రోజర్‌ తొలి అడుగు

గ్రాండ్‌స్లామ్‌ పునరాగమనంలో రోజర్‌ ఫెదరర్‌ శుభారంభం చేశాడు. అతడు పెద్దగా కష్టపడకుండానే ఫ్రెంచ్‌ ఓపెన్‌ రెండో రౌండ్లో ప్రవేశించాడు. రష్యా కెరటం డానియల్‌ మెద్వెదెవ్‌ కూడా ముందంజ వేయగా.. మహిళల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ స్వైటెక్‌ తొలి అడుగు వేసింది. ఆరో సీడ్‌ ఆండ్రెస్క్యూ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది.

Updated : 01 Jun 2021 05:58 IST

రెండో రౌండ్లో స్విస్‌ స్టార్‌
మెద్వెదెవ్‌, స్వైటెక్‌ ముందంజ
ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌

గ్రాండ్‌స్లామ్‌ పునరాగమనంలో రోజర్‌ ఫెదరర్‌ శుభారంభం చేశాడు. అతడు పెద్దగా కష్టపడకుండానే ఫ్రెంచ్‌ ఓపెన్‌ రెండో రౌండ్లో ప్రవేశించాడు. రష్యా కెరటం డానియల్‌ మెద్వెదెవ్‌ కూడా ముందంజ వేయగా.. మహిళల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ స్వైటెక్‌ తొలి అడుగు వేసింది. ఆరో సీడ్‌ ఆండ్రెస్క్యూ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది.
487 రోజుల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడుతున్న స్విస్‌ మాస్టర్‌ రోజర్‌ ఫెదరర్‌ ఘనంగా తొలి అడుగు వేశాడు. తన శైలి ఆటతో ఫ్రెంచ్‌ ఓపెన్లో శుభారంభం చేశాడు. సోమవారం పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్‌ రోజర్‌ 6-2, 6-4,    6-3తో క్వాలిఫయర్‌ డెన్నిస్‌ ఇస్తోమిన్‌ (ఉజ్బెకిస్థాన్‌)ను వరుస సెట్లలో ఓడించాడు. గత 16 నెలల్లో కేవలం 2 టోర్నీలే ఆడిన 39 ఏళ్ల ఫెదరర్‌.. ఇస్తోమిన్‌తో పోరులో దూకుడు ప్రదర్శించాడు. నెట్‌ డ్రాప్‌లు, బ్యాక్‌హ్యాండ్‌ విన్నర్లతో అలరించిన రోజర్‌.. ప్రత్యర్థికి 13 పాయింట్లు మాత్రమే కోల్పోయాడు. 93 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించిన అతడు.. 48 విన్నర్లు కొట్టడమే కాదు అయిదుసార్లు ఇస్తోమిన్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. ఈ క్రమంలో ఎనిమిది ఏస్‌లు కూడా సంధించాడు. 2019 ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో నాదల్‌ చేతిలో ఓడిన తర్వాత రొలాండ్‌ గారోస్‌లో అడుగుపెట్టడం రోజర్‌కిదే తొలిసారి. చివరగా రోజర్‌ ఆడిన గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.
మెద్వెదెవ్‌ ఎట్టకేలకు: గత నాలుగు ఫ్రెంచ్‌ ఓపెన్లలో రష్యా కుర్రాడు డానియల్‌ మెద్వెదెవ్‌ ఎప్పుడూ తొలి రౌండ్‌ దాటలేదు. కానీ ఈసారి ఈ ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆ అడ్డంకిని అధిగమించాడు. తొలి రౌండ్లో 6-3, 6-3, 7-5తో బబ్లిక్‌ (కజకిస్థాన్‌)ను ఓడించి రొలాండ్‌ గారోస్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఈ పోరులో మూడో సెట్లో తప్ప ప్రత్యర్థి నుంచి మెద్వెదెవ్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. రూడ్‌ (నార్వే), సినర్‌ (ఇటలీ), ఇస్నర్‌ (అమెరికా) తొలి రౌండ్‌ దాటారు. రూడ్‌ 5-7, 6-2, 6-1, 7-6 (7/4)తో బెన్నిట్‌ పైర్‌ (ఫ్రాన్స్‌)పై గెలవగా, సినర్‌ 6-1, 4-6, 6-7 (4/7), 7-5, 6-4తో హోబర్ట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. ఇస్నర్‌ 7-6 (7/2), 6-3,  6-4తో క్వెరీ (అమెరికా)పై నెగ్గాడు. మరోవైపు అమెరికా సంచలనం కొర్డా తొలి రౌండ్లోనే ఓడాడు. మార్టినెజ్‌ (స్పెయిన్‌), 6-4, 6-2, 6-2తో కొర్డాపై గెలిచాడు. సిట్సిపాస్‌ (గ్రీస్‌), జ్వెరెవ్‌ (జర్మనీ), నిషికొరి (జపాన్‌), సిలిచ్‌ (క్రొయేషియా), ఒపెల్కా (అమెరికా), బాసిల్‌ష్వెలి (జార్జియా), క్రాజినోవిచ్‌ (సెర్బియా), నోరె (బ్రిటన్‌), జాన్సన్‌ (అమెరికా) తొలి రౌండ్‌ను అధిగమించారు.

స్వైటెక్‌ శుభారంభం: పోలెండ్‌ అమ్మాయి, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వైటెక్‌ శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో  6-0, 7-5తో కజా జువాన్‌ (స్లోవేనియా)పై విజయం సాధించింది. తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక్క గేమ్‌ ఇవ్వకుండా నెగ్గిన స్వైటెక్‌కు రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. కానీ పన్నెండో గేమ్‌లో జువాన్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన స్వైటెక్‌ సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలిచింది. ఆరో సీడ్‌ బియాంక ఆండ్రెస్క్యూ (కెనడా), ఒస్టాపెంకో (లాత్వియా) ఓడిపోయారు. ఆండ్రెస్క్యూ 7-6 (7/1), 6-7 (2/7), 7-9తో అన్‌సీడెడ్‌ జిదాన్‌సెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడింది.    3 గంటలకు పైగా హోరాహోరీగా జరిగిన ఈ పోరులో ఎనిమిది డబుల్‌ ఫాల్ట్స్‌ చేసిన ఆండ్రెస్క్యూ.. ఏడుసార్లు సర్వీస్‌ కోల్పోయి ఓటమి కొనితెచ్చుకుంది. మరో మ్యాచ్‌లో ఒస్టాపెంకో 4-6, 6-4, 3-6తో కెనిన్‌ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. మెర్టిన్స్‌ (బెల్జియం), గర్సియా (ఫ్రాన్స్‌), వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌), బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) కూడా రెండో రౌండ్‌ చేరారు. మెర్టిన్స్‌ 6-4, 6-1తో సాండర్స్‌ (ఆస్ట్రేలియా)పై గెలవగా, గర్సియా 6-3, 6-1తో సిగ్మండ్‌ (జర్మనీ)ను ఓడించింది. వొండ్రుసోవా 4-6, 6-3, 6-0తో కనెపి (ఇస్తోనియా)పై, పదో సీడ్‌ బెన్సిచ్‌ 6-0, 6-3తో పొడ్రోస్కా (అర్జెంటీనా)పై నెగ్గారు. పదహారో సీడ్‌ కికీ బెర్టిన్స్‌ (నెదర్లాండ్స్‌), హెథర్‌ వాట్సన్‌ (బ్రిటన్‌) ఓడిపోయారు. హెర్‌కాగ్‌ (స్లోవేనియా)  6-1, 3-6, 6-4తో బెర్టిన్స్‌పై నెగ్గగా..డియాస్‌ (కజకిస్థాన్‌) 6-4, 7-5తో హెథర్‌ను ఇంటిముఖం పట్టించింది.
ప్రేక్షకులుంటే ఒలింపిక్స్‌ ఆడతా: జకో
ప్రేక్షకులు ఉంటే తాను టోక్యో ఒలింపిక్స్‌లో తప్పకుండా ఆడతానని, వారికి అనుమతి లేదంటే మాత్రం ఆలోచిస్తానని టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ అన్నాడు. ‘‘నాకు తెలిసి స్టేడియం సామర్థ్యంలో 20 నుంచి 30 శాతం వరకు స్థానిక ప్రేక్షకులను అనుమతిస్తారు. అందులో ఏదైనా మార్పుంటే.. ప్రేక్షకులకు అనుమతి లేదంటే మాత్రం టోక్యో వెళ్లాలా వద్దా అన్నదానిపై ఆలోచిస్తా. ప్రస్తుతానికి ఒలింపిక్స్‌ ఆడాలనే అనుకుంటున్నా’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని