పాక్‌తో పోరుకు సై

మహిళల ఆసియా కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శుక్రవారం టీ20 మ్యాచ్‌లో తలపడుతుంది.

Published : 07 Oct 2022 03:02 IST

జోరు మీద భారత అమ్మాయిలు  
మధ్యాహ్నం 1 నుంచి

సిల్‌హట్‌: మహిళల ఆసియా కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శుక్రవారం టీ20 మ్యాచ్‌లో తలపడుతుంది. టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌.. పాక్‌పై పెత్తనాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఎనిమిది మార్పులు చేసిన హర్మన్‌ప్రీత్‌ సేన ఈ పోరులో పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగనుంది. బ్యాటింగ్‌లో జెమీమా, స్మృతి మంధాన, కెప్టెన్‌ హర్మన్‌ ఫామ్‌ కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. టీనేజీ ఓపెనర్‌ షెఫాలీ ఈ మ్యాచ్‌లోనైనా ఫామ్‌ అందుకుంటుందేమో చూడాలి. బౌలర్లు సమష్టిగా రాణిస్తుండడం జట్టుకు లాభించే అంశం. మరోవైపు గురువారం పసికూన థాయ్‌లాండ్‌ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో పాక్‌ అనూహ్య ఓటమి చవిచూసింది. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆ జట్టు.. భారత్‌పై గెలుపు కోసం పోరాడేందుకు సిద్ధమైంది. కానీ టీ20ల్లో చూసుకుంటే దాయాది జట్టుపై టీమ్‌ఇండియాకు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ పొట్టి ఫార్మాట్లో ఈ జట్లు 12 సార్లు తలపడగా భారత్‌ పది మ్యాచ్‌ల్లో గెలిచింది. పాక్‌ రెండు విజయాలు అందుకుంది. గత అయిదు టీ20ల్లో పాక్‌పై భారత్‌ అలవోకగా నెగ్గింది. ఇప్పుడు కూడా మన జట్టే ఫేవరేట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని