India vs Srilanka: కథ ముగిసె..!

చూస్తే.. జట్టు మామూలుగా లేదు. ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో పొట్టి ఫార్మాట్లో ఆరితేరినవారే. అందుకే రాబోతున్న టీ20 ప్రపంచకప్‌లో గట్టి పోటీదారుగా భావిస్తున్న టీమ్‌ఇండియా.. ఆసియాకప్‌లోనైతే తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. బుమ్రా లేకున్నా.. జడేజా అర్ధంతరంగా నిష్క్రమించినా ఏమాత్రం అంచనాలు తగ్గలేదు. జట్టు బలంపై అంత నమ్మకం. కానీ టీమ్‌ఇండియాకు షాక్‌! ఆ జట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకూ షాక్‌!

Updated : 07 Sep 2022 06:44 IST

శ్రీలంక చేతిలోనూ పరాజయం

భారత్‌ ఫైనల్‌ ఆశలు గల్లంతు!

దుబాయ్‌

చూస్తే.. జట్టు మామూలుగా లేదు. ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో పొట్టి ఫార్మాట్లో ఆరితేరినవారే. అందుకే రాబోతున్న టీ20 ప్రపంచకప్‌లో గట్టి పోటీదారుగా భావిస్తున్న టీమ్‌ఇండియా.. ఆసియాకప్‌లోనైతే తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. బుమ్రా లేకున్నా.. జడేజా అర్ధంతరంగా నిష్క్రమించినా ఏమాత్రం అంచనాలు తగ్గలేదు. జట్టు బలంపై అంత నమ్మకం. కానీ టీమ్‌ఇండియాకు షాక్‌! ఆ జట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకూ షాక్‌!

ఏమాత్రం ఊహించని విధంగా, పేలవ ప్రదర్శనతో సూపర్‌-4లో వరుసగా రెండో పరాజయం చవిచూసిన రోహిత్‌సేన ఫైనల్‌కే దూరమయ్యే స్థితిలో నిలిచింది. బ్యాటింగ్‌లో చెలరేగలేకపోయిన భారత్‌.. బంతితోనూ విఫలమై శ్రీలంక చేతిలో కంగుతింది. టీమ్‌ఇండియా బౌలింగ్‌లో ఆలస్యంగా పుంజుకుని విజయం కోసం ప్రయత్నించినా.. ఉత్కంఠగా ముగిసిన పోరులో ప్రత్యర్థి ఆధిపత్యం స్పష్టం. రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న శ్రీలంక ఫైనల్లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడాల్సి   ఉన్న భారత్‌ సాంకేతికంగా మాత్రం ఫైనల్‌ రేసులో ఉంది. కథ ముగిసినట్లే! ఏ చిన్న అవకాశమైనా ఉండాలంటే పాకిస్థాన్‌ జట్టు.. అఫ్గాన్‌, లంక చేతిలో ఓడిపోవాలి.

సియాకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌ రేసుకు దూరమైనట్లే. మంగళవారం ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. రోహిత్‌ శర్మ (72; 41 బంతుల్లో 5×4, 4×6) ఒక్కడు మెర]వడంతో మొదట భారత్‌ 8 వికెట్లకు 173 పరుగులు సాధించింది. కుశాల్‌ మెండిస్‌ (57; 37 బంతుల్లో 4×4, 3×6), నిశాంక (52; 37 బంతుల్లో 4×4, 2×6), శనక (33 నాటౌట్‌; 18 బంతుల్లో 4×4, 1×6), భానుక రాజపక్స (25 నాటౌట్‌; 17 బంతుల్లో 2×6) చెలరేగడంతో లక్ష్యాన్ని శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చాహల్‌ (3/34) బంతితో రాణించాడు. భారత్‌ తన తొలి సూపర్‌-4 మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

లంక ఓపెనర్ల జోరు: అటు నిశాంక.. ఇటు కుశాల్‌ మెండిస్‌! కొడుతూనే పోయారు. ఎడా పెడా ఫోర్లు, సిక్స్‌లు బాదేశారు. ఛేదనలో టీమ్‌ఇండియా బౌలర్లను ఏమాత్రం లెక్క చేయలేదు. బౌలర్లంతా తేలిపోయారు. ఆరంభంలో భువి మినహా ఎవరూ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. అర్ష్‌దీప్‌ ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో 18 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్‌, చాహల్‌, అశ్విన్‌.. ఇలా ఎవ్వరొచ్చినా లంక ఓపెనర్లపై ప్రభావం చూపలేకపోయారు. ప్రత్యర్థి వడవడిగా లక్ష్యం దిశగా సాగింది. 11 ఓవర్లలో 97/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ ఆశలు అడుగంటుతున్న దశలో చాహల్‌.. ఒకే ఓవర్లో (12వ) నిశాంక, అసలంకను ఔట్‌ చేసి భారత్‌లో ఉత్సాహం నింపాడు. ఆ తర్వాత గుణతికలను అశ్విన్‌ ఔట్‌ చేయడం, తన తర్వాతి ఓవర్లో కుశాల్‌ మెండిస్‌ను చాహల్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ పోటీలోకి వచ్చేసింది. 13 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టడంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. చివరి అయిదు ఓవర్లలో లంక 54 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. కానీ భారత్‌ ఆధిపత్యం ఆ కొన్ని ఓవర్లే. ఆ తర్వాత మరో వికెట్‌ దక్కలేదు. ఒత్తిడిలో ధాటిగా బ్యాటింగ్‌ చేసిన కెప్టెన్‌ శనక, భానుక రాజపక్స టీమ్‌ఇండియా    ఆశలపై నీళ్లు చల్లారు. అభేద్యమైన అయిదో వికెట్‌కు 64 పరుగులు జోడించి తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు.

భువి మళ్లీ..: శ్రీలంక స్పష్టంగా పైచేయిలో ఉన్నా.. అంత తేలిగ్గానైతే లక్ష్యాన్ని అందుకోలేదు. కాస్త ఉత్కంఠ తప్పలేదు. భారత్‌ కూడా మంచి అవకాశాన్నే సృష్టించుకుంది. కానీ పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో లాగే భువి మరోసారి 19వ ఓవర్లో బౌలింగ్‌ చేయడం ప్రతికూలంగా మారింది. చివరి రెండు ఓవర్లలో లంకకు 21 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్లో భువి 14 పరుగులిచ్చాడు. ఇందులో రెండు వైడ్లు కూడా ఉన్నాయి. చివరి ఓవర్లో అర్ష్‌దీప్‌ గొప్పగానే బౌలింగ్‌ చేసినా ఫలితం లేకపోయింది. లంక ఏడు పరుగులు చేయాల్సివుండగా.. బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం స్వేచ్చనివ్వని అర్ష్‌దీప్‌ తొలి నాలుగు బంతుల్లో అయిదే పరుగులే ఇచ్చాడు. ఉత్కంఠ తీవ్రమైంది. ఓవర్లో అయిదో బంతిని శనక తాక లేకపోయాడు. అది నేరుగా వెళ్లి వికెట్‌కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. అయినా బ్యాట్స్‌మెన్‌ పరుగందుకున్నారు. బ్యాట్స్‌మన్‌ ఎంతో దూరంగా ఉన్నా, మూడు స్టంపులు స్పష్టంగా కనిపిస్తున్నా పంత్‌ గురి తప్పాడు. బంతి అర్ష్‌దీప్‌ దగ్గరకు వెళ్లింది. అతడికీ రనౌట్‌ చేసే అవకాశమున్నా.. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో వికెట్లను కొట్టలేకపోయాడు. ఫలితంగా బ్యాటర్లు రెండో పరుగు తీసి లక్ష్యాన్ని పూర్తి చేశారు.

రోహిత్‌ ధనాధన్‌: ఆరంభంలో సూపర్‌ బౌలింగ్‌తో శ్రీలంక బౌలర్లు ఇబ్బందులు సృష్టించినా, పరుగుల వేగానికి కళ్లెం వేసినా రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియాను నిలబెట్టాడు. కానీ నిలిచింది అతడొక్కడే. అతడిలోని దూకుడు మిగతా బ్యాట్స్‌మెన్‌లో లోపించడంతో జట్టు చేయాల్సినంత స్కోరు చేయలేకపోయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభం పేలవం. రాహుల్‌ (6) రెండో ఓవర్లోనే తీక్షణకు వికెట్ల ముందు దొరికిపోగా.. మదుశంక ఓ చక్కని బంతితో కోహ్లి (0)ని బౌల్డ్‌ చేశాడు. ఆ దశలో రోహిత్‌ నిలవకుంటే 13 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకున్న భారత్‌ మరింత చిక్కుల్లో పడేదే. లంక బౌలర్లు ఒత్తిడి తెస్తున్నా రోహిత్‌ దూకుడుగానే బ్యాటింగ్‌ చేశాడు. ప్రత్యర్థి మరీ పట్టుబిగించకుండా అడ్డుకున్నాడు. అసిత బంతిని సిక్స్‌కు హుక్‌ చేసిన రోహిత్‌.. తర్వాతి బంతినే పాయింట్‌, కవర్స్‌ మధ్య నుంచి బౌండరీ దాటించాడు. మోకాలిని వంచి తీక్షణ బంతిని స్క్వేర్‌ లెగ్‌ బౌండరీకి స్వీప్‌ చేశాడు. హసరంగ, కరుణరత్నె కట్టుదిట్టంగానే బౌలింగ్‌ చేశారు. 9 ఓవర్లకు భారత్‌ స్కోరు 65/2. అక్కడి నుంచి దూకుడు పెంచిన రోహిత్‌.. అసిత బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌తో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతడు రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ దంచడంతో 12వ ఓవర్లో హసరంగ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. సూర్యకుమార్‌ (34; 29 బంతుల్లో 1×4, 1×6) దూకుడుగా ఆడలేకపోయినా.. 12 ఓవర్లలో 109/2తో మెరుగ్గానే ఉన్న భారత్‌ అనుకున్నంత బలంగా ఇన్నింగ్స్‌ను ముగించలేకపోయింది. 13వ ఓవర్లో రోహిత్‌ నిష్క్రమణతో స్కోరు వేగానికి కళ్లెం పడ్డట్లయింది. ఆ తర్వాత మెరుపులు కరవయ్యాయి. 15వ ఓవర్లో సూర్య కూడా నిష్క్రమించాడు. హార్దిక్‌ పాండ్య (17; 13 బంతుల్లో 1×6), పంత్‌ (17; 13 బంతుల్లో 3×4) 19 బంతుల్లో 30 పరుగులు జోడించారు. వీళ్లిద్దరి వికెట్లు సహా చివరి నాలుగు ఓవర్లలో 4 వికెట్లు చేజార్చుకున్న భారత్‌.. 38 పరుగులు రాబట్టింది. హుడా (3) విఫలమయ్యాడు. అశ్విన్‌ (15 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ ఎల్బీ (బి) తీక్షణ 6; రోహిత్‌ శర్మ (సి) నిశాంక (బి) కరుణరత్నె 72; కోహ్లి (బి) మదుశంక 0; సూర్యకుమార్‌ (సి) తీక్షణ (బి) శనక 34; హార్దిక్‌ పాండ్య (సి) నిశాంక (బి) శనక 17; పంత్‌ (సి) నిశాంక (బి) మదుశంక 17; దీపక్‌ హుడా (బి) మదుశంక 3; అశ్విన్‌ నాటౌట్‌ 15; భువనేశ్వర్‌ (బి) కరుణరత్నె 0; అర్ష్‌దీప్‌ సింగ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173; వికెట్ల పతనం: 1-11, 2-13, 3-110, 4-119, 5-149, 6-157, 7-158, 8-164; బౌలింగ్‌: మదుశంక 4-0-24-3; తీక్షణ 4-0-29-1; కరుణరత్నె 4-0-27-2; అసిత 2-0-28-0; హసరంగ 4-0-39-0; శనక 2-0-26-2

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక (సి) రోహిత్‌ (బి) చాహల్‌ 52; కుశాల్‌ మెండిస్‌ ఎల్బీ (బి) చాహల్‌ 57; అసలంక (సి) సూర్యకుమార్‌ (బి) చాహల్‌ 0; గుణతిలక (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 1; భానుక రాజపక్స నాటౌట్‌ 25; శనక నాటౌట్‌ 33; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174; వికెట్ల పతనం: 1-97, 2-97, 3-110, 4-110; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-30-0; అర్ష్‌దీప్‌ సింగ్‌ 3.5-0-40-0; హార్దిక్‌ పాండ్య 4-0-35-0; చాహల్‌ 4-0-34-3; అశ్విన్‌ 4-0-32-1

ఆసియా కప్‌లో నేడు:  పాకిస్థాన్‌ × అఫ్గానిస్థాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని