Virat Kohli: కోహ్లి వందో టెస్టు ప్రేక్షకుల సమక్షంలో..

భారత్‌, శ్రీలంక మధ్య శుక్రవారం ఆరంభం కానున్న మొదటి టెస్టు విరాట్‌ కోహ్లీకి వందో టెస్టు. శుభవార్త ఏంటంటే ఈ మ్యాచ్‌ ప్రేక్షకుల మధ్యే జరగనుంది. కరోనా నేపథ్యంలో మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదని ఇంతకుముందు

Updated : 02 Mar 2022 07:57 IST

మొహాలి: భారత్‌, శ్రీలంక మధ్య శుక్రవారం ఆరంభం కానున్న మొదటి టెస్టు విరాట్‌ కోహ్లీకి వందో టెస్టు. శుభవార్త ఏంటంటే ఈ మ్యాచ్‌ ప్రేక్షకుల మధ్యే జరగనుంది. కరోనా నేపథ్యంలో మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదని ఇంతకుముందు నిర్ణయించిన బీసీసీఐ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ‘‘భారత్‌, శ్రీలంక మధ్య మొహాలీలోని పంజాబ్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే తొలి టెస్టు మూసి ఉంచిన స్టేడియంలో జరగదు. మైదానంలో ప్రేక్షకులను అనుమతించాలన్న నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర క్రికెట్‌ సంఘం. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక సంఘం ఈ నిర్ణయానికి వచ్చింది. పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) అధికారులతో మాట్లాడా. విరాట్‌ 100వ టెస్టును ప్రేక్షకులు చూడగలుగుతారని వాళ్లు చెప్పారు’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో చెప్పాడు. ‘‘విరాట్‌ వందో టెస్టు కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అతడికి నా శుభాకాంక్షలు. అతడు మరిన్ని మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నా’’ అని అన్నాడు. స్టేడియంలోకి 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తామని పీసీఏ కోశాధికారి ఆర్పీ సింగ్లా చెప్పాడు.


ఆ రోజు విరాట్‌ అలా..

దిల్లీ: 2006.. దిల్లీ, కర్ణాటక మధ్య రంజీ మ్యాచ్‌. మూడో రోజు ఆట ఆరంభానికి ముందు దిల్లీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో అంతా నిశ్శబ్దం. ఆటగాళ్లందరి చూపు 17 ఏళ్ల విరాట్‌ కోహ్లిపైనే. అతడు మాత్రం బ్యాటింగ్‌ దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. కళ్లలో బాధ కనిపిస్తున్నా.. బరువెక్కిన హృదయంతో అతడు జట్టు కోసం ఆడేందుకు సిద్ధమయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో ఆడటం అటుంచితే.. అందరితో కలిసి ఉండటం కూడా చాలా కష్టం. కారణం.. ముందు రోజు రాత్రి తాను ఎంతగానో ప్రేమించే తండ్రిని కోహ్లి కోల్పోయాడు. అతడి తండ్రి ప్రేమ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో తనువు చాలించాడు. అయినా కోహ్లి బ్యాట్‌ పట్టుకుని కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునేందుకు సిద్ధమయ్యాడు. టెస్టు క్రికెట్లో విరాట్‌ వందో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ.. ఆ విషయాన్ని అప్పటి అతడి సహచరుడు పునీత్‌ బిస్త్‌ గుర్తుచేసుకున్నాడు. ‘‘ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం అది. అలాంటి పరిస్థితుల్లోనూ ఆట ఆడేందుకు సిద్ధమయ్యేంత ధైర్యం అతడికెలా సాధ్యమైంది. అతడికి ఎదురైన విషాదంతో జట్టంతా బాధతో ఉంది. అతడు మాత్రం మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికి అతడి తండ్రి అంత్యక్రియలు కూడా పూర్తి కాలేదు. కెప్టెన్‌ మిథున్‌ మన్హస్‌, కోచ్‌ చేతన్‌ చౌహాన్‌ ఇంటికి వెళ్లమని విరాట్‌ను కోరినా కూడా వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆ రోజు కోహ్లి ఇంటికి వెళ్లాలనే అంతా కోరుకున్నాం. కానీ అందరి అంచనాలకు భిన్నంగా కోహ్లి ఆలోచనలు ఉన్నాయి. అతడు జట్టు కోసం ఆలోచించాడు. నాతో పాటు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంత విషాదంలోనూ తన శైలిలో షాట్లు ఆడాడు. ఇప్పుడు కోహ్లికి 33 ఏళ్లు వచ్చాయి.. కానీ అతడి ఆలోచన తీరు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంది’’ అని పునీత్‌ అన్నాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లితో కలిసి అతడు 152 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. బిస్త్‌ 156 పరుగులు చేస్తే.. కోహ్లి 90 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌ను దిల్లీ డ్రాగా ముగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని