విశాఖలో టీ20.. హైదరాబాద్‌కు నిరాశే

దేశంలో మళ్లీ క్రికెట్‌ సందడి ఊపందుకోనుంది. టీ20ల మోత మోగనుంది. వచ్చే ఎనిమిది నెలల్లో స్వదేశంలో టీమ్‌ఇండియా ఆడే అంతర్జాతీయ సిరీస్‌లకు సోమవారం బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేసింది.

Updated : 21 Sep 2021 06:48 IST

స్వదేశంలో సిరీస్‌లను ప్రకటించిన బీసీసీఐ

దిల్లీ

దేశంలో మళ్లీ క్రికెట్‌ సందడి ఊపందుకోనుంది. టీ20ల మోత మోగనుంది. వచ్చే ఎనిమిది నెలల్లో స్వదేశంలో టీమ్‌ఇండియా ఆడే అంతర్జాతీయ సిరీస్‌లకు సోమవారం బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా ఓ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని విశాఖపట్నం దక్కించుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న వెస్టిండీస్‌తో రెండో టీ20 విశాఖలో జరుగుతుంది. హైదరాబాద్‌కు మాత్రం నిరాశే మిగిలింది. ఉప్పల్‌ స్టేడియానికి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. భవిష్యత్‌ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది నవంబర్‌ నుంచి 2022 జూన్‌ మధ్యలో సొంతగడ్డపై భారత్‌ 14 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు కలిపి మొత్తం 21 మ్యాచ్‌లు ఆడనుంది. కానీ అందులో ఒక్క మ్యాచ్‌కూ హైదరాబాద్‌ వేదిక కాదు. అందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లోని అంతర్గత కుమ్ములాటలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు వర్గాలుగా చీలిపోయిన హెచ్‌సీఏ పాలకవర్గం విభేదాలతో ఇప్పటికే హైదరాబాద్‌ అబాసుపాలైంది. ఈ ఏడాది ఐపీఎల్‌ 14వ సీజన్‌ మ్యాచ్‌ల వేదికల్లోనూ హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఇక ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయంలోనూ నిరాశ తప్పలేదు. మ్యాచ్‌ల నిర్వహణలో ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్‌కు ఇప్పుడు ఇలాంటి దుస్థితి రావడం ఇక్కడి క్రికెట్‌ ప్రేమికులకు రుచించట్లేదు. ఇక టెస్టులకు కాన్పూర్‌, ముంబయి, బెంగళూరు, మొహాలీ.. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు జైపుర్‌, రాంచి, లఖ్‌నవూ, విశాఖ, కోల్‌కతా, అహ్మదాబాద్‌, కటక్‌, త్రివేండ్రం, చెన్నై, రాజ్‌కోట్‌, దిల్లీ ఆతిథ్యమిస్తాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో.. పొట్టి ఫార్మాట్‌పైనే బీసీసీఐ ఎక్కువగా దృష్టి పెట్టింది.


టీమ్‌ఇండియా షెడ్యూల్‌

న్యూజిలాండ్‌తో మూడు టీ20లు (నవంబరు 17, 19, 21వ తేదీల్లో), రెండు టెస్టులు (నవంబరు 25-29, డిసెంబరు 3-7)

వెస్టిండీస్‌తో మూడు వన్డేలు (ఫిబ్రవరి 6, 9, 12), మూడు టీ20లు (ఫిబ్రవరి 15, 18, 21)

శ్రీలంకతో రెండు టెస్టులు (ఫిబ్రవరి 25-మార్చి1, మార్చి 5-9), మూడు టీ20లు (మార్చి 13, 15, 18)

దక్షిణాఫ్రికాతో అయిదు టీ20లు (జూన్‌ 9, 12, 14, 17, 19)

* మధ్యలో డిసెంబర్‌ నుంచి జనవరి వరకూ దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా పర్యటిస్తుంది. ఏప్రిల్‌ నుంచి మే వరకు ఐపీఎల్‌ 15వ సీజన్‌  జరిగే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని