Hyderabad: బంతులు కాదు బుల్లెట్లు
మ్యాచ్లో రెండో ఓవర్. దక్షిణాఫ్రికా టీనేజర్ మార్కో జాన్సన్ చేతిలో బంతి. క్రీజులో డుప్లెసిస్. బంతి ఇలా పడింది. అలా స్టంప్స్ చెల్లాచెదురయ్యాయి. ఏం జరిగిందో అర్థం కానట్లు చూశాడు డుప్లెసిస్. తర్వాత కోహ్లి క్రీజులోకి వచ్చాడు.
జాన్సన్, నటరాజన్, సుచిత్ విజృంభణ
68 పరుగులకే కుప్పకూలిన బెంగళూరు
హైదరాబాద్కు వరుసగా అయిదో గెలుపు
మ్యాచ్లో రెండో ఓవర్. దక్షిణాఫ్రికా టీనేజర్ మార్కో జాన్సన్ చేతిలో బంతి. క్రీజులో డుప్లెసిస్. బంతి ఇలా పడింది. అలా స్టంప్స్ చెల్లాచెదురయ్యాయి. ఏం జరిగిందో అర్థం కానట్లు చూశాడు డుప్లెసిస్. తర్వాత కోహ్లి క్రీజులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో అయినా ఫామ్ అందుకుంటాడనుకుంటే.. క్షణాల్లో అతడి పనైపోయింది. స్లిప్లో ఫీల్డర్ చేతుల్లో బంతి పడగానే.. తలవంచుకుని పెవిలియన్కు వెళ్లిపోయాడు. అదే ఓవర్ చివరి బంతికి అనుజ్ రావత్ ఔట్. బెంగళూరు స్కోరు 8/3. అక్కడి నుంచి ఏ దశలోనూ కోలుకోలేదా జట్టు. నటరాజన్, మిగతా బౌలర్లు కూడా విజృంభించడంతో 68 పరుగులకే (సీజన్లో అత్యల్ప స్కోరు) బెంగళూరు కథ ముగిసింది. ఆ తర్వాత ఛేదన లాంఛనమే. రెండు వరుస ఓటములతో టోర్నీని ఆరంభించిన హైదరాబాద్కిది వరుసగా అయిదో విజయం.
ముంబయి
ఈ మెగా టోర్నీని పేలవంగా ఆరంభించి, ఆ తర్వాత మ్యాచ్ మ్యాచ్కూ మెరుగవుతూ వరుస విజయాలు సాధిస్తున్న హైదరాబాద్.. శనివారం లీగ్లోని ప్రత్యర్థులందరికీ కంగారు పుట్టించే ప్రదర్శన చేసింది. మొదట ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కో జాన్సన్ (3/25)తో పాటు నటరాజన్ (3/10), సుచిత్ (2/12) విజృంభించడంతో బెంగళూరును 68 పరుగులకే కుప్పకూల్చిన ఆ జట్టు.. లక్ష్యాన్ని కేవలం 8 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (47; 28 బంతుల్లో 8×4, 1×6) బెంగళూరు బౌలింగ్ను ఉతికారేశాడు. హైదరాబాద్ విజయం లాంఛనమే అని ముందే తేలిపోయినప్పటికీ.. అభిషేక్ చెలరేగిన తీరు బెంగళూరు బ్యాటింగ్ వైఫల్యాన్ని మరింత ఎత్తి చూపింది. బెంగళూరు బ్యాట్స్మన్ విలవిలలాడిన అదే పిచ్పై.. అతను చెలరేగిపోయి ఆ జట్టు బాధను రెట్టింపు చేశాడు. పవర్ప్లే ముగిసేరికే హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేయగా.. అందులో అభిషేక్ వాటానే 46. అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్న అతను హర్షల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఔటవగా.. విలియమ్సన్ (16 నాటౌట్), రాహుల్ త్రిపాఠి (7 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. 12 ఓవర్లుండగానే గెలవడంతో నెట్ రన్రేట్ను భారీగా పెంచుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది హైదరాబాద్.
ప్రతిఘటనే లేకుండా..: అంతకుముందు వరుసగా ఏడో మ్యాచ్లోనూ టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకోగా.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరు అసాధారణ రీతిలో కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లలో ప్రతి ఒక్కరూ కట్టుదిట్టమైన బంతులతో బెంగళూరుకి చుక్కలు చూపించారు. స్పిన్నర్ సుచిత్ సహా ఏ బౌలరూ పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన బెంగళూరు బ్యాట్స్మెన్ వికెట్లిచ్చేసి పెవిలియన్కు క్యూ కట్టారు. ఆరంభంలో జాన్సన్ దెబ్బకు కుదేలైన ఆ జట్టు.. ఏ దశలోనూ కోలుకోలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అతను డుప్లెసిస్ (5), కోహ్లి (0), అనుజ్ రావత్ (0)లను ఔట్ చేసి హైదరాబాద్కు అదిరే ఆరంభాన్నిచ్చాడు. డుప్లెసిస్ బంతి లైన్కు అడ్డంగా ఆడి బౌల్డయితే.. ఆఫ్ స్టంప్ మీద పడే బంతులను వెంటాడి స్లిప్లో క్యాచ్ ఇచ్చే బలహీనతను పునరావృతం చేస్తూ విరాట్ వెనుదిరిగాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ అతను ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరగడం గమనార్హం. ఔటయ్యాక వంచిన తలను అతను మైదానం వీడే వరకు ఎత్తనే లేదు. అదే ఓవర్లో చివరి బంతికి అనుజ్ రావత్ కూడా స్లిప్లోనే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సీజన్లో చాలా మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఆరంభంలో కష్టాల్లో పడటం, తర్వాత కుదురుకోవడం చూశాం. బెంగళూరు కూడా కొన్ని మ్యాచ్ల్లో అలాగే పుంజుకుంది. ఈ మ్యాచ్లోనూ అదే జరుగుతుందని అనుకుంటే.. అసలు ప్రతిఘటనే లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లు ఆ అవకాశమే ఇవ్వలేదు. చివరి దాకా ఒకే తీవ్రతను కొనసాగించి బెంగళూరును స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. జాన్సన్ ఇచ్చిన ఆరంభాన్ని సద్వినియోగం చేస్తూ తర్వాత నటరాజన్, సుచిత్ విజృంభించారు. తన తొలి ఓవర్ రెండో బంతికే ప్రమాదకర మ్యాక్స్వెల్ (12)ను నటరాజన్ ఔట్ చేస్తే.. సుచిత్ ఒకే ఓవర్లో సుయాశ్ (15), కార్తీక్ (0)లను పెవిలియన్ చేర్చి బెంగళూరు పతనాన్ని మరింత వేగవంతం చేశాడు. మధ్యలో ఉమ్రాన్ మాలిక్ (1/13) బుల్లెట్ బంతులకు వికెట్లు కాచుకోవడమే సరిపోయింది తప్ప.. బ్యాట్స్మెన్ పరుగులే చేయలేదు. అతను షాబాజ్ అహ్మద్ (7)ను ఔట్ చేశాడు. 13వ ఓవర్లో నటరాజన్.. తనదైన శైలిలో హర్షల్ (4), హసరంగ (8)లను బౌల్డ్ చేయడంతో బెంగళూరు పనైపోయింది. 17వ ఓవర్ తొలి బంతికి భువనేశ్వర్ (1/8).. సిరాజ్ (2)ను ఔట్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.