ఆరంభం అదిరింది

లక్ష్యం 318. 13 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు 135/0. టీమ్‌ఇండియా ఎంతో కష్టపడి నిలిపిన లక్ష్యాన్ని ప్రత్యర్థి అలవోకగా కరిగించేస్తుంటే తీవ్ర అసహనం! ఈ వేగంలో వెళ్తే ప్రత్యర్థి 40-45 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేస్తుందంటూ నిట్టూర్పులు!

Published : 24 Mar 2021 01:40 IST

తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం
అరంగేట్రంలో ఆకట్టుకున్న కృనాల్‌, ప్రసిద్ధ్‌
మెరిసిన ధావన్‌, కోహ్లి, రాహుల్‌, శార్దూల్‌

లక్ష్యం 318. 13 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు 135/0. టీమ్‌ఇండియా ఎంతో కష్టపడి నిలిపిన లక్ష్యాన్ని ప్రత్యర్థి అలవోకగా కరిగించేస్తుంటే తీవ్ర అసహనం! ఈ వేగంలో వెళ్తే ప్రత్యర్థి 40-45 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేస్తుందంటూ నిట్టూర్పులు!

అయితే నిజంగానే మ్యాచ్‌ పూర్తి ఓవర్లు సాగలేదు. 42.1 ఓవర్లకే అయిపోయింది. కానీ మ్యాచ్‌ను ముగించింది ఇంగ్లాండ్‌ కాదు.. భారత్‌! 135 పరుగులకు గానీ తొలి వికెట్‌ తీయలేకపోయిన టీమ్‌ఇండియా.. 116 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థికి దిమ్మదిరిగే షాకిచ్చింది.

మ్యాచ్‌లో చాలామంది సత్తా చాటారు. కానీ బ్యాటింగ్‌లో కష్టాల్లో ఉండగా.. మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరును 300 దాటించిన కృనాల్‌ పాండ్య, ఇంగ్లాండ్‌ ఓపెనర్ల ధాటికి దిక్కుతోచని స్థితిలో ఉండగా రెండు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ప్రసిద్ధ్‌ కృష్ణ అసలైన హీరోలు. వీళ్లిద్దరికీ ఇది అరంగేట్ర మ్యాచ్‌.

పుణె: వన్డే సిరీస్‌లో టీమ్‌ ఇండియాకు అదిరే ఆరంభం. అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కోహ్లీసేన మంగళవారం తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ధావన్‌ (98; 106 బంతుల్లో 11×4, 2×6), కోహ్లి (56; 60 బంతుల్లో 6×4) చక్కని బ్యాటింగ్‌కు కేఎల్‌ రాహుల్‌ (62 నాటౌట్‌; 43 బంతుల్లో 4×4, 4×6), కృనాల్‌ పాండ్య (58 నాటౌట్‌; 31 బంతుల్లో 7×4, 2×6) విధ్వంసం తోడవడంతో మొదట భారత్‌ 5 వికెట్లకు 317 పరుగులు సాధించింది. ఛేదనలో ఇంగ్లాండ్‌ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు బెయిర్‌స్టో (94; 66 బంతుల్లో 6×4, 7×6), జేసన్‌ రాయ్‌ (46; 35 బంతుల్లో 7×4, 1×6) మెరవడంతో ఓ దశలో 135/0తో భారత్‌ను భయపెట్టిన ఇంగ్లాండ్‌ను కొత్త ఫాస్ట్‌బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ (4/54) దెబ్బకొట్టాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (3/37), భువనేశ్వర్‌ (2/30) కూడా ప్రత్యర్థి ఆశలకు చెక్‌ పెట్టారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది.

ప్రసిద్ధ్‌ దెబ్బ..
లక్ష్యం చిన్నదేమీ కాకపోయినా ఆరంభం చూస్తే.. ఇంగ్లాండ్‌ తేలిగ్గానే ఛేదిస్తుందేమో అనిపించింది. ఓపెనర్లు విరుచుకుపడడంతో 14.1 ఓవర్లలో ఆ జట్టు స్కోరు 135/0. ఒక్క భువనేశ్వర్‌ మాత్రమే బెయిర్‌స్టో, జేసన్‌ రాయ్‌లను నిలువరించగలిగాడు. భువి తన తొలి 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అరంగేట్ర పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ, కృనాల్‌, శార్దూల్‌ ధారాళంగా పరుగులిచ్చారు. అయితే పరిస్థితి చేయిదాటుతున్నట్లనిపించిన దశలో.. బంతితో పుంజుకున్న భారత్‌ చకచకా అయిదు వికెట్లు పడగొట్టి బలంగా పోటీలోకి వచ్చింది. 15వ ఓవర్లో జేసన్‌ రాయ్‌ను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ పతనాన్ని ఆరంభించిన ప్రసిద్ధ్‌.. తన తర్వాతి ఓవర్లోనే ప్రమాదకర స్టోక్స్‌ (1)ను వెనక్కి పంపి భారత్‌లో ఉత్సాహం నింపాడు. కాసేపటి తర్వాత జోరుమీదున్న బెయిర్‌స్టోను ఔట్‌ చేయడం ద్వారా ప్రత్యర్థిని శార్దూల్‌ గట్టి దెబ్బతీశాడు. అతడే 25వ ఓవర్లో మోర్గాన్‌ (22), బట్లర్‌ (2)లను వెనక్కి పంపి భారత్‌ను పైచేయిలో నిలిపాడు. అప్పటికి స్కోరు 176/5. సామ్‌ బిల్లింగ్స్‌ (18)ను ప్రసిద్ధ్‌ ఔట్‌ చేసినా.. మొయిన్‌ అలీ (30), సామ్‌ కరన్‌ (12) క్రీజులో ఉండగా 37 ఓవర్లలో 237/6తో ఇంగ్లాండ్‌ రేసులోనే ఉంది. చివరి 13 ఓవర్లలో ఇంగ్లాండ్‌ 81 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్‌కు ముప్పేమీ తొలగిపోలేదు. కానీ 38వ ఓవర్‌ తొలి బంతికే అలీని ఔట్‌ చేయడం ద్వారా భువి భారత్‌ ధీమాను పెంచాడు. తర్వాతి ఓవర్లోనే సామ్‌ కరన్‌ను కృనాల్‌ పెవిలియన్‌ చేర్చడంతో ఆతిథ్య జట్టు విజయం ఖాయమైపోయింది. రషీద్‌ (0), టామ్‌ కరన్‌ (11) ప్రతిఘటనేమీ లేకుండా వెనుదిరిగారు.

కృనాల్‌, రాహుల్‌ ధనాధన్‌
అంతకుముందు భారత్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. కొత్త బంతి బౌలర్లు వుడ్‌, సామ్‌ కరన్‌లను ఓపెనర్లు ధావన్‌, రోహిత్‌ ఆచితూచి ఎదుర్కోవడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. తొలి 6 ఓవర్లలో 15 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ కాస్త వేగం పెంచడంతో భారత్‌ 15 ఓవర్లలో 64/0తో నిలిచింది. కానీ తర్వాతి ఓవర్లోనే రోహిత్‌ నిష్క్రమించాడు. ధావన్‌ గేర్‌ మార్చడం, నిలదొక్కుకున్నాక కోహ్లి కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు వేగం పెరిగింది. 32 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 169/1తో మెరుగైన స్కోరు దిశగా సాగింది. కానీ 36 పరుగుల వ్యవధిలోనే కోహ్లి, శ్రేయస్‌ (6), ధావన్‌, హార్దిక్‌ (1) వికెట్లు చేజార్చుకుని 205/5తో ఇబ్బందుల్లో పడింది.  ఇంగ్లాండ్‌కు సవాలు విసిరే స్కోరు కష్టమే అనిపించింది. కానీ అరంగేట్ర ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ విరుచుకుపడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరి 112 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో జట్టు స్కోరు 300 దాటింది. ఆడుతున్నది తొలి వన్డేనే అయినా కృనాల్‌లో ఆ భావనే లేదు. బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతడు స్వేచ్ఛగా చెలరేగిపోయాడు. ఎదుర్కొన్న తొలి 14 బంతుల్లో అయిందింటిని బౌండరీకి తరలించాడు. మరోవైపు టీ20ల్లో ఘోరంగా విఫలమైన రాహుల్‌ కూడా ఫామ్‌ను అందుకున్నాడు. కళ్లు చెదిరే షాట్లు ఆడిన అతడు ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. కృనాల్‌ కేవలం 26 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించగా.. రాహుల్‌ అందుకు 39 బంతులు తీసుకున్నాడు. రాహుల్‌-కృనాల్‌ విధ్వంసంతో చివరి అయిదు ఓవర్లలో భారత్‌ 67 పరుగులు రాబట్టింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) బట్లర్‌ (బి) స్టోక్స్‌ 28; ధావన్‌ (సి) మోర్గాన్‌ (బి) స్టోక్స్‌ 98; కోహ్లి (సి) అలీ (బి) వుడ్‌ 56; శ్రేయస్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) వుడ్‌ 6; రాహుల్‌ నాటౌట్‌ 62; హార్దిక్‌ పాండ్య (సి) బెయిర్‌స్టో (బి) స్టోక్స్‌ 1; కృనాల్‌ నాటౌట్‌ 58; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 317;

వికెట్ల పతనం: 1-64, 2-169, 3-187, 4-197, 5-205

బౌలింగ్‌: మార్క్‌వుడ్‌ 10-1-75-2; సామ్‌ కరన్‌ 10-1-48-0; టామ్‌ కరన్‌ 10-0-63-0; స్టోక్స్‌ 8-1-34-3; రషీద్‌ 9-0-66-0; మొయిన్‌ అలీ 3-0-28-0


ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) సూర్యకుమార్‌ యాదవ్‌ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 46; బెయిర్‌స్టో (సి) కుల్‌దీప్‌ (బి) శార్దూల్‌ 94; స్టోక్స్‌ (సి) శుభ్‌మన్‌ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 1; మోర్గాన్‌ (సి) రాహుల్‌ (బి) శార్దూల్‌ 22; బట్లర్‌ ఎల్బీ (బి) శార్దూల్‌ 2; బిల్లింగ్స్‌ (సి) కోహ్లి (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 18; మొయిన్‌ అలీ (సి) రాహుల్‌ (బి) భువనేశ్వర్‌ 30; సామ్‌ కరన్‌ (సి) శుభ్‌మన్‌ (బి) కృనాల్‌ 12; టామ్‌ కరన్‌ (సి) భువనేశ్వర్‌ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 11; రషీద్‌ (సి) రాహుల్‌ (బి) భువనేశ్వర్‌ 0; వుడ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (42.1 ఓవర్లలో ఆలౌట్‌) 251

వికెట్ల పతనం: 1-135, 2-137, 3-169, 4-175, 5-176, 6-217, 7-237, 8-239, 9-241

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 9-0-30-2; ప్రసిద్ధ్‌ కృష్ణ 8.1-1-54-4; శార్దూల్‌ ఠాకూర్‌ 6-0-37-3; కృనాల్‌ పాండ్య 10-0-59-1; కుల్‌దీప్‌ యాదవ్‌ 9-0-68-0

1
అరంగేట్ర వన్డేలో అత్యంత వేగంగా అర్ధసెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా కృనాల్‌ (26 బంతుల్లో) రికార్డు సృష్టించాడు.


3
మొహిందర్‌-సురిందర్‌.. ఇర్ఫాన్‌-యూసుఫ్‌ల తర్వాత భారత్‌ తరపున వన్డే ఆడిన మూడో సోదర ద్వయంగా కృనాల్‌, హార్దిక్‌ నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని