IND vs ENG: భారత్‌ x ఇంగ్లాండ్‌: అప్పుడేమైందంటే?

ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ కోసం సుదీర్ఘంగా సాగుతున్న నిరీక్షణకు గత ఏడాది దాదాపుగా తెరదించినట్లే కనిపించింది టీమ్‌ఇండియా. నాలుగో టెస్టు అయ్యేసరికి 2-1తో ఆధిక్యంలో నిలిచిన భారత్‌.. సిరీస్‌ సాధించడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా చివరి టెస్టు ఆడకుండానే ఇంటిముఖం పట్టడంతో సిరీస్‌ అసంపూర్ణంగా ఉండిపోయింది.

Updated : 23 Jun 2022 07:17 IST

ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ కోసం సుదీర్ఘంగా సాగుతున్న నిరీక్షణకు గత ఏడాది దాదాపుగా తెరదించినట్లే కనిపించింది టీమ్‌ఇండియా. నాలుగో టెస్టు అయ్యేసరికి 2-1తో ఆధిక్యంలో నిలిచిన భారత్‌.. సిరీస్‌ సాధించడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా చివరి టెస్టు ఆడకుండానే ఇంటిముఖం పట్టడంతో సిరీస్‌ అసంపూర్ణంగా ఉండిపోయింది. కొవిడ్‌ కారణంగా అప్పుడు వాయిదా పడ్డ ఆ మ్యాచ్‌ను ప్రస్తుత ఇంగ్లాండ్‌ పర్యటనలో ఆడబోతోంది భారత్‌. ఈ ఆసక్తికర సమరానికి సిద్ధమవుతున్న వేళ.. గత ఏడాది ఆ సిరీస్‌లో ఏం జరిగింది.. భారత్‌ ఎలా ఆధిక్యంలోకి వెళ్లింది.. అందుకు కారకులెవరు.. ప్రత్యర్థి ఆట ఎలా సాగింది.. ఓసారి నెమరు వేసుకుందాం పదండి.

ఈనాడు క్రీడావిభాగం

1932 నుంచి ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న భారత క్రికెట్‌ జట్టు.. ప్రస్తుత సిరీస్‌ కంటే ముందు ఇంగ్లిష్‌ జట్టుతో 18 సిరీస్‌లు ఆడింది. అందులో నాలుగుసార్లు మాత్రమే సిరీస్‌ కోల్పోలేదు. 1971లో 1-0తో, 1986లో 2-0తో, 2007లో 1-0తో సిరీస్‌లు సాధించింది భారత్‌. 2002లో సిరీస్‌ 1-1తో డ్రా అయింది. చివరి మూడు పర్యటనల్లో ఇంగ్లాండ్‌ గడ్డపై భారత్‌కు దారుణ పరాభవాలు తప్పలేదు. 2011లో 0-4తో, 2014లో 1-3తో, 2018లో 1-4తో సిరీస్‌లు కోల్పోయిన టీమ్‌ఇండియా.. నిరుడు కచ్చితంగా ఫలితం మార్చాలనే పట్టుదలతో ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టింది. అప్పటికే సొంతగడ్డపై ఇంగ్లిష్‌ జట్టును టెస్టు సిరీస్‌లో 3-1తో చిత్తు చేయడం కోహ్లీసేన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందది. దీనికి తోడు సిరీస్‌ ముంగిట ఆతిథ్య జట్టు ఫామ్‌ కూడా బాగా లేదు. ఈ స్థితిలో ఈసారి కథ మారబోతోందని తొలి టెస్టుతోనే అర్థమైపోయింది. వర్ష ప్రభావం బాగా పడ్డ ఈ మ్యాచ్‌లో తొలి రెండు రోజుల్లో కలిపి 46.4 ఓవర్లే సాధ్యమయ్యాయి. చివరి రోజు ఆటే సాధ్యం కాలేదు. సాధ్యమైనంత ఆటలో టీమ్‌ఇండియా స్పష్టమైన పైచేయి సాధించింది. బుమ్రా (4/46), షమి (3/28)ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 183 పరుగులకే ఆలౌట్‌ చేయడం ద్వారా సిరీస్‌ను ఆశాజనకంగా ఆరంభించింది భారత్‌. కేఎల్‌ రాహుల్‌ (84), జడేజా (56) రాణించడంతో భారత్‌ 278 స్కోరుతో కీలక ఆధిక్యం సంపాదించింది. బుమ్రా (5/64) రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదరగొట్టినప్పటికీ.. రూట్‌ (109) వీరోచిత శతకం సాధించడంతో ఇంగ్లాండ్‌ 303 పరుగులు చేయగలిగింది. భారత్‌కు 209 పరుగుల లక్ష్యం నిలవగా.. నాలుగో రోజు ఆట ఆఖరుకు స్కోరు 52/1. చివరి రోజు ఆట సాధ్యమైతే టీమ్‌ఇండియా లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచేదేమో. కానీ వరుణుడు అవకాశమివ్వలేదు.

పనైపోయిందనుకుంటే..

పటౌడీ ట్రోఫీలో తొలి టెస్టు తర్వాత సిరీస్‌ రసవత్తర మలుపులు తిరిగింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (129), రోహిత్‌ (83)ల మేటి ఇన్నింగ్స్‌లతో రెండో టెస్టును బాగా ఆరంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 364 పరుగులు చేయగా.. రూట్‌ (180 నాటౌట్‌) మరోసారి భారత బౌలర్లకు ఎదురు నిలిచి ఆతిథ్య జట్టుకు 27 పరుగుల ఆధిక్యాన్నందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రహానె (61), పుజారా (45) పోరాడినప్పటికీ.. ఒక దశలో 209/8తో నిలిచింది. ఇంగ్లాండ్‌ ముందు 200 లక్ష్యం కూడా నిలవదని, ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పదని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ షమి (56 నాటౌట్‌), బుమ్రా (34 నాటౌట్‌) అసాధారణ పోరాటంతో అనూహ్యంగా 298/8 చేరుకుని, ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది భారత్‌. ఈ పోరాట స్ఫూర్తి బౌలింగ్‌లోనూ కొనసాగించడంతో ఇంగ్లిష్‌ జట్టు 120 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్‌ (4/32), బుమ్రా (3/33), ఇషాంత్‌ (2/13) ఆ జట్టు పని పట్టి భారత్‌కు 151 పరుగుల విజయాన్నందించారు. ఇంత గొప్ప గెలుపు తర్వాత మూడో టెస్టులో ఊహించని విధంగా భారత్‌ పేలవ ప్రదర్శన చేయడం అభిమానులకు షాక్‌! ఇంగ్లిష్‌ బౌలర్ల ధాటికి లీడ్స్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులకే కుప్పకూలింది టీమ్‌ఇండియా. తర్వాత రూట్‌ (121) భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ సెంచరీ బాదడం, మిగతా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కూడా రాణించడంతో ఇంగ్లాండ్‌ 432 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ మెరుగుపడ్డప్పటికీ 278 పరుగులే చేయగలిగింది. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓడింది. పుజారా (91) టాప్‌స్కోరర్‌. ఈ పరాభవం తర్వాత ఓవల్‌లో టీమ్‌ఇండియా పుంజుకుంటుందని ఎవరూ అనుకోలేదు. ఆ అంచనాకు తగ్గట్లే తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు పరిమితమైంది. శార్దూల్‌ (51), కోహ్లి (50) పోరాడకుంటే ఆ మాత్రం స్కోరు కూడా సాధ్యమయ్యేది కాదు. ఇంగ్లాండ్‌ 290 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యం కూడగట్టుకుంది. దీంతో మరో ఓటమికి సిద్ధపడక తప్పదనిపించింది. కానీ రోహిత్‌ శర్మ (127) తన కెరీర్లోనే ఉత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌ ఆడడం.. రాహుల్‌ (46), పుజారా (61), కోహ్లి (44) కూడా పోరాడడం.. ఆపై రిషబ్‌ పంత్‌ (50), శార్దూల్‌ (60) ఎదురుదాడి చేయడంతో భారత్‌ అనూహ్యంగా 466 పరుగులు చేసింది. ఇంగ్లిష్‌ జట్టు ముందు 368 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపిన టీమ్‌ఇండియా.. ఉమేశ్‌ (3/60), బుమ్రా (2/27), జడేజా (2/50), శార్దూల్‌ (2/22) సమష్టిగా సత్తా చాటడంతో ప్రత్యర్థిని 210 పరుగులకే ఆలౌట్‌ చేసి 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఊపులో చివరి టెస్టు కూడా ఆడి ఉంటే సిరీస్‌ విజయం పూర్తయ్యేదే! కానీ జట్టులో కొవిడ్‌ కేసుల కారణంగా ఈ మ్యాచ్‌ ఆడకుండానే పర్యటనను ముగించింది.

కొవిడ్‌తో ముగిసి.. మళ్లీ కొవిడ్‌తోనే!

గత ఏడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో అయిదు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా అసంపూర్తిగా వదిలేసి స్వదేశానికి వచ్చేయడానికి కారణం.. కరోనా మహమ్మారే. జట్టులో అంతర్గతంగా వరుసగా కొవిడ్‌ కేసులు బయటపడుతూ ఆందోళన రేకెత్తిస్తుండటం, సుదీర్ఘ పర్యటనలో అప్పటికే ఆటగాళ్లు అలసిపోయి ఉండడంతో చివరి టెస్టు ఆడకుండా ఇంగ్లాండ్‌ నుంచి బయల్దేరింది భారత్‌. యూఏఈలో జరగాల్సిన ఐపీఎల్‌ రెండో దశకు భారత స్టార్‌ ఆటగాళ్లు ఆరంభం నుంచి అందుబాటులో ఉండటానికే ఈ మ్యాచ్‌ ఆడలేదని విమర్శలు వచ్చినా బీసీసీఐ వెరవలేదు. ముందు మిగిలిన చివరి టెస్టును ఈ సిరీస్‌తో సంబంధం లేకుండా.. వేరుగా, ఏకైక మ్యాచ్‌గా నిర్వహించాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ తర్వాత ఆ ఆలోచన మారింది. ఇరు దేశాల బోర్డులూ ఆగిన సిరీస్‌లో అయిదో టెస్టుగానే దీన్ని నిర్వహించాలని నిర్ణయించాయి. ఇప్పుడు టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌కు రావడంతో దానికి ముందు ఈ టెస్టు మ్యాచ్‌ జరిపిస్తున్నారు. అయితే అప్పుడు కరోనా కారణంగా సిరీస్‌ ఆగిపోగా.. ఇప్పుడు ఆ మిగిలిన మ్యాచ్‌ను నిర్వహించబోతుండగా మళ్లీ భారత్‌ను కొవిడ్‌ వెంటాడుతుండటం గమనార్హం. స్పిన్నర్‌ అశ్విన్‌కు కరోనా సోకడంతో అతను సహచరులతో పాటు విమానం ఎక్కలేకపోయాడు. వైరస్‌ నుంచి కోలుకున్న అతను కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు. మరోవైపు ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చేరుకున్న కోహ్లి కూడా కరోనా బారిన పడి కోలుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని