IND vs NZ: అదే మా కొంప ముంచింది..: హార్దిక్‌ పాండ్య

న్యూజిలాండ్‌తో (New Zealand) మూడు టీ20ల సిరీస్‌ను భారత్ (Team India) ఓటమితో ఆరంభించింది. బౌలింగ్‌లో విఫలం కావడంతోపాటు లక్ష్య ఛేదనలోనూ కీలక సమయంలో వికెట్లను చేజార్చుకొని ఓటమిపాలైంది.  

Published : 28 Jan 2023 10:42 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి ఉత్సాహంతో టీ20 సిరీస్‌ బరిలోకి దిగిన హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోని టీమ్‌ఇండియాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ, సూర్య కుమార్‌ కీలక ఇన్నింగ్స్ ఆడటం మినహా భారత బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో విఫలం కావడం కలవరానికి గురి చేస్తోంది. కెప్టెన్ హార్దిక్‌ కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేశాడు. రాంచీ మైదానం బౌలింగ్‌కు కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ.. తొలుత కివీస్‌కు ఎక్కువగా పరుగులు ఇవ్వడంతోనే లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకి కష్టంగా మారిందని పేర్కొన్నాడు.

‘‘రాంచీ పిచ్‌ ఇలా స్పందిస్తుందని అనుకోలేదు. ఇరు జట్ల ఆటగాళ్లం ఆశ్చర్యానికి గురయ్యాం. అయితే ఇవాళ కివీస్‌ క్రికెటర్లు మా కంటే ఉత్తమ క్రికెట్ ఆడారు. అందుకే ఫలితం వారికి అనుకూలంగా వచ్చింది. పాత బంతి కంటే కొత్త బంతి కాస్త ఎక్కువగా తిరుగుతుంది. అలాగే బౌన్స్‌ అవుతుంది. కానీ, రాంచీలో మాత్రం విభిన్నంగా మారిన పరిస్థితి మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఛేదనలో త్వరగా వికెట్లను కోల్పోయినప్పటికీ.. నేను, సూర్య కుమార్ క్రీజ్‌లో ఉన్నప్పుడు రేసులోనే ఉన్నామనిపించింది. చివరికి కివీస్‌ విజయం సాధించింది. ఈ వికెట్‌ మీద 177 పరుగులు ఇవ్వడం సరైంది కాదు. మేం బౌలింగ్‌లో కాస్త వెనుకబడ్డామనిపించింది. అదనంగా 25 పరుగులు సమర్పించాం. దాంతోనే ఓటమిపాలు కావాల్సి వచ్చింది’’

‘‘వాషింగ్టన్ సుందర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. అన్ని విభాగాల్లో రాణించాడు. ఇలా ఆడుతుంటే మిగతావారిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు జట్టులో చాలామంది యువకులు ఉన్నారు. ఇలాంటి ఓటముల నుంచి పాఠాలను నేర్చుకొని ముందుకు సాగుతాం’’ అని హార్దిక్‌ పాండ్య వెల్లడించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ లక్‌నవూ వేదికగా ఆదివారం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని