌ జట్టు. ఈ సిరీస్‌లో భారత్‌ వైపు నుంచి ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలున్నాయి. అలాగే కొన్ని ప్రశ్నలకు కూడా ఈ సిరీస్‌తోనే సమాధానం లభించే అవకాశముంది. అవేంటో చూద్దాం పదండి.


కొత్త మెరుపులు ఎవరివో?

సిరీస్‌లో కొందరు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం చేయొచ్చు. తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌.. రాహుల్‌ తెవాతియా మైదానంలోకి దిగి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటిదాకా ఒక్క టీ20నే ఆడిన స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ సైతం అవకాశం కోసం చూస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్‌తో పాటు దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న సూర్యకు ఎట్టకేలకు అవకాశం దక్కింది. కిషన్‌, రాహుల్‌ గత ఐపీఎల్‌ ప్రదర్శనతోనే వెలుగులోకి వచ్చారు. తుది జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ నలుగురిలో ఎవరెవరికి అవకాశం దక్కుతుంది.. వాళ్లు ఏమేర రాణిస్తారు అన్నది చూడాలి.


పాండ్య ఇప్పుడైనా..

హార్దిక్‌ పాండ్యను బౌలర్‌ పాత్రలో చూడటం అరుదైపోయింది. 2019లో వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాక అతను చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు. పునరాగమనం తర్వాత ఆడిన మ్యాచ్‌లు తక్కువ. నిరుడు ఐపీఎల్‌లో అతను బౌలింగే చేయలేదు. ఆస్ట్రేలియాతో ఒక్క వన్డేలో మాత్రమే 4 ఓవర్లు వేశాడు. శస్త్ర చికిత్స తర్వాత పాండ్య శరీరంపై ఒత్తిడి పడొద్దన్న ఉద్దేశంతో ఐపీఎల్‌లో, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతడితో బౌలింగ్‌ చేయించట్లేదేమో. కానీ రాబోయే టీ20 ప్రపంచకప్‌లో  పాండ్య నుంచి జట్టు ఆల్‌రౌండ్‌ మెరుపులు ఆశించకుండా ఉండదు. దానికి సన్నాహకంగా అయినా అతను ఇప్పట్నుంచి బౌలింగ్‌ చేయక తప్పదు. మరి ఇంగ్లాండ్‌తో టీ20ల్లో హార్దిక్‌ను బౌలర్‌గా చూస్తామా?


రోహిత్‌ తోడెవరు?

సిరీస్‌లో రోహిత్‌కు జోడీగా ఎవరిని ఓపెనర్‌గా పంపుతారన్నది ఆసక్తికరం. చాలా ఏళ్లు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌  ఆరంభించిన ధావన్‌.. ఏడాది కిందట ఫామ్‌ కోల్పోయి  తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. గాయాలూ వెనక్కి లాగాయి. ఈ సమయంలో  రాహుల్‌ నిలకడగా ఆడి ఓపెనింగ్‌లో స్థిరపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలు, టీ20లకు రోహిత్‌ అందుబాటులో లేకపోవడంతో ధావన్‌కు అవకాశం దక్కింది. ఇప్పుడు రోహిత్‌ ఆడబోతున్నాడు. రాహుల్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. రాహుల్‌కు వేరే స్థానాల్లోనూ ఆడిన అనుభవముంది కానీ.. ధావన్‌ ఎప్పుడూ ఓపెనరే. ఈ నేపథ్యంలో అతణ్ని తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.  ధావన్‌నే ఓపెనర్‌గా పంపి రాహుల్‌ను దిగువన  పంపడానికి కోహ్లి మొగ్గు చూపుతాడా అన్నది ఆసక్తికరం.


భువి వేస్తాడా ముద్ర?

గాయాలతో గత రెండేళ్లలో చాలా కాలం మైదానానికి దూరంగా ఉన్నాడు పేసర్‌ భువనేశ్వర్‌. ఐపీఎల్‌లో మెరిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాడనుకుంటే.. టోర్నీ మధ్యలో గాయంతో వైదొలిగాడు. ఎట్టకేలకు ఫిట్‌నెస్‌ సాధించి మళ్లీ జట్టులోకి వచ్చాడు. తుది జట్టులో చోటు కోసం చాలామంది పేసర్లు ఎదురు చూస్తున్న నేపథ్యంలో భువి సత్తా చాటాల్సిందే. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో పేస్‌ దళానికి సారథ్యం వహించాల్సిందతనే. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడంలో నైపుణ్యం ఉన్న అతను.. భీకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఇంగ్లాండ్‌పై సత్తా చాటి జట్టులో తన ప్రత్యేకతను చాటుకుంటాడేమో చూడాలి.


అతడు.. ఏ పాత్రలో?

స్ట్రేలియా పర్యటనకు ముందు పంత్‌ వేరు, ఆ పర్యటన తర్వాత అతను వేరు. అక్కడ టెస్టు సిరీస్‌లో సంచలన ఇన్నింగ్స్‌లాడాడు. తాజాగా ఇంగ్లాండ్‌పైనా అదరగొట్టాడు. దీంతో పంత్‌కు వన్డేలు, టీ20ల్లోనూ తుది జట్టులో చోటివ్వక తప్పని పరిస్థితి నెలకొంది. నిజానికి భారత్‌ చివరగా ఆడిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో పంత్‌కు తుది జట్టులో స్థానం లేదు. అతడితో పాటు శాంసన్‌ రాణించకపోవడంతో టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో రాహుల్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడించడం మొదలుపెట్టింది భారత్‌. అయితే ఇప్పుడు పంత్‌ను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా అయినా తీసుకోవాల్సిందే అన్న డిమాండ్లు మొదలయ్యాయి. మరి పంత్‌ను వికెట్‌ కీపర్‌గానే ఆడిస్తారా.. లేక రాహుల్‌కే గ్లోవ్స్‌ అప్పగించి స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా ఆడించి చూస్తారా అన్నది ఆసక్తికరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు