ఎలా వెళ్దాం... ఎక్కడుందాం..?

ఐపీఎల్‌ పదమూడో సీజన్‌పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోకముందే దాని ఫ్రాంఛైజీలు మాత్రం సన్నాహకాలు మొదలెట్టేశాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆరంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ ప్రకటన వచ్చిన తర్వాత ఐపీఎల్‌ నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని బీసీసీఐ భావిస్తుండగా....

Updated : 09 Jul 2021 19:17 IST

ఐపీఎల్‌ సన్నాహకాలు మొదలెట్టిన ఫ్రాంఛైజీలు

దిల్లీ: ఐపీఎల్‌ పదమూడో సీజన్‌పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోకముందే దాని ఫ్రాంఛైజీలు మాత్రం సన్నాహకాలు మొదలెట్టేశాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆరంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ ప్రకటన వచ్చిన తర్వాత ఐపీఎల్‌ నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని బీసీసీఐ భావిస్తుండగా.. మరోవైపు యూఏఈలో లీగ్‌ జరిగే వీలుండడంతో అక్కడి వసతి, ఆటగాళ్ల ప్రయాణాలు తదితర ఏర్పాట్లలో ఫ్రాంఛైజీలు మునిగిపోయాయి. అబుదాబిలో ఏ హోటళ్లో ఉండాలో ఇప్పటికే నిర్ణయించేసుకున్నామని ఓ ఫ్రాంఛైజీ ప్రతినిధి తెలిపాడు. ‘‘తెలివిగా వ్యవహరించి వీలైనంత త్వరగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మాకేం కావాలో ముందుగానే తెలుసుకున్నాం. అబుదాబిలో ఏ హోటళ్లో ఉండాలో నిర్ణయించుకున్నాం. యూఏఈలోని క్వారంటైన్‌ నిబంధనలు అనుసరించి ఆటగాళ్లను అక్కడికి తరలించే విషయంపై ఆలోచిస్తున్నాం’’ అని అతను చెప్పాడు. ఆటగాళ్ల ఐసొలేషన్‌ భారత్‌లోనే పూర్తి చేసుకుని యూఏఈకి వెళ్తామని మరో ఫ్రాంఛైజీ ప్రతినిధి వెల్లడించాడు. వివిధ దేశాల నుంచి వచ్చే ఆటగాళ్లను నేరుగా యూఏఈకి తీసుకెళ్తే వైరస్‌ ప్రమాదం పొంచి ఉండే అవకాశముందని అతనన్నాడు.

ప్రత్యేక విమానాలు: సాధారణ ప్రయాణికులతో వెళ్లే విమానాలు షెడ్యూల్‌ ప్రకారం నడిచే అవకాశాలు ఇప్పుడు లేవని, అందుకే జట్టు ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మరో ఫ్రాంఛైజీ ప్రతినిధి పేర్కొన్నాడు. ‘‘దాదాపు అన్ని జట్లు ఇప్పటికే విమానాలను బుక్‌ చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఆగస్టు చివరినాటికి సాధారణ విమానాలు షెడ్యూల్‌ ప్రకారం ప్రయాణాన్ని కొనసాగిస్తాయో లేదో చెప్పలేని పరిస్థితి. సెప్టెంబర్‌ మొదటి వారం లోగా అన్ని జట్లు యూఏఈలో ఉండాలని అనుకుంటున్నాయి. అది సాధ్యం కావాలంటే సుమారు 40 మంది ప్రయాణించేలా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకోక తప్పదు’’ అని అతను తెలిపాడు. మరో ఫ్రాంఛైజీ ప్రతినిధి మాట్లాడుతూ.. తమ ఆటగాళ్లు నేరుగా యూఏఈలోనే జట్టు కడతారని తెలిపాడు. వాళ్ల కోసం ప్రత్యేకంగా విమానాలను తిప్పలేమని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని