IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్‌ పాండ్య

 ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి మరీ...

Updated : 29 Jun 2022 12:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 225/7 భారీ స్కోరు సాధించింది. అయితే ఛేదనలో ఐర్లాండ్ లక్ష్యానికి చేరువగా వచ్చి ఆగింది. ఆరంభంలో భారీగా పరుగులు ఇచ్చిన టీమ్‌ఇండియా బౌలర్లు కీలక సమయంలో రాణించడంతో ఐర్లాండ్‌ 221/5 స్కోరుకు పరిమితమైంది. దీంతో భారత్‌ 2-0 తేడాతో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన సందర్భంలో బంతిని యువ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు ఇవ్వడంపై అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటికే మూడు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే తీశాడు. అయితే కీలకమైన చివరి ఓవర్‌లో తొలి మూడు బంతులకు రెండు ఫోర్లు, నో బాల్‌ ఇచ్చినా.. ఆఖరి మూడు బంతులకు కేవలం మూడు పరుగులే ఇవ్వడంతో భారత్‌ విజయంతో ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో చివరి ఓవర్‌ను ఉమ్రాన్‌ మాలిక్‌కు ఇవ్వడంపై మ్యాచ్‌ అనంతరం టీమ్‌ఇండియా సారథి హార్దిక్‌ వివరణ ఇచ్చాడు. 

‘‘ఆరు బంతుల్లో 17 పరుగులు కావాలి. ఆ సమయంలో విజయ సమీకరణాలకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి పడకూడదని భావించా. అదే విధంగా ఉమ్రాన్‌ మాలిక్‌ను ప్రోత్సహించి అతడి చేతికే బంతినిచ్చా. అతడి పేస్‌ చాలా బాగుంటుంది. అటువంటి పేస్‌ను ఎదుర్కొని 18 పరుగులు చేయడమంటే అంత సులువేం కాదు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లు చాలా మంచి షాట్‌లు ఆడారు. అయితే కీలక సమయంలో ఐర్లాండ్‌ను అడ్డుకోవడంలో భారత్ బౌలర్లు విజయవంతమయ్యారు. దీపక్ హుడా, సంజూ శాంసన్‌ అద్భుతంగా ఆడారు. అభిమానుల మద్దతు చాలా బాగుంది. దినేశ్ కార్తిక్, సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ప్రేక్షకులు కేరింతలతో సంతోషాన్ని వెలిబుచ్చారు. నాయకుడిగా తొలి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఎప్పుడూ ప్రత్యేకమే. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని హార్దిక్‌ పాండ్య అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని