ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన జేసన్‌ రాయ్‌

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బయో బబుల్‌ అలసట కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌

Published : 02 Mar 2022 04:04 IST

దిల్లీ: ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బయో బబుల్‌ అలసట కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ప్రకటించాడు. ఇటీవల ఆటగాళ్ల వేలంలో రాయ్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు గుజరాత్‌ కొనుక్కుంది. రాయ్‌పై గట్టి నమ్మకంతో గుజరాత్‌ మరో ఓపెనర్‌ను తీసుకోలేదు. శుభ్‌మన్‌ గిల్‌తో పాటు రాయ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేలా గుజరాత్‌ ప్రణాళికలు రచించుకుంది. అయితే 31 ఏళ్ల రాయ్‌ నిర్ణయంతో గుజరాత్‌ అంచనాలు తారుమారు అయ్యాయి. ‘‘ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నా. నాపై నమ్మకంతో వేలంలో ఎంపిక చేసుకున్న జట్టు మేనేజ్‌మెంట్‌, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యకు కృతజ్ఞతలు. గత మూడేళ్లుగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు నాపై కూడా ప్రభావం చూపాయి. కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు ఇదే సరైన సమయమని అనిపించింది. ఈ ఏడాది తీరిక లేని షెడ్యూల్‌ నేపథ్యంలో రానున్న కొన్ని నెలలు నా ఆటతీరు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తా. ఏదేమైనా గుజరాత్‌ ఆడే ప్రతి మ్యాచ్‌ను చూస్తా. తొలి ఏడాదే ఐపీఎల్‌ ట్రోఫీని అందుకునేలా పూర్తి మద్దతు ఇస్తా’’ అని రాయ్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ నుంచి రాయ్‌ వైదొలగడం ఇది రెండోసారి. 2020 సీజన్‌లో వ్యక్తిగత కారణాలతో రాయ్‌ తప్పుకున్నాడు. అప్పట్లో దిల్లీ క్యాపిటల్స్‌ రూ.1.5 కోట్లకు రాయ్‌ను కొనుక్కుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని