ఉందిలే మంచి కాలం

చదరంగం.. భారత్‌లో పుట్టి విశ్వవ్యాప్తమైన క్రీడ. చెస్‌ ఒలింపియాడ్‌.. ఆ ఆటలో ఒలింపిక్స్‌కు సమానంగా భావించే టోర్నీ. ప్రపంచ వ్యాప్తంగా 187 దేశాల నుంచి.. 1700 మందికి పైగా తలపడతారు. అలాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో 2014కి ముందు

Published : 11 Aug 2022 04:10 IST

చదరంగం.. భారత్‌లో పుట్టి విశ్వవ్యాప్తమైన క్రీడ. చెస్‌ ఒలింపియాడ్‌.. ఆ ఆటలో ఒలింపిక్స్‌కు సమానంగా భావించే టోర్నీ. ప్రపంచ వ్యాప్తంగా 187 దేశాల నుంచి.. 1700 మందికి పైగా తలపడతారు. అలాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో 2014కి ముందు వరకూ మనకు పతకమే లేదు. కానీ అదంతా గతం. ఇప్పుడు దేశంలో 64 గళ్ల ఆట స్థాయి మారింది.. ఆదరణ పెరిగింది.. విజయాలు దక్కుతున్నాయి. ఒలింపియాడ్‌లో ఒకే సారి రెండు కాంస్యాలు రావడమే అందుకు నిదర్శనం. దిగ్గజ ఆటగాళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. టీనేజర్లు చిచ్చర పిడుగుల్లా దూసుకెళ్తున్నారు. ఇక ప్రపంచ చెస్‌లో మన భవిష్యత్‌ గొప్పగా ఉండబోతోందన్న సంకేతాలిస్తున్నారు.

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి ఆతిథ్యమిచ్చిన చెస్‌ ఒలింపియాడ్‌ ముగిసింది. ఓపెన్‌, మహిళల విభాగాల్లో మన జట్లకు కాంస్యాలు దక్కాయి. 187 దేశాల నుంచి ఈ రెండు విభాగాల్లో కలిపి దాదాపు 350 జట్లు బరిలో దిగాయి. తీవ్ర పోటీని తట్టుకుని.. అగ్రశ్రేణి జట్లను వెనక్కినెట్టి పతకాలు సాధించడమంటే చిన్న విషయం కాదు. పైగా సొంతగడ్డపై అనుకూలత ఉండేందుకు ఇది మైదానంలో ఆడే ఆట కాదు. వాతావరణ పరిస్థితులూ ఎలాంటి ప్రభావం చూపవు. పైగా స్వదేశంలో ఆడుతున్నామనే ఒత్తిడీ ఉంటుంది. 64 గళ్లపై ఎత్తులు వేయడం.. వ్యూహాలు రచించడం.. ప్రత్యర్థిని చదవడం.. ఇలా ప్లేయర్లకు అసలైన సవాలు ఎదురయ్యేది బోర్డు ముందే. కాబట్టి ఈ పోటీల్లో భారత ప్రదర్శన గొప్పదే. బోర్డుపై ప్రత్యక్షంగా జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లను చూసుకుంటే ఓపెన్‌లో ఇది భారత్‌కు రెండో కాంస్యం. 2014లో తొలి పతకం దక్కింది. ఇక 1978లో ఒలింపియాడ్‌లో మహిళల విభాగంలో అడుగుపెట్టిన భారత్‌.. ఇప్పుడే మొదటి పతకం అందుకుంది.

మరో స్థాయికి..: 2000లో మొట్టమొదటి సారి దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంతో దేశంలో చదరంగ విప్లవం మొదలైందని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఈ ఆటపై జనాల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఎత్తులు వేయడం వైపు యువత మొగ్గు చూపింది. కానీ ఒక్కసారిగా ఎలాంటి మార్పు రాలేదు. అంతర్జాతీయ టోర్నీల్లో భారత ప్రాతినిథ్యం మెల్లమెల్లగా పెరిగింది. 2014 చెస్‌ ఒలింపియాడ్‌లో దేశానికి కాంస్యం దక్కడంతో మరోసారి ఆట ఊపందుకుంది. మాజీ ఆటగాళ్లు కోచ్‌లుగా మారడం, అకాడమీలు పెరగడంతో ఆటగాళ్లు క్రమంగా పెరిగారు. కరోనా కారణంగా 2020, 2021లో చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలు ఆన్‌లైన్‌ వేదికగా జరిగాయి. వీటిని ఫిడె ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లుగానే పరిగణిస్తున్నారు. 2020లో రష్యాతో కలిసి భారత్‌ విజేతగా నిలవడం సంచలనంగా మారింది. ఆ విజయం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. ఇక గతేడాది కాంస్యంతో జట్టు దూకుడు ప్రదర్శించింది. ఇప్పుడు రెండు కాంస్యాల ప్రదర్శనతో భారత చెస్‌ మరోస్థాయికి చేరుతుందనడంలో సందేహం లేదు.

ఇక మనదే..: భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృతోత్సవాలు వేళ.. దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య కూడా 75 ఉండడం విశేషం. 1988లో ఆనంద్‌ మొట్టమొదటి గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)గా మారినప్పటి నుంచి.. ఇటీవల చెన్నై కుర్రాడు ప్రణవ్‌ జీఎంగా ఎదగడం వరకూ దేశం ఆటలో ఎంతో ముందుకు వెళ్లింది. 2007లో 20గా ఉన్న గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య ఇప్పుడు మూడింతలు దాటింది. ప్రస్తుతం 2700 ఎలో రేటింగ్‌ క్లబ్‌లో దేశం నుంచి ఆనంద్‌ (2756), అర్జున్‌ (2754), హరికృష్ణ (2716), విదిత్‌ గుజరాతి (2710), గుకేశ్‌ (2725) ఉన్నారు. అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్న దేశంగా భారత్‌.. యుఎస్‌ఏ (6), రష్యా (10), చైనా (5) లాంటి దేశాల సరసన చేరింది. దేశంలో చదరంగానికి ఆదరణ భారీగా పెరిగింది. ఒలింపియాడ్‌లో ఒక్కో విభాగంలో భారత్‌ ఏకంగా మూడు జట్లను బరిలో దింపిందంటే మన క్రీడాకారుల ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మారుమూల పల్లెటూరు.. దేశ  రాజధాని లాంటి తేడాల్లేకుండా చెస్‌ విస్తరిస్తోంది. 64 గళ్ల బోర్డు.. 32 పావులు.. ఇద్దరు ప్రత్యర్థులు ఉంటే చాలు.. ఎక్కడైనా,  ఎప్పుడైనా ఆడుకోవచ్చు. దేశంలో దాదాపు 50 వేల మంది  ఆటగాళ్లు అధికారికంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీసం పది లక్షల మంది దేశవ్యాప్తంగా స్థానిక టోర్నీల్లో పోటీపడుతున్నారు. అఖిల భారత చెస్‌ సమాఖ్య ప్రతి ఏడాది అండర్‌-7 నుంచి మొదలెట్టి వివిధ స్థాయిల్లో కలిపి మొత్తం 20 జాతీయ ఛాంపియన్‌షిప్స్‌ నిర్వహిస్తోంది. మరోవైపు చెస్‌ లీగ్‌ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో భారత్‌దే ఆధిపత్యం అనేందుకు ఇవన్నీ సంకేతాలుగా కనిపిస్తున్నాయి.


పతకం గెలవడం చారిత్రకమే. కానీ సామర్థ్యం మేరకు ప్రదర్శన చేయలేకపోయాం. భారత్‌లో చదరంగం ఆడే అమ్మాయిలు కొంతమంది మాత్రమే ఉన్నారు. మరింత మంది మహిళలు ప్రొఫెషనల్‌ ఆటలో సాగేలా ఈ పతకం స్ఫూర్తినిస్తుందనే నమ్మకంతో ఉన్నా. అదే మా కాంస్య పతకానికి కావాల్సిన ఘన వారసత్వం. ఇంతకంటే మెరుగైన ఫలితాలు భవిష్యత్‌లో రావాలి.

- కోనేరు హంపి


యువ జోరు..

న్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌ల్లో భారత పతకాలు గాలివాటం కాదని ఇప్పుడు మన ప్లేయర్లు ఘనంగా చాటారు. 2018 తర్వాత బోర్డుపై ప్రత్యక్షంగా ఒలింపియాడ్‌ జరిగింది ఇప్పుడే. ఇందులో హంపి, హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణితో కూడిన భారత మహిళల-1 జట్టు 10 రౌండ్లు ముగిసే సరికి అగ్రస్థానంతో ఛాంపియన్‌గా నిలిచేలా కనిపించింది. కానీ చివరిదైన 11 రౌండ్లో అమెరికా చేతిలో ఓటమితో మూడో స్థానంతో ముగించింది. నిండు గర్భంతోనూ హారిక పోటీల్లో దిగడమే కాకుండా ఉత్తమ ప్రదర్శన చేయడం ఆమె అంకితభావానికి నిదర్శనం. ఇక పురుషుల్లో అధిబన్‌ మినహా టీనేజర్లు గుకేశ్‌, ప్రజ్ఞానంద, నిహాల్‌ సరీన్‌, రౌనక్‌ సాధ్వానితో కూడిన రెండో జట్టు గొప్పగా రాణించింది. బోర్డుపై ప్రత్యక్షంగా జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో తొలిసారి ఆడిన ఈ నలుగురు అంచనాలను మించి రాణించారు. ఛాంపియన్‌గా నిలిచిన ఉజ్బెకిస్థాన్‌ను ముందే ఓడించిన ఈ కుర్రాళ్లు.. చివరి రౌండ్లో జర్మనీపై గెలిచారు. ముఖ్యంగా 16 ఏళ్ల గుకేశ్‌ అదరగొట్టాడు. 11 మ్యాచ్‌ల్లో 8 గెలిచి, రెండు డ్రా చేసుకున్న అతను.. ఒక్కదాంట్లోనే ఓడాడు. ఇక ప్రపంచ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన మూడో భారత ఆటగాడిగా నిలిచిన ప్రజ్ఞానంద.. ప్రత్యర్థిని చిక్కుల్లో పడేశాడు. గుకేశ్‌, నిహాల్‌ వ్యక్తిగత స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. పురుషుల-1 జట్టులో ఆడిన 18 ఏళ్ల తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి సత్తాచాటాడు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అతను వ్యక్తిగత రజతం నెగ్గాడు. ప్రజ్ఞానంద, వైశాలి, తనియా, దివ్య ఒక్కో కాంస్యం దక్కించుకున్నారు. మహిళల-3 జట్టులో ఆడిన ఏపీ అమ్మాయిలు సాహితి వర్షిణి, బొడ్డా ప్రత్యూష ఆకట్టుకున్నారు.


చెస్‌ జట్లకు ప్రధాని ప్రశంస

దిల్లీ: 44వ చెస్‌ ఒలింపియాడ్‌ను విజయవంతంగా నిర్వహించిన తమిళనాడు ప్రభుత్వాన్ని, ఇందులో పతకాలు గెలిచిన భారత జట్లను ప్రధాని మోదీ బుధవారం అభినందించారు. ‘‘44వ చెస్‌ ఒలింపియాడ్‌కు తమిళనాడు ప్రజలు, అక్కడి ప్రభుత్వం గొప్పగా ఆతిథ్యమిచ్చింది. ప్రపంచానికి స్వాగతం పలికి మన సంస్కృతి, ఆతిథ్యాన్ని చాటిచెప్పినందుకు అభినందిస్తున్నా. ఈ ఒలింపియాడ్‌లో భారత్‌ ప్రోత్సాహకరమైన ప్రదర్శన చేసింది. కాంస్యాలు నెగ్గిన భారత పురుషుల-2, మహిళల-1 జట్లకు శుభాకాంక్షలు. ఇది భారత్‌లో చెస్‌ భవిష్యత్‌కు మంచి సూచన. అసాధారణ ఆటతీరుతో వ్యక్తిగత పతకాలు సాధించిన ప్లేయర్లకూ అభినందనలు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని