IND vs ENG : ఇలాంటి ముగింపా!

ఇంగ్లాండ్‌లో చివరి మూడు టెస్టు సిరీస్‌ల్లో భారత్‌కు ఎదురైన పరాభవాల లెక్క ఇది! ఈ పర్యటనల తాలూకు చేదు అనుభవాలు వెంటాడుతుండగా.. నిరుడు ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టి, అంచనాలను మించి రాణిస్తూ నాలుగు టెస్టులయ్యేసరికి 2-1తో ఆధిక్యంలో నిలిచింది టీమ్‌ఇండియా. అభిమానుల్లో ఆశ్చర్యం.. అంతకుమించిన ఆనందం!

Updated : 06 Jul 2022 09:43 IST

ఈనాడు క్రీడావిభాగం

2011లో 0-4.. 2014లో 1-3.. 2018లో 1-4..

ఇంగ్లాండ్‌లో చివరి మూడు టెస్టు సిరీస్‌ల్లో భారత్‌కు ఎదురైన పరాభవాల లెక్క ఇది! ఈ పర్యటనల తాలూకు చేదు అనుభవాలు వెంటాడుతుండగా.. నిరుడు ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టి, అంచనాలను మించి రాణిస్తూ నాలుగు టెస్టులయ్యేసరికి 2-1తో ఆధిక్యంలో నిలిచింది టీమ్‌ఇండియా. అభిమానుల్లో ఆశ్చర్యం.. అంతకుమించిన ఆనందం!

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోందని.. ఇంగ్లిష్‌ గడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌ గెలవబోతోందని ఉత్కంఠగా ఎదురు చూస్తే.. ఇప్పుడు ఆనందమంతా ఆవిరైంది. కరోనా కారణంగా వాయిదా పడి ఇప్పుడు పూర్తయిన అయిదో టెస్టులో బుమ్రాసేన ఊరించి ఉస్సూరుమనిపించింది.

టెస్టు మ్యాచ్‌ల్లో కీలక సందర్భాలను ఏ జట్టు ఎలా ఉపయోగించుకుంటుందన్న దాన్ని బట్టి మ్యాచ్‌ ఫలితాలు మారిపోతుంటాయి. అయిదో టెస్టులో తొలి రోజు మధ్యాహ్నం వరకు పైచేయి సాధించిన ఆతిథ్య జట్టు.. తర్వాత అంతా వెనుకబడే ఉంది. నాలుగో రోజు తొలి సెషన్‌ వరకు భారత్‌దే ఆధిపత్యం! కానీ 450 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపించిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అనుకున్నంతగా పోరాడలేకపోయింది. 377 ఆధిక్యానికి పరిమితం అయింది. మామూలుగా అయితే ఇది కష్టసాధ్యమైన లక్ష్యమే కానీ.. ఇప్పుడున్న ఊపులో ఇంగ్లాండ్‌కు అది సరిపోలేదు. ఇక 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి భారత్‌ పోటీలోకి వచ్చినా.. ఆ ఊపులో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయింది. భీకర ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో 14 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో విహారి అందుకోలేకపోయాడు. ఆ క్యాచ్‌ పట్టి ఉంటే ఇంగ్లాండ్‌ కచ్చితంగా ఒత్తిడి ఎదుర్కొనేదే. మ్యాచ్‌ ఫలితం కూడా మారిపోయేదేమో. నాలుగో రోజు బాగా ఎండ కాయడంతో పరిస్థితులు మారిపోవడం కూడా ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. బంతి స్వింగ్‌ కాలేదు. భారత బౌలర్లు కూడా ప్రభావవంతంగా బౌలింగ్‌ చేయలేకపోయారు. శార్దూల్‌ ఏమాత్రం బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తేలేకపోయాడు. ఫలితంగా భారత్‌కు ఓటమి తప్పలేదు. సిరీస్‌ దక్కలేదు.

వరుసగా మూడుసార్లు: గత కొన్నేళ్లలో విదేశాల్లో భారత్‌ కొన్ని గొప్ప విజయాలు సాధించడానికి బౌలర్ల ప్రతిభే ముఖ్య కారణం. ఆస్ట్రేలియా పర్యటనలో చారిత్రక విజయం సాధించడంలో వారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. పేస్‌ పిచ్‌లపై ప్రత్యర్థి జట్ల బౌలర్లను మించి మన బౌలర్లు రాణించారు. కానీ అవే పిచ్‌ల మీద చివరి మూడు టెస్టుల్లో మన బౌలర్లు మెరుగైన లక్ష్యాలను కూడా కాపాడుకోలేకపోయారు. నిరుడు డిసెంబర్లో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో అద్భుత విజయంతో సిరీస్‌ను గొప్పగా ఆరంభించింది టీమ్‌ఇండియా. ఆ తర్వాతి రెండు టెస్టుల్లోనూ తొలి ఇన్నింగ్స్‌ వరకు ప్రత్యర్థిని మన బౌలర్లు బాగానే కట్టడి చేశారు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 229 పరుగులే చేసింది. తర్వాత ఆ జట్టు ముందు 240 పరుగుల లక్ష్యం నిలిచింది. జొహానెస్‌బర్గ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంత లక్ష్యాన్ని చాలా కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఆతిథ్య జట్టు 3 వికెట్లే కోల్పోయి ఛేదించేసింది. కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులోనూ 212 పరుగుల ఛేదన తేలిక కాదని అనుకుంటే.. 3 వికెట్లే కోల్పోయి సఫారీ జట్టు లక్ష్యాన్ని అందుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌ ముందు 378 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కూడా ప్రత్యర్థి కోల్పోయింది 3 వికెట్లే. ఇంతకుముందే ఇలాంటి లక్ష్యాలను సులువుగా కాపాడుకున్న బౌలర్లు.. గత మూడు మ్యాచ్‌ల్లో మాత్రం తేలిపోయారు.

ఇది ఆ ప్రత్యర్థి కాదు: ముగింపులో భారత్‌కు చేదు అనుభవం మిగలడానికి ఇరు జట్లలో అప్పటికి, ఇప్పటికి వచ్చిన మార్పు కూడా కారణం. అప్పుడు సిరీస్‌ ఆధిక్యంలో కీలక పాత్ర పోషించిన కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ ఇప్పుడు జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. మిడిలార్డర్లో రహానె అనుభవాన్ని కూడా భారత్‌ కోల్పోయింది. అతడి స్థానంలో ఆడిన శ్రేయస్‌ నిరాశ పరిచాడు. దీంతో బ్యాటింగ్‌ బలహీనపడింది. ఇక ప్రత్యర్థి విషయానికి వస్తే.. నాటికి, నేటికి స్పష్టమైన మార్పు ఉంది. నిరుడు రూట్‌ నాయకత్వంలో రక్షణాత్మకంగా ఆడి దెబ్బ తిన్న ఇంగ్లిష్‌ జట్టు.. ఇప్పుడు స్టోక్స్‌ సారథ్యంలో పూర్తి భిన్నంగా, దూకుడుగా ఆడుతోంది. ప్రపంచ జట్లన్నీ తనవైపు చూసేలా ఆ జట్టు ఆటతీరు సాగుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ అయిన న్యూజిలాండ్‌ను టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ చేయడం.. మూడు టెస్టుల్లో వరుసగా 278, 299, 296 లక్ష్యాలను ఛేదించడం ఆ జట్టు ఎంత దూకుడుగా ఆడుతోందో చెప్పడానికి నిదర్శనం. ఆ ఊపులో ఇప్పుడు దేశం తరఫున అత్యధిక లక్ష్య ఛేదన రికార్డును స్టోక్స్‌ సేన ఖాతాలో వేసుకుంది. నిరుడు సిరీస్‌కు అందుబాటులో లేని స్టోక్స్‌.. ఇప్పుడు జట్టులో ఉండడం ఇంగ్లాండ్‌కు పెద్ద బలంగా మారింది. కెప్టెన్‌గా, ఆటగాడిగా అతను జట్టుకు బాగా ఉపయోగపడ్డాడు. సారథ్య భారం తొలగిపోవడంతో రూట్‌ మరింత స్వేచ్ఛగా పరుగులు రాబట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో అతడికి తోడవడంతో ఇంగ్లాండ్‌కు ఛేదనలో తిరుగులేకపోయింది. అండర్సన్‌, కొత్త ఫాస్ట్‌బౌలర్‌ పాట్స్‌ బౌలింగ్‌లో నిలకడగా రాణించడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది.

0

ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా ఒక్క విజయమూ సాధించలేదు. ఏడు మ్యాచ్‌ల్లో ఓడి, ఒకటి డ్రాగా ముగించింది.

378

టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. గత రికార్డు (ఆసీస్‌పై 359)ను ఆ జట్టు మెరుగుపర్చుకుంది.

ఇంగ్లాండ్‌లో భారత్‌కిది 19వ టెస్టు సిరీస్‌. సిరీస్‌ కోల్పోకుండా పర్యటనను ముగించడమిది అయిదోసారి. 1971లో

1-0తో, 1986లో 2-0తో, 2007లో 1-0తో సిరీస్‌లు సాధించిన భారత్‌.. 2002లో 1-1తో డ్రా చేసుకుంది. ఇప్పుడు మళ్లీ సిరీస్‌ను డ్రాగా ముగించింది. మిగతా 14 సందర్భాల్లో సిరీస్‌ చేజారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు