ఈ ఒక్కటైనా..

మన జట్టేమీ చెత్తగా ఆడలేదు. ఏ మ్యాచ్‌లోనూ చిత్తుగానూ ఓడలేదు. మెరుగైన ప్రదర్శనే చేసినా.. కీలక సమయాల్లో పట్టు కోల్పోయి ఓటమలు చవిచూసింది. ఈసారి దక్షిణాఫ్రికా  పర్యటనను గొప్ప విజయంతో ఆరంభించి..

Published : 23 Jan 2022 01:59 IST

పరువు కోసం భారత్‌ పోరాటం

దక్షిణాఫ్రికాతో చివరి వన్డే నేడే

మధ్యాహ్నం 2 నుంచి

కేప్‌టౌన్‌

మన జట్టేమీ చెత్తగా ఆడలేదు. ఏ మ్యాచ్‌లోనూ చిత్తుగానూ ఓడలేదు. మెరుగైన ప్రదర్శనే చేసినా.. కీలక సమయాల్లో పట్టు కోల్పోయి ఓటమలు చవిచూసింది. ఈసారి దక్షిణాఫ్రికా  పర్యటనను గొప్ప విజయంతో ఆరంభించి.. ఆ తర్వాత వరుస ఓటములతో ముందుగా టెస్టు సిరీస్‌ను, ఆపై వన్డే   సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడిక వన్డే పోరులో చివరి మ్యాచ్‌కు వేళైంది. విజయంతో ఆరంభించిన పర్యటనను విజయంతోనే ముగించి కాస్త సంతృప్తితో టీమ్‌ఇండియా ఇంటిముఖం పడుతుందేమో చూడాలి.

క్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా పర్యటనకు నేడే ముగింపు. ఆ ముగింపు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. టెస్టు సిరీస్‌లో పరాజయం తర్వాత వన్డేల్లోనూ వరుసగా రెండు ఓటములతో సిరీస్‌ కోల్పోయిన రాహుల్‌ సేన.. ఆదివారం నామమాత్రమైన చివరి వన్డేలో సఫారీ జట్టుతో తలపడబోతోంది. సిరీస్‌ పోయినా.. ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్‌ తప్పించుకుని పరువు దక్కించుకోవాలని భారత్‌ చూస్తోంది. ఈ మ్యాచ్‌ రాహుల్‌ నాయకత్వ పటిమకు అతి పెద్ద పరీక్ష అనడంలో సందేహం లేదు. ఈ సిరీస్‌లో అత్యంత విమర్శలు ఎదుర్కొన్న ఆటగాడు అతనే. అందుక్కారణం.. స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ ప్రదర్శన చేయకపోవడానికి తోడు కెప్టెన్సీ వ్యూహాలు పూర్తిగా తేలిపోతుండటమే. రాహుల్‌ బౌలింగ్‌ మార్పులు, ఫీల్డింగ్‌ ఏర్పాట్లు ఏమాత్రం పని చేయట్లేదు. తొలి వన్డేలో భారత్‌ 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ మైదానంలోనే.. 288 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా అలవోకగా ఛేదించడంతో రాహుల్‌ నాయకత్వంపై విమర్శలు రెట్టింపయ్యాయి. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రుజువు చేసుకోకుండా ఇకపై ఏ ఫార్మాట్లోనూ అతను ఈ బాధ్యతలు అందుకునే అవకాశం లేనట్లే. అలాగే బ్యాటింగ్‌లో తన శైలిలో మెరుపు, భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం కూడా ఉంది.

మిడిల్‌ మారదా?: పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌ను చాన్నాళ్ల నుంచి వేధిస్తున్న మిడిలార్డర్‌ సమస్య ఎంతకీ పరిష్కారం కావట్లేదు. సులువుగా గెలవాల్సిన తొలి వన్డేను భారత్‌ కోల్పోయిందన్నా.. రెండో వన్డేలో భారీ స్కోరు చేసే అవకాశం చేజార్చుకుందన్నా.. అందుకు మిడిలార్డర్‌ వైఫల్యమే కారణం. శ్రేయస్‌ అయ్యర్‌ వైఫల్యంతో ‘మిడిల్‌’ సమస్య మరింత పెద్దదవుతోంది. వెంకటేశ్‌ అయ్యర్‌ రెండు అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాడు. వీళ్లిద్దరూ చివరి వన్డేలో సత్తా చాటి తీరాల్సిందే. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్లో కాస్త ముందు వచ్చిన పంత్‌.. మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ అతడిచ్చిన ఊపును భారత్‌ కొనసాగించలేకపోయింది. బౌలరైన శార్దూల్‌ను చూసి బ్యాట్స్‌మెన్‌ స్ఫూర్తి పొందాల్సిన అవసరముంది. కోహ్లి తన స్థాయి ఇన్నింగ్స్‌ ఎప్పుడు ఆడతాడో అని అభిమానులు చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. సెంచరీ కోసం రెండేళ్లకు పైగా సాగుతున్న నిరీక్షణకు ఈ మ్యాచ్‌లో అయినా తెరదించుతాడేమో చూడాలి.

భువి ఎందుకు?: 10-0-64-0.. 8-0-67-0.. ఇవీ తొలి రెండు వన్డేల్లో భువనేశ్వర్‌ గణాంకాలు. దీపక్‌ చాహర్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ లాంటి యువ ప్రతిభావంతుల్ని కాదని అవకాశమిస్తే ఈ సీనియర్‌ పేసర్‌ ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. బుమ్రా బాగా బౌలింగ్‌ చేస్తున్నా.. కొత్త బంతి భాగస్వామి తేలిపోవడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించలేకపోయింది భారత్‌. శార్దూల్‌ బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటున్నా.. బౌలింగ్‌ ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. స్పిన్నర్‌ అశ్విన్‌ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్‌ పరంగా కొన్ని మార్పులు తప్పకపోవచ్చు. బౌలింగ్‌ పుంజుకోకుంటే వైట్‌వాష్‌ తప్పకపోవచ్చు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ కూడా ఏమంత గొప్పగా లేకున్నా.. బ్యాట్స్‌మెన్‌ జోరుతో ఆ జట్టు సిరీస్‌ సాధించింది. డికాక్‌, మలన్‌, వాండర్‌డసెన్‌, బవుమా, మార్‌క్రమ్‌.. ఇలా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎప్పుడూ పేస్‌ బలంగా బరిలోకి దిగే ఆ జట్టు.. ఈ సిరీస్‌లో మాత్రం స్పిన్నర్లనే నమ్ముకుంటోంది. షంసి, కేశవ్‌ మహరాజ్‌లతో పాటు పార్ట్‌ టైం స్పిన్నర్‌ మార్‌క్రమ్‌ సత్తా చాటుతున్నాడు. మరి వీరి దాడిని చివరి వన్డేలో భారత్‌ ఏమేర తట్టుకుంటుందో.. జోరుమీదున్న ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌కు ఎలా కళ్లెం వేస్తుందో చూడాలి.


2

వన్డేల్లో వంద మైలురాయిని అందుకోవడానికి చాహల్‌కు కావాల్సిన వికెట్లు.


37

కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా ఆడిన వన్డేలు. అందులో 31 నెగ్గి, 6 ఓడింది. ఇక్కడ భారత్‌ 5 వన్డేలాడి 3 గెలిచింది, 2 ఓడింది.


64

సెంచరీ లేకుండా కోహ్లి ఇన్నింగ్స్‌లు


* కేప్‌టౌన్‌ పిచ్‌ బ్యాట్స్‌మెన్‌, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. స్పిన్నర్లతో పోలిస్తే పేసర్లదే ఆధిపత్యం. మరీ భారీ స్కోర్లు నమోదు కావు. 270-280 చేస్తే గెలిచే ఛాన్సుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని