Harbhajan Singh: అతడు తీవ్ర ఇబ్బంది పడినట్లు కనిపించింది: హర్భజన్

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో పంజాబ్‌ జట్టు సారథి మయాంక్‌ అగర్వాల్‌ తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు కనిపించాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 02 Jun 2022 14:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో పంజాబ్‌ జట్టు సారథి మయాంక్‌ అగర్వాల్‌ తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు కనిపించాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన మెగా టోర్నీలో ఆ జట్టు 7 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలోనే తొలిసారి కెప్టెన్సీ చేపట్టిన మయాంక్‌ బ్యాట్స్‌మన్‌గానూ విఫలమయ్యాడు. అతడు 13 మ్యాచ్‌ల్లో 16.33 సగటుతో కేవలం 196 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన హర్భజన్‌ మయాంక్‌పై స్పందించాడు.

‘ఈ సీజన్‌లో మయాంక్‌ గురించి మాట్లాడాల్సి వస్తే.. అతడికి ఏమైందోనని బాధపడ్డా. అతడెంతో మేటి ఆటగాడు. అయితే, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక మానసికంగా ఒత్తిడికి గురైనట్లు ఉన్నాడు. ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ చేయాల్సిన అతడు నాలుగో స్థానంలో ఆడాడు. జట్టును కూడా బయటి నుంచి నడిపించారు. అతడు కెప్టెన్‌గా అన్నీ చూసుకుంటున్నాడంతే. ఈ క్రమంలోనే తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు కనిపించాడు. అతడికి కెప్టెన్‌గా స్వేచ్ఛనివ్వాల్సింది. కానీ, మయాంక్‌ ప్రత్యేకనిఘాలో ఉన్నట్లు అనిపించాడు’ అని హర్భజన్‌ వివరించాడు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మాజీ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా.. ఈసారి కెప్టెన్సీ అతడి ప్రదర్శనపై ప్రభావం చూపించిందని అన్నాడు.

‘గతేడాది మయాంక్‌ ఆడిన తీరు అద్భుతం. అందుకే అతడిపై నమ్మకం ఉంచిన పంజాబ్‌ జట్టు ఈసారి అలాగే అట్టిపెట్టుకుంది. ఆ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. మరోవైపు అతడికి ఇంతకుముందు దేశవాళి క్రికెట్‌లో లేదా ఇండియ-ఏ తరఫున కెప్టెన్సీ చేసిన అనుభం లేదు. ఆ లోపం ఈ సీజన్‌లో స్పష్టంగా కనిపించింది. అలాగే కెప్టెన్సీ ఒత్తిడి కూడా అతడిపై తీవ్ర ప్రభావం చూపినట్లు స్పష్టంగా కనిపించింది. కెప్టెన్సీ అనేది అందరూ చేయలేరు. మయాంక్‌కు కూడా ఆ బాధ్యత సరిపోలేదు’ అని పీయూష్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని