Dravid - Rohit: నాకు, రోహిత్కు ఆ స్పష్టత ఉంది: ద్రవిడ్
ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్లో ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలనే విషయంలో జట్టు యాజమాన్యానికి స్పష్టత ఉందని టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.
కోల్కతా: ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్లో ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలనే విషయంలో జట్టు యాజమాన్యానికి స్పష్టత ఉందని టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ‘‘నాతో పాటు రోహిత్, సెలక్టర్లకు కూర్పు విషయంలో ఒక స్పష్టత ఉంది. ఈ విషయంలో మేమేమీ ఒక నిర్ధిష్టమైన పద్ధతిని అనుసరించడం లేదు. కానీ ప్రపంచకప్కు జట్టు సమతూకం ఎలా.. ఎలాంటి కూర్పుతో ఆడాలి అనే విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నాం. ఆటగాళ్లపై పనిభారాన్ని సమీక్షిస్తూ ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న అందరికీ వీలైనన్ని ఎక్కువ అవకాశాలివ్వడానికి ప్రయత్నిస్తాం. కచ్చితంగా ఇంతమందినే ఆడించాలని అనుకోవట్లేదు. అదే సమయంలో మరీ ఎక్కువ మందిని పరీక్షించాలని భావించట్లేదు. కానీ ప్రతి ఒక్కరికీ ప్రపంచకప్ ఆరంభమయ్యేలోపు 10-20 మధ్య మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలనుకుంటున్నాం. ఒక్క మ్యాచ్ లేదా ఒక్క సిరీస్తో ఏ ఆటగాడిపైనా ఒక అంచనాకు రాలేం. టీ20 అనేది కఠినమైన ఫార్మాట్. సాహసంతో కూడుకున్న ఆట ఆడాల్సి ఉంటుంది. ఎప్పుడూ షాట్లు ఆడుతూనే ఉండమని చెబుతాం. అలా ఆడుతున్నపుడు ఎవరిపైనా వెంటనే ఒక అంచనాకు రాకూడదు. వెస్టిండీస్తో మూడో టీ20లో రుతురాజ్, అవేష్ ఖాన్ ఆడారు. ఈ మ్యాచ్లో వీరి ప్రదర్శనను బట్టి ఒక ముద్ర వేయలేం’’ అని ద్రవిడ్ అన్నాడు. సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్పై రాహుల్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతను ఐపీఎల్లో ఓపెనర్గా ఆడతాడు. మేం అతడికి మిడిలార్డర్లో ఆడే బాధ్యత అప్పగించాం. వెస్టిండీస్తో సిరీస్లో మ్యాచ్ మ్యాచ్కూ అతను మెరుగయ్యాడు. ఆరో బౌలర్ అంటే ప్రతిసారీ బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతా బాగున్నపుడు కెప్టెన్ అతడికి బంతి ఇవ్వకపోవచ్చు. కఠినమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేయమనొచ్చు. చివరి టీ20లో దీపక్ చాహర్ గాయపడితే వెంకటేశ్కు అలాగే రోహిత్ బంతినిచ్చాడు. అతను కీలక వికెట్లతో సత్తా చాటాడు. అతనీ సిరీస్లో రాణించడం శుభ పరిణామం’’ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి