వందేళ్ల సెంటర్‌ కోర్టు.. వింబుల్డన్‌కే ప్రత్యేక ఆకర్షణ

ఆ కోర్టు.. బిల్‌ టిల్డెన్‌, హెలెన్‌ విల్స్‌, డాన్‌ బడ్జ్‌, సుజానె తొలితరం టెన్నిస్‌ క్రీడాకారుల ఆటకు వేదికగా నిలిచింది. రాడ్‌ లేవర్‌, బిల్లీ జీన్‌ కింగ్‌, గిబ్సన్‌ లాంటి తర్వాతి తరం ప్లేయర్ల అద్భుత విన్యాసాలకు సాక్షి అయింది. సెరెనా విలియమ్స్‌, రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌, మార్టినా నవ్రతిలోవా, పీట్‌ సంప్రాస్‌ లాంటి ఆధునిక

Updated : 04 Jul 2022 07:05 IST

లండన్‌: ఆ కోర్టు.. బిల్‌ టిల్డెన్‌, హెలెన్‌ విల్స్‌, డాన్‌ బడ్జ్‌, సుజానె తొలితరం టెన్నిస్‌ క్రీడాకారుల ఆటకు వేదికగా నిలిచింది. రాడ్‌ లేవర్‌, బిల్లీ జీన్‌ కింగ్‌, గిబ్సన్‌ లాంటి తర్వాతి తరం ప్లేయర్ల అద్భుత విన్యాసాలకు సాక్షి అయింది. సెరెనా విలియమ్స్‌, రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌, మార్టినా నవ్రతిలోవా, పీట్‌ సంప్రాస్‌ లాంటి ఆధునిక దిగ్గజాల అద్భుత విజయాల అడ్డాగానూ మారింది. వింబుల్డన్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన సెంట్రల్‌ కోర్టు గురించే ఈ ఉపోద్ఘాతం. 1922లో ప్రారంభమైన ఆ కోర్టు ఇప్పుడు వందేళ్లు పూర్తి చేసుకుంది. ఆనవాయితీ ప్రకారం వింబుల్డన్‌ మధ్యలో వచ్చే ఆదివారం మ్యాచ్‌లు జరగవు. కానీ ఆ కోర్టు శత వసంత ఉత్సవాల సందర్భంగా తొలిసారి ఆ రోజు కూడా ఈ టోర్నీలో మ్యాచ్‌లు నిర్వహించారు. చెయిర్‌ అంపైర్‌ స్టాండ్‌ పక్కన ‘సెంటర్‌ కోర్టు’, ‘100’ అనే పదాలు దర్శనమిచ్చాయి. విశిష్టమైన టోర్నీ టవల్‌ను అందుబాటులో ఉంచారు. ఆరంభంలో 9,989గా ఉన్న సీట్ల సంఖ్య 14,974కు పెరిగాయి. 2009లో ముడుచుకునే పైకప్పు ఏర్పాటు చేశారు. వింబుల్డన్‌ సింగిల్స్‌ విజేతలందరినీ వందేళ్ల వేడుకకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ కోర్టుతో ఉన్న అనుభవాన్ని తాజా, మాజీ ఆటగాళ్లు పంచుకున్నారు. ‘‘సెంటర్‌ కోర్టు టెన్నిస్‌కు మక్కా లాంటిది. ఎన్ని గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలున్నా ఇక్కడ అడుగుపెడితే ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది’’ అని ఏడుసార్లు వింబుల్డన్‌ ఛాంపియన్‌ సంప్రాస్‌ పేర్కొన్నాడు. అత్యధికంగా ఎనిమిది సార్లు వింబుల్డన్‌ విజేతగా నిలిచిన ఫెదరర్‌ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మోకాలి శస్త్రచికిత్స కారణంగా అతను తొలిసారి ఈ టోర్నీకి దూరమయ్యాడు. 1999లో ఇక్కడ మొదటిసారి పోటీపడ్డ ఫెదరర్‌ వరుసగా 22 సీజన్లు ఈ టోర్నీలో పోటీపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని