నాన్నను చూసి.. కుస్తీ నేర్చి
కుస్తీ అంటే అతడికి ఇష్టం. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలని కలగన్నాడు. సాధించలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందులు అతడి కలలకు బ్రేకులేశాయి. కానీ.. తన కొడుక్కి మాత్రం కాదు. నాన్న వదిలేసిన ఆటలో ఇప్పుడా అబ్బాయి గొప్పగా రాణిస్తున్నాడు. ఇటీవల క్యాడెట్ (అండర్-17) ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో
రెజ్లింగ్లో సత్తాచాటుతున్న నిఖిల్
ఈనాడు - హైదరాబాద్
కుస్తీ అంటే అతడికి ఇష్టం. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలని కలగన్నాడు. సాధించలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందులు అతడి కలలకు బ్రేకులేశాయి. కానీ.. తన కొడుక్కి మాత్రం కాదు. నాన్న వదిలేసిన ఆటలో ఇప్పుడా అబ్బాయి గొప్పగా రాణిస్తున్నాడు. ఇటీవల క్యాడెట్ (అండర్-17) ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యంతో సత్తా చాటాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ ఘనత సాధించిన తొలి రెజ్లర్గా చరిత్ర సృష్టించాడు. కుస్తీ కుర్రాడే.. 17 ఏళ్ల నిఖిల్ యాదవ్. పతకాల పట్టులో దూసుకెళ్తున్న యువ సంచలనం.
పదేళ్ల వయసులో కుస్తీ మొదలెట్టిన నిఖిల్.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తొలి పతకం సాధించే స్థాయికి ఎదిగాడు. భాగ్యనగరంలోని పురానాపూల్ పక్కన గొల్లకిడికి నుంచి వచ్చిన అతను రెజ్లింగ్లో గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఆటలో ప్రతిభతో అత్యుత్తమ శిక్షణ పొందే అవకాశం దక్కించుకుని పతకాల వేటలో సాగుతున్నాడు. రాష్ట్ర స్థాయి రెజ్లరైన నాన్న సురేశ్ను చూసి అతను ఈ ఆటలోకి వచ్చాడు. చిన్నతనంలో నిఖిల్ను అతడి తండ్రి రెజ్లింగ్ సాధనకు వెళ్తూ వెంటతీసుకెళ్లేవాడు. అలా కుస్తీపై అతనికి ఇష్టం కలిగింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ తండ్రి మధ్యలోనే ఆగిపోయినా.. ఆ తనయుడు మాత్రం ఆటలో మరో స్థాయికి చేరాడు. తన కలను కొడుకు నిజం చేస్తుండడంతో ఆ తండ్రి గర్వంతో పొంగిపోతున్నాడు.
ఇబ్బందులున్నా..: నిఖిల్ తండ్రి పాల వ్యాపారం చేస్తాడు. ఇంటింటికీ తిరిగి పాలు పోస్తాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కానీ ఎంత కష్టమైనా భరిస్తూ తన కొడుకును ఛాంపియన్ చేయాలనే లక్ష్యంతో అతను సాగుతున్నాడు. మరోవైపు ఆటలో మంచి నైపుణ్యాలతో నిఖిల్ దూసుకెళ్తున్నాడు. మొదట జై భవాని వ్యాయామశాలలో అతను శిక్షణ పొందాడు. అర్జున్, అభిమన్యు దగ్గర శిక్షణతో రాష్ట్ర ఛాంపియన్గా ఎదిగాడు. సీనియర్ రెజ్లర్ దేవి సింగ్ కూడా నిఖిల్కు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. జాతీయ పాఠశాల క్రీడల్లో అండర్-14 విభాగంలో పసిడి సాధించడంతో అతని ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత అండర్-17లోనూ ఛాంపియన్గా నిలిచాడు. సబ్ జూనియర్ జాతీయ ఛాంపియన్షిప్స్లో ఒక్కో రజతం, కాంస్యం గెలిచాడు. అండర్-20 జూనియర్ పోటీల్లో కంచు పతకం సాధించాడు. ‘‘కుస్తీ అంటే చాలా మంది భయపడతారు. కానీ చిన్నప్పటి నుంచి నాకు రెజ్లింగ్ అంటే ఇష్టం. నాన్నను చూసి స్ఫూర్తి పొందా. ప్రత్యర్థులను ఓడించడం సరదాగా ఉండేది. క్రమంగా అదే కెరీర్గా మారింది’’ అని నిఖిల్ చెప్పాడు.
అత్యుత్తమ శిక్షణ..: దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ను ఆరాధించే నిఖిల్కు అతని సమక్షంలోనే శిక్షణ తీసుకునే అవకాశం దక్కింది. దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో అయిదేళ్ల పాటు నిఖిల్ సాధన చేశాడు. అప్పుడు సుశీల్ కుమార్ మార్గనిర్దేశనంలో అతను ఆటపై మరింత పట్టు సాధించాడు. టెక్నిక్ను మెరుగుపర్చుకున్నాడు. సబ్ జూనియర్, జూనియర్ స్థాయిల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శనతో బళ్లారిలోని జేఎస్డబ్ల్యూ ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్లో శిక్షణ పొందే అవకాశం కొట్టేశాడు. రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్, స్విమ్మింగ్లో యువ ప్రతిభావంతులకు ఇక్కడ వసతితో పాటు అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నారు. ఏడాది నుంచి ఇక్కడ శిక్షణ పొందడంతో నిఖిల్ ఆట మరింత మెరుగైంది. ఈ ఏడాది ఖేలో ఇండియా క్రీడల్లో కాంస్యంతో ఆ ఘనత సాధించిన తొలి తెలంగాణ రెజ్లర్గా అతను రికార్డు నెలకొల్పాడు. ‘‘సుశీల్ కుమార్ను ఆరాధిస్తూ పెరిగా. అలాంటిది అతని దగ్గర శిక్షణ పొందే అవకాశం రావడంతో ఆనందమేసింది. ఛత్రసాల్ స్టేడియంలో అతణ్ని చూసిన క్షణాన్ని మర్చిపోలేను. నాకెన్నో విలువైన సూచనలిచ్చాడు’’ అని అతను తెలిపాడు.
గాయం బాధిస్తున్నా..: ఖేలో ఇండియా క్రీడల సందర్భంగా నిఖిల్ ఎడమ చెవికి గాయమైంది. చెవి పై భాగంలో రక్తం గడ్డకట్టింది. ప్రపంచ అండర్-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్కు సన్నద్ధం కావాల్సి ఉండడంతో ఆ గాయానికి చికిత్స తీసుకోలేకపోయాడు. ఓ వైపు నొప్పి బాధిస్తున్నా అలాగే సాధన కొనసాగించాడు. ఇటలీలో జరిగిన ఈ ప్రపంచ ఛాంపియన్షిప్స్ సెమీస్లో మళ్లీ చెవికే గాయమైంది. తీవ్ర నొప్పితో విలవిలలాడిన అతను.. పోరాడి ఓడిపోయాడు. ఆ తర్వాత కాంస్య పతక పోరులో గెలిచాడు. అనంతరం చెవికి అక్కడే చికిత్స చేసి రక్తం తీసేశారు. ఆట కారణంగా కళాశాలకు వెళ్లడం కుదరదని ఓపెన్లో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఇప్పుడిక అండర్-20 జూనియర్ ఆసియా ఛాంపియన్షిప్స్, ప్రపంచ ఛాంపియన్షిప్స్ కోసం సన్నద్ధమవాల్సి ఉందని అతను చెప్పాడు. ఒలింపిక్స్లో పతకం సాధించడమే తన లక్ష్యమంటున్నాడు. ‘‘ప్రపంచ అండర్-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పతకం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిథ్యం వహించడంతో పాటు కాంస్యం నెగ్గడం గొప్పగా అనిపిస్తోంది. సెమీస్లో ప్రత్యర్థితో పోరు కఠినంగా సాగింది. అందులో ఓటమితో కంచు పతక పోరులో ఎలాగైనా గెలవాలనే ధ్యేయంతో బరిలో దిగా. రాష్ట్రం ఏర్పాడ్డాక ఈ పోటీల్లో పతకం సాధించిన తొలి రెజ్లర్గా నిలవడం గర్వంగా ఉంది. గతంలో దేవి సింగ్ కూడా క్యాడెట్ ఛాంపియన్షిప్స్లో కాంస్యం సాధించాడు. నా ధ్యాస మొత్తం ఆట మీదే. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. ఎవరైనా అండగా నిలిస్తే మరింత మెరుగైన ప్రదర్శన చేస్తా. ఏది ఏమైనా ఒలింపిక్స్లో పతకం సాధించాలనే లక్ష్యం దిశగా సాగుతా’’ అని నిఖిల్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ