t20 world cup 2022: అదిరే అదిరే..!

ఈ ఏడాదికి ముందు ఆరు టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి. వీటిల్లో అనూహ్య ఫలితాలు.. వర్షం ప్రభావం చూపిన మ్యాచ్‌లు.. తారుమారైన అంచనాలు.. ఫేవరెట్ల నిష్క్రమణ.. హోరాహోరీ సమరాలు ఉండొచ్చు.

Updated : 08 Nov 2022 08:21 IST

ఈనాడు క్రీడావిభాగం

ఈ ఏడాదికి ముందు ఆరు టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి. వీటిల్లో అనూహ్య ఫలితాలు.. వర్షం ప్రభావం చూపిన మ్యాచ్‌లు.. తారుమారైన అంచనాలు.. ఫేవరెట్ల నిష్క్రమణ.. హోరాహోరీ సమరాలు ఉండొచ్చు. కానీ ఈ సారి పొట్టి కప్పు ముందు అవన్నీ దిగదుడుపే!

ఊహించని మలుపులతో.. అద్భుతమైన మ్యాచ్‌లతో.. షాక్‌ల మీద షాక్‌లతో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా సాగుతున్న ఈ ప్రపంచకప్‌ నభూతో! చిన్న జట్ల పోరాటాలు.. చివరి బంతి విజయాలతో టోర్నీ ఇస్తున్న మజా అంతా ఇంతా కాదు. పనైపోయిందనుకున్న పాకిస్థాన్‌ సెమీస్‌ చేరడం.. నాకౌట్‌ చేరుతుందనుకున్న సఫారీ సేన ఇంటి ముఖం పట్టడం.. ఇలా కథ అడ్డం తిరిగిన సందర్భాలెన్నో!  

టీ20 మ్యాచ్‌ అంటేనే ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బంతి బంతికీ సమీకరణాలు మారిపోతాయి. ఇక ప్రపంచకప్‌ అంటే ప్రతి జట్టూ గెలుపు కోసం గట్టిగా పోరాడుతుంది. అందుకే మ్యాచ్‌లో ఒక జట్టే ఫేవరెట్‌ అని చెప్పలేం. ఈ ప్రపంచకప్‌ అందుకు సరైన నిదర్శనం. షాక్‌లకు ఏ మాత్రం కొదవలేదు. అసలు ఆరంభమే ఓ సంచలనం. తొలి రౌండ్‌ మొదటి మ్యాచ్‌లోనే మాజీ ఛాంపియన్‌ శ్రీలంకను నమీబియా ఓడించింది. అక్కడి నుంచి.. సూపర్‌-12 దశ చివరి రోజు వరకూ అనూహ్య ఫలితాల పరంపర కొనసాగింది. రెండు సార్లు ఛాంపియన్‌ వెస్టిండీస్‌ తొలిసారి అర్హత రౌండ్లో ఆడడమే కాకుండా.. మొట్టమొదటిసారిగా ప్రధాన రౌండ్‌ చేరలేకపోయింది. జింబాబ్వే తొలిసారి సూపర్‌-12కు అర్హత సాధించింది.

ఆ మలుపులు..: ఇప్పటివరకూ జరిగిన టీ20 ప్రపంచకప్‌ల్లో ఇదే అత్యుత్తమ టోర్నీ అనడంలో సందేహం లేదు. సెమీస్‌లో చోటు కోసం నెలకొన్న పోటీ, రేకెత్తిన ఉత్కంఠ, చివరి బంతి విజయాలు అందుకు కారణం. ఓ వైపు పసికూన జట్లు, మరోవైపు వాన కలిసి ఈ ప్రపంచకప్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. సెమీస్‌కు దూరమయ్యేలా కనిపించిన ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ నాకౌట్‌ చేరడం.. కచ్చితంగా ముందంజ వేస్తుందని భావించిన దక్షిణాఫ్రికా నిష్క్రమించడం.. సొంతగడ్డపై డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా నెట్‌ రన్‌రేట్‌లో వెనకబడి సెమీస్‌కు దూరం కావడం.. ఇలా మలుపులెన్నో! వర్షం వల్ల కొన్ని మ్యాచ్‌లు రద్దయి అభిమానులు తీవ్ర నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ వాన వల్ల పెద్ద జట్ల అవకాశాలపై ప్రభావం పడి.. సెమీస్‌ రేసు ఉత్కంఠగా మారింది. వరుణుడు నాలుగు మ్యాచ్‌లను తుడిచేసి.. రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలపై ప్రభావం చూపాడు. మొదట దెబ్బ దక్షిణాఫ్రికాపై పడింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో 7 ఓవర్లకు 64 పరుగుల లక్ష్య ఛేదనలో 3 ఓవర్లకే 51/0తో నిలిచిన సఫారీ జట్టు విజయం ఖాయమైంది. కానీ వర్షం రాకతో మ్యాచ్‌ రద్దయింది. ఆ మ్యాచ్‌ కొనసాగి, దక్షిణాఫ్రికా గెలిచి ఉంటే సెమీస్‌ చేరేదే. ఐసీసీ టోర్నీల్లో దురదృష్టం వెంటాడే ఆ జట్టు చివరి మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇక ఐర్లాండ్‌, వరుణుడు కలిసి కొట్టిన దెబ్బకు ఇంగ్లాండ్‌, జింబాబ్వే చేతిలో ఓటమితో పాక్‌ సూపర్‌-12లోనే ఇంటి ముఖం పడతాయనిపించింది. కానీ ఆ జట్ల పోరాటానికి అదృష్టం కూడా తోడవడంతో అంచనాలు తారుమారయ్యాయి. ఆసీస్‌కు స్వదేశంలో నిరాశ తప్పలేదు. ఐర్లాండ్‌, అఫ్గానిస్థాన్‌పై గెలిచినా.. ప్రత్యర్థులను తక్కువ పరుగులకే కట్టడి చేసే అవకాశాన్ని చేజార్చుకుని ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ రద్దవడం ఆస్ట్రేలియాకు చేటే చేసింది. ఒకవేళ ఆ మ్యాచ్‌ జరిగి, ఆసీస్‌ గెలిచి ఉంటే ఇప్పుడు సెమీస్‌లో నిలిచేది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్‌కు మాత్రం వరుణుడు సాయమే చేశాడని చెప్పాలి. ఛేదనలో దూసుకుపోయిన బంగ్లాను వర్షం అంతరాయం తర్వాత భారత్‌ కట్టడి చేసి గెలిచింది. ఇక భారత్‌, పాక్‌ పోరు సహా చివరి బంతి లేదా ఆఖరి ఓవర్లో తీవ్ర ఉత్కంఠ మధ్య ఫలితం తేలిన ఏడు (సూపర్‌-12లో) మ్యాచ్‌లు టోర్నీలో వినోదాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి.

ఈ ఆటగాళ్లు..: ఈ ప్రపంచకప్‌లో కొంతమంది ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా టోర్నీకే ఆకర్షణ తీసుకొచ్చారు. అందులో టీమ్‌ఇండియా క్రికెటర్లు కోహ్లి, సూర్యకుమార్‌, అర్ష్‌దీప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గాయాలతో బుమ్రా, జడేజా, దీపక్‌ చాహర్‌ దూరం కావడం, కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌ లేమి, పేస్‌, బౌన్సీ పిచ్‌లుండే ఆస్ట్రేలియాకు కేవలం నలుగురు ప్రధాన పేసర్లతోనే వెళ్లడం.. ఇలా టోర్నీ ఆరంభానికి ముందు భారత్‌కు ఎన్నో సమస్యలు. కానీ ఇప్పుడు గ్రూప్‌-2లో అగ్రస్థానంతో సెమీస్‌లో చోటు దక్కించుకుందంటే అందుకు ప్రధాన కారణం ఈ త్రయం. ఆసియా కప్‌తో ఫామ్‌ అందుకున్న కోహ్లి చెలరేగుతున్నాడు.  మ్యాచ్‌ల్లో 123 సగటు, 3 అర్ధశతకాలతో 246 పరుగులు చేసిన కోహ్లి టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా బ్యాటర్లకంటే విభ్నిమైన శైలిలో షాట్లు ఆడుతూ.. 360 డిగ్రీల ఆటతీరుతో సూర్య అదరగొడుతున్నాడు. ఇప్పటికే టీ20ల్లో నంబర్‌వన్‌గా నిలిచిన అతనిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరోవైపు బుమ్రా లోటును భర్తీ చేస్తూ, ఆడుతున్న తొలి ప్రపంచకప్‌లోనే అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆకట్టుకుంటున్నాడు. మంచి పేస్‌తో స్వింగ్‌, బౌన్స్‌ రాబడుతూ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. ఆఖరి ఓవర్లలో పరుగులు కట్టడి చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న అతను 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. సామ్‌ కరన్‌ (ఇంగ్లాండ్‌), షాదాబ్‌ ఖాన్‌ (పాకిస్థాన్‌), ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌) కూడా ఆకట్టుకుంటున్నారు. ఇక జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా (8 మ్యాచ్‌ల్లో 219 పరుగులు, 10 వికెట్లు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెప్పించాడు.

రసవత్తర ముగింపు..?

అప్పుడెప్పుడో 2007లో ఆరంభ టీ20 ప్రపంచకప్‌ తుదిపోరులో భారత్‌, పాకిస్థాన్‌ తలపడ్డాయి. అప్పుడు దాయాదిపై గెలిచిన టీమ్‌ఇండియా దేశంలో పండగ తెచ్చింది. ఆ తర్వాత భారత్‌ (2014), పాక్‌ (2009) చెరోసారి ఫైనల్‌ చేరినప్పటికీ.. వేర్వేరు జట్లతో తలపడ్డాయి. మరోసారి ఆ జట్లు టైటిల్‌ పోరులో పోటీపడితే చూడాలని క్రికెట్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా గెలిస్తే చాలు.. ఈ నెల 13న మహా సంగ్రామం కోసం చారిత్రక ఎంసీజీ మైదానం సిద్ధంగా ఉంది. భారత్‌-పాక్‌ ఫైనల్లో తలపడితే టోర్నీకి అంతకన్నా గొప్ప ముగింపు ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని