క్రికెట్‌ మహర్షి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌.. టేలర్‌ ఫోర్‌తో కివీస్‌ విజయాన్ని అందుకోగానే స్టాండ్స్‌లోని ఆ దేశ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. డ్రెస్సింగ్‌ గదిలోని ఆ జట్టు ఆటగాళ్లు సంతోషంతో గంతులేశారు. కానీ మరో ఎండ్‌లో ఉన్న విలియమ్సన్‌.. గాల్లోకి ఎగిరి విజయనాదం చేయలేదు..

Published : 25 Jun 2021 02:26 IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌.. టేలర్‌ ఫోర్‌తో కివీస్‌ విజయాన్ని అందుకోగానే స్టాండ్స్‌లోని ఆ దేశ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. డ్రెస్సింగ్‌ గదిలోని ఆ జట్టు ఆటగాళ్లు సంతోషంతో గంతులేశారు. కానీ మరో ఎండ్‌లో ఉన్న విలియమ్సన్‌.. గాల్లోకి ఎగిరి విజయనాదం చేయలేదు.. ప్రత్యర్థి వైపు చూస్తూ గెలుపు సంబరాలు చేసుకోలేదు.. ‘‘మేం గెలిచాం’’ అన్నట్లు ఓ నవ్వు విసిరేశాడంతే. ఎందుకంటే జెంటిల్మన్‌ ఆటైన క్రికెట్లో అతనో నిఖార్సైన జెంటిల్మన్‌. దాదాపు రెండేళ్ల పాటు సాగిన కఠిన ప్రయాణం అనంతరం అందిన తుది విజయమది.. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిపిన గెలుపది.. అయినా అదో మామూలు విజయమే అన్నట్లు అతను ప్రదర్శించిన పరిణతి గొప్పది. సాధారణ జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన ఘనత అతనిది. సారథిగా అతని ప్రభావం జట్టు తలరాతనే మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేల్లో, టీ20ల్లో సాధ్యం కాని ఘనతను ఆ జట్టు ఇప్పడు టెస్టుల్లో అందుకుంది.

అతనొచ్చాక..: అండర్‌డాగ్స్‌గా.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రపంచకప్‌ల్లో బరిలో దిగడం.. పేలవ ప్రదర్శనతో ఉసూరుమనిపించడం.. ఇదీ ఆ జట్టు గత పరిస్థితి. ఈ ఏడాది ముందు వరకూ దశాబ్దాల ఆ దేశ క్రికెట్‌ చరిత్రలో ఒక్కసారి కూడా టెస్టుల్లో అగ్రస్థానాన్ని అందుకోలేదు. ప్రపంచ ఛాంపియన్లుగానూ నిలవలేదు. గతంలోనూ కివీస్‌ జట్టులో ఆల్‌రౌండర్లకు కొదవేమీ లేదు. లోయర్‌ ఆర్డర్లోనూ బ్యాటింగ్‌ చేయగల బౌలర్లు జట్టులో ఉండేవాళ్లు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ ఆ జట్టు పటిష్ఠంగా ఉండేది. కానీ ఐసీసీ ప్రధాన టోర్నీల్లో మాత్రం విఫలమయ్యేది. కానీ గత కొన్నేళ్లలో దాని ఆటతీరు అనూహ్యంగా మారింది. జట్టుకు దూకుడు నేర్పిన మాజీ కెప్టెన్‌ మెక్‌కలమ్‌.. 2015 వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌ను ఫైనల్‌ చేర్చగలిగాడు. ఇక అతని తర్వాత జట్టు పగ్గాలు అందుకున్న విలియమ్సన్‌.. దూకుడు నేర్చిన జట్టుకు ప్రశాంతతను అలవాటు చేసి అద్భుత ఫలితాలు సాధించడం మొదలెట్టాడు. అతనొచ్చాక.. పరిస్థితులు మారాయి. జట్టు ప్రదర్శన మారింది. ప్రస్తుత జట్టులో బ్యాటింగ్‌లో విలియమ్సన్‌, సీనియర్‌ రాస్‌ టేలర్‌.. బౌలింగ్‌లో బౌల్ట్‌, సౌథీ ద్వయం మినహా చెప్పుకోదగ్గ అగ్రశ్రేణి ఆటగాళ్లు లేరు. అయినప్పటికీ సహచరులపై నమ్మకం పెట్టిన అతను.. వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మంచి ప్రదర్శన రాబట్టగలిగాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలిపినంత పని చేశాడు. ఆ బాధ నుంచి జట్టు త్వరగానే కోలుకునేలా చూసి.. రెండేళ్ల తర్వాత అదే ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టుల్లో జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించేలా చేశాడు. బ్యాట్స్‌మన్‌గానూ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. డబ్ల్యూటీసీలో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు (10 మ్యాచ్‌ల్లో 61.20 సగటుతో 918) చేసిన ఆటగాడతనే.

అందరివాడు..: టీమ్‌ఇండియా ఓడిందని బాధ పడ్డ భారత అభిమానులు.. అదే సమయంలో న్యూజిలాండ్‌ విజయాన్నీ ఆస్వాదించారు. గెలిచింది మన విలియమ్సన్‌ జట్టే కదా అనుకున్నారు. ఈ కివీస్‌ కెప్టెన్‌ను మన ప్రజలు ఎంతలా అభిమానిస్తారో చెప్పడానికి ఇదో నిదర్శనం. వివాద రహితుడిగా.. అందరికీ ఇష్టమైన ఆటగాడిగా.. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఆడుతూ.. మన తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఎంతో దగ్గరయ్యాడు. మైదానంలో తన వ్యక్తిత్వంతో ఇక్కడా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘‘కేన్‌ మామ’’ అని మనవాళ్లు అతణ్ని ఆప్యాయంగా పిలవడాన్ని బట్టే.. తనపై ఇక్కడి ప్రజలకు ఎంతటి ప్రేమ ఉందో తెలుస్తోంది. దూకుడుతో జట్టును నడిపించే సారథులుంటారు.. సహచర ఆటగాళ్లపై పెత్తనం చలాయించే కెప్టెన్లూ ఉంటారు. కానీ విలియమ్సన్‌ మాత్రం అనకువగా ఉంటూనే.. అద్భుతాలు చేస్తున్నాడు. సంయమనంతో సత్తాచాటుతున్నాడు. తన ప్రవర్తనతో, వ్యక్తిత్వంతో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాడు. దూకుడుగానే ఉండాలి.. హడావిడి చేయాలి అని కాకుండా ప్రశాంతంగా ఉంటూనే.. ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగితే ఫలితాలు రాబట్టవచ్చని చాటుతున్నాడు. హుందాగా ప్రవర్తించే జట్టుకు నాయకుడిగా మరింత హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లను పరిశీలిస్తే ప్రతి ఒక్కరికీ ఓ ప్రతికూల విషయం ఉంటుంది. కానీ ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేని ఆటగాడు.. విలియమ్సన్‌ ఒక్కడే. అతడు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మహర్షి
 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని