క్రికెట్‌ మోతాదు మించిపోయింది: స్టీవ్‌వా

అభిమానులకు మోతాదుకు మించిన క్రికెట్‌ ఇప్పుడు అందుబాటులో ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా అన్నాడు. ఊపిరి సలపని షెడ్యూల్‌పై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Published : 29 Nov 2022 02:24 IST

మెల్‌బోర్న్‌: అభిమానులకు మోతాదుకు మించిన క్రికెట్‌ ఇప్పుడు అందుబాటులో ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా అన్నాడు. ఊపిరి సలపని షెడ్యూల్‌పై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అన్నిటిని చూడడం ఎవరి వల్లా కావట్లేదు. అభిమానులు కనీసం వాటిని అనుసరించలేకపోతున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ ఈ కోవకే చెందుతుంది. స్టేడియాలు నిండనప్పుడు అసలు ఈ సిరీస్‌లు ఎందుకు ఆడుతున్నాం. ఇప్పటికే క్రికెట్‌ చాలా ఎక్కువైపోయింది’’ అని వా అన్నాడు. ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్‌లను కూడా తమ అభిమానులు ఎక్కువగా చూడట్లేదని అతడు పేర్కొన్నాడు. ‘‘యాషెస్‌ లాంటి సిరీస్‌లను అభిమానులు కోరుంటారు. ఫార్మాట్‌ను బట్టి జట్టు మారుతూ ఉండడంతో అభిమానులు కూడా ఆస్ట్రేలియా మ్యాచ్‌లపై ఆసక్తి చూపించట్లేదు. తాము అభిమానించే ఆటగాళ్లు లేనప్పుడు వాళ్లు మ్యాచ్‌లు చూడట్లేదు. ప్రతిసారీ జట్టులో ఎవరున్నారూ అని వెతుక్కోవాల్సి వస్తోంది’’ అని వా వివరించాడు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఆతిథ్య ఆస్ట్రేలియా ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో సగటున ఒక్కో మ్యాచ్‌కు 37,565 మంది అభిమానులే స్టేడియానికి వచ్చారు. పెద్ద స్టేడియాలున్న ఆస్ట్రేలియాలో ఈ సంఖ్య చిన్నదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని