FIFA : భారత ఫుట్‌బాల్‌పై ఫిఫా బాంబు

ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో సంతోషంలో మునిగిపోయిన భారత క్రీడా రంగానికి ఎదురు దెబ్బ. భారత ఫుట్‌బాల్‌కు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) రెడ్‌ కార్డు చూపించింది.

Updated : 17 Aug 2022 09:28 IST

ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధం
అండర్‌-17 అమ్మాయిల ప్రపంచకప్‌ ఆతిథ్యానికి దూరం

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల వేళ భారత ఫుట్‌బాల్‌పై పెద్ద బాంబు పడింది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యను ఫిఫా నిషేధించింది. ఇది దేశ ఫుట్‌బాల్‌కు తీరని మచ్చగా మిగిలిపోనుంది. ఓ వైపు గత స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ఆటలో ఘన కీర్తిని సాధించాలనే ప్రతిజ్ఞలు హోరెత్తుతున్న వేళ.. ఈ పరిణామం దేశ క్రీడా రంగానికి పెద్ద షాక్‌!

దిల్లీ: ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో సంతోషంలో మునిగిపోయిన భారత క్రీడా రంగానికి ఎదురు దెబ్బ. భారత ఫుట్‌బాల్‌కు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) రెడ్‌ కార్డు చూపించింది. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్‌ 11 నుంచి 30 వరకు స్వదేశంలో జరగాల్సిన అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌ను ప్రస్తుతానికి భారత్‌లో నిర్వహించడం లేదని వెల్లడించింది. 85 ఏళ్ల చరిత్రలో ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధం పడడం ఇదే తొలిసారి. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయట వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. క్రీడా సంఘాల్లో పారదర్శకత రావాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన ఒక్క రోజులోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ‘‘బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో తక్షణమే ఏఐఎఫ్‌ఎఫ్‌ను నిషేధించాలని ఫిఫా మండలి బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఫిఫా చట్టాలను అది ఉల్లంఘించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అధికారాలను పొందేలా పాలకుల కమిటీ (సీఓఏ)ని ఏర్పాటు చేయాలనే ఉత్తర్వును రద్దు చేస్తే అప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తివేస్తాం. సమాఖ్య రోజువారీ కార్యకలాపాలపై తిరిగి ఏఐఎఫ్‌ఎఫ్‌ పూర్తి నియంత్రణ సాధించాల్సి ఉంటుంది. ఈ నిషేధం కారణంగా అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌ను ప్రస్తుతానికి షెడ్యూల్‌ ప్రకారం ఈ దేశంలో నిర్వహించడం లేదు. ఈ టోర్నీ నిర్వహణ దిశగా అవసరమైన చర్యలను ఫిఫా   పరిశీలిస్తుంది. ఈ విషయాన్ని అవసరమైనప్పుడు మండలి బ్యూరో దృష్టికి తీసుకెళ్తుంది. ఈ నిషేధం ప్రకారం ఏఐఎఫ్‌ఎఫ్‌, దీని ప్రతినిధులు, సభ్యులు ఫిఫా కార్యక్రమాల నుంచి కానీ లేదా కోర్సులు, శిక్షణ నుంచి ఎలాంటి లబ్ది పొందరు. భారత క్రీడా మంత్రిత్వ శాఖతో ఈ విషయంపై ఫిఫా నిరంతరం చర్చలు జరుపుతోంది. ఈ విషయంలో ఇప్పటికీ సానుకూల ఫలితం రాబట్టవచ్చనే నమ్మకంతో  ఉన్నాం’’ అని ఫిఫా తెలిపింది.

అసలేం జరిగింది?
గత కొన్ని రోజులుగా నిషేధం తప్పదంటూ ఏఐఎఫ్‌ఎఫ్‌ను హెచ్చరిస్తూ వచ్చిన ఫిఫా చివరకు అన్నంత పని చేసింది. క్రీడా మంత్రిత్వ శాఖలోని సీనియర్‌ ప్రతినిధులు, సీఓఏ సభ్యులతో ఫిఫా నలుగురు ప్రతినిధుల బృందం శుక్రవారం, సోమవారం చర్చలు జరిపింది. ఆ తర్వాత నిషేధాన్ని ప్రకటించింది. అసలు ఫిఫా ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక చాలా తంతు నడిచింది.  2020 డిసెంబర్‌లో ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడిగా మూడో సారి ప్రఫుల్‌ పటేల్‌ పదవీ కాలం ముగిసింది. కానీ అతను ఎన్నికలు నిర్వహించకుండా 2017 నుంచి సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును ఉపయోగించుకుంటూ పదవిలో ఉన్నాడు. నియమావళి ప్రకారం 12 ఏళ్లకు మించి ఎవరూ ఆ పదవిలో కొనసాగకూడదు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం కొత్త నియమావళి అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామన్నాడు. కానీ ఈ ఏడాది మే 18న అతణ్ని పదవి నుంచి తప్పించడంతో పాటు ఎగ్జిక్యూటివ్‌ కమిటీని కోర్టు రద్దు చేసింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికల నిర్వహణ, నూతన నియమావళిని రూపొందించడం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అనిల్‌ రమేశ్‌ దవె సారథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ, భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ భాస్కర్‌ గంగూలీతో కూడిన సీఓఏను నియమించింది. సీఓఏతో చర్చలు జరిపిన ఫిఫా- ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య బృందం జులై 31లోపు కొత్త నియమావళికి ఆమోదం పొందాలని, సెప్టెంబర్‌ 15లోపు ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించింది. నియమావళి తుది ముసాయిదాను ఫిఫాకు పంపిన సీఓఏ.. ఆమోదం కోసం కోర్టుకూ సమర్పించింది. కానీ సీఓఏ రూపొందించిన ఈ నియమావళిపై ఏఐఎఫ్‌ఎఫ్‌ రాష్ట్ర సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అందులో కొన్ని విషయాలు అర్థరహితంగా ఉన్నాయని అవి ఫిఫాకు లేఖ రాశాయి. ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సీఓఏ సూచించినట్లుగా కో ఆప్షన్‌ సభ్యులుగా మాజీ ఆటగాళ్ల శాతం 50 కాకుండా 25గా ఉండాలని ఫిఫా ప్రతిపాదించింది. కానీ దీన్ని పట్టించుకోకుండా సీఓఏ ఎన్నికల ప్రక్రియ మొదలెట్టింది. ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించాలనుకుంది. అందుకు వీలుగా 36 మంది మాజీ ప్లేయర్లతో సహా ఓటర్ల జాబితాను తయారు చేసింది. రిటర్నింగ్‌ అధికారిని కూడా నియమించింది. బుధవారం నుంచి శుక్రవారం వరకూ నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. వ్యక్తిగత హోదాలో మాజీ ఆటగాళ్లను ఓటర్ల జాబితాను చేర్చడంపై ఫిఫా అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరకు సీఓఏ తీరుపై అసహనంతో నిషేధం విధించింది. చర్చలు ఇంకా పూర్తి కాకుండానే ఫిఫా నిషేధం విధించడంపై సీఓఏ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఫిఫాకు ఆమోదయోగ్యంగానే ఎన్నికలు నిర్వహించాలనుకున్నామని ఆ కమిటీ తెలిపింది. భారత ఫుట్‌బాల్‌ను తిరిగి సరైన దారిలోకి తీసుకొద్దామనే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఫిఫా ఈ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని సీఓఏ ఛైర్మన్‌ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అనిల్‌ దవె పేర్కొన్నారు.

ఇప్పుడు ఎలా?
ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధంతో భారత ఆటగాళ్లు, క్లబ్బులు.. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ నిషేధాన్ని వీలైనంత త్వరగా తొలగించుకునేందుకు ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్రయత్నాలు మొదలెట్టింది. మరోవైపు ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికల ప్రక్రియ, కొత్త నియమావళి విషయంలో దాదాపు అన్ని ఫిఫా డిమాండ్లకు సీఓఏ ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ నిషేధం స్వల్ప కాలమే అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘ఈ నిషేధం స్వల్ప కాలమే అనే భావన అధికార వర్గాల్లో ఉంది. ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికలు ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 28న జరగకపోయినా సెప్టెంబర్‌ 15లోపు మాత్రం పూర్తవుతాయి. ఫిఫా డిమాండ్లను సీఓఏ అంగీకరించింది. ఈ రకంగా చూసుకుంటే అండర్‌-17 ప్రపంచకప్‌ కూడా స్వదేశంలోనే జరిగే అవకాశముంది’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఓటర్ల జాబితాలో ఇప్పుడు రాష్ట్ర సంఘాల నుంచి ప్రతినిధులకు ప్రాతినిథ్యం ఇవ్వడంతో పాటు మాజీ ప్లేయర్ల సంఖ్యను అయిదుకే పరిమితం చేయనున్నట్లు తెలిసింది. ఆ ప్లేయర్లతో సహా ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో 22 మంది సభ్యులు ఉండే అవకాశముంది. ఈ పరిణామం నేపథ్యంలో వెంటనే ఏఐఎఫ్‌ఎఫ్‌కి సంబంధించిన కేసును విచారించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది. ‘‘ఏఐఎఫ్‌ఎఫ్‌లో సీఓఏ అధికార జోక్యాన్ని ఫిఫా వ్యతిరేకిస్తోంది. గతంలో లాగే ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మాత్రమే అధికారాలు కొనసాగించాలని అది కోరుకుంటోంది. అదే జరిగితే నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉంది. ఈ సమస్యకు వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎలాగైనా అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌ను స్వదేశంలోనే జరిగేలా చూడాలనుకుంటోంది’’ అని క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నాడు.

వీటిపై ప్రభావం..
ఈ నిషేధం కొనసాగితే వచ్చే నెల 24న వియత్నాం, 27న సింగపూర్‌తో భారత పురుషుల జట్టు ఆడాల్సిన స్నేహపూర్వక మ్యాచ్‌లు రద్దవుతాయి. భారత మహిళల లీగ్‌ ఛాంపియన్‌ గోకులం కేరళ జట్టు ఏఎఫ్‌సీ అమ్మాయిల క్లబ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈ నెల 23న ఉజ్బెకిస్థాన్‌ క్లబ్‌ సొగ్డియానా-డబ్లూతో తలపడాల్సింది. ఇప్పుడీ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఏఎఫ్‌సీ కప్‌ అంతర్‌ జోనల్‌ టోర్నీలో సెప్టెంబర్‌ 7న ఏటీకే మోహన్‌ బగాన్‌ జట్టు సెమీస్‌ ఆడాల్సింది. కానీ ఇప్పుడు ఏఎఫ్‌సీ వెబ్‌సైట్లో ఆ జట్టు పేరే కనిపించడం లేదు. భారత యువ జట్టు వచ్చే నెల 14న మొదలయ్యే ఏఎఫ్‌సీ అండర్‌-20 క్వాలిఫయర్స్‌లో పోటీపడాల్సి ఉంది. నిధుల పరంగానూ ఏఐఎఫ్‌ఎఫ్‌పై దెబ్బ పడుతుంది. ఈ నిషేధం కారణంగా దాదాపు రూ.3.96 కోట్ల నిధులు కోల్పోవాల్సి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని