..మధ్యలో వసీమ్‌ అక్రమ్‌ ఎలా వచ్చాడు బ్రో?

హార్దిక్‌, కృనాల్‌.. ముంబయి విజయాల్లో కీలకంగా నిలిచే సోదరులు. వీరిద్దరూ లేకుండా ఆ జట్టు దాదాపుగా బరిలోకి దిగదు! చిన్నోడేమో పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. పెద్దోడేమో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. అబుదాబి వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచులోనూ ఈ అన్నదమ్ములు ముఖ్య భూమిక పోషించారు....

Published : 02 Oct 2020 13:41 IST

కృనాల్‌ను ప్రశ్నించిన హార్దిక్‌

(Twitter/Krunalpandya)

ఇంటర్నెట్‌ డెస్క్‌: హార్దిక్‌, కృనాల్‌.. ముంబయి విజయాల్లో కీలకంగా నిలిచే సోదరులు. వీరిద్దరూ లేకుండా ఆ జట్టు దాదాపుగా బరిలోకి దిగదు! చిన్నోడేమో పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. పెద్దోడేమో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. అబుదాబి వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచులోనూ ఈ అన్నదమ్ములు ముఖ్య భూమిక పోషించారు.

తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు ముంబయి 14 ఓవర్లకు 87/3తో నిలిచింది. ఈ క్రమంలో పొలార్డ్‌తో కలిసి హార్దిక్‌ విధ్వంసకరంగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 11 బంతుల్లో 3 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 272.73గా ఉందంటే అతడు ఏ స్థాయిలో బంతిని బాదేశాడో అర్థమవుతుంది. కృనాల్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రానప్పటికీ బంతితో రాణించాడు. 4 ఓవర్లు విసిరి కేవలం 27 పరుగులే ఇచ్చాడు. కీలకమైన కరుణ్‌ నాయర్‌ను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో అతడు కొన్ని వైవిధ్యమైన బంతులు విసిరాడు. స్పిన్నరై ఉండి యార్కర్ల మాదిరిగా విసరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

‘మ్యాచులో మేమందరం ఓ కొత్త విషయం గమనించాం. హఠాత్తుగా వసీమ్‌ అక్రమ్‌ వచ్చి యార్కర్లు ఎలా వేయగలిగాడు?’ అని కృనాల్‌ను మ్యాచ్‌ ముగిశాక హార్దిక్‌ ప్రశ్నించాడు. ‘ఈ రోజుల్లో బ్యాటింగ్‌ నైపుణ్యాలు బాగా పెరుగుతున్నాయి. పిచ్‌లు సైతం బౌలర్లకు అనుకూలంగా ఉండటం లేదు. మన బౌలింగ్‌లో పరుగులు రావొద్దంటే కొత్త దారులు వెతకాల్సిందే. కొన్నిసార్లు ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ మ్యాచులో ముందుగా అనుకున్న ప్రణాళికలు సవ్యంగా అమలైతే సంతృప్తిగా అనిపిస్తుంది. నాలుగో ఓవర్లో నేను బంతి అందుకున్నప్పుడు పంజాబ్‌ మెరుగ్గా ఉంది. అందుకే ఫీల్డింగ్‌కు తగినట్టు బంతులు విసిరాలని నిర్ణయించుకున్నా. సవాల్‌గా తీసుకొని బౌలింగ్‌ చేశా. నేను బాగా వేస్తే మ్యాచులో మన జట్టు పుంజుకుంటుందని పట్టుదల ప్రదర్శించా’ అని కృనాల్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని