IND vs AUS: మా ఆటను చూస్తే గర్వంగా ఉంది: హార్దిక్‌ పాండ్య

ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో (IND vs AUS) పోరాడి మరీ టీమ్‌ఇండియా విజయం సాధించింది.

Published : 18 Mar 2023 11:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో (IND vs AUS) ఆసీస్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ సన్నాహక సిరీస్‌గా భావిస్తున్నక్రమంలో టీమ్‌ఇండియా (Team India) సమష్ఠి కృషితో గెలిచింది. బౌలింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై తొలుత భారత బౌలర్లు అదరగొట్టారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ బ్యాటింగ్‌కు కఠినంగా మారింది. అయినా సరే ఎంతో ఓర్పుగా ఆడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆరో వికెట్‌కు ఏకంగా 108 పరుగులను జోడించారు.  ఈ సందర్భంగా టీమ్‌ఇండియా కెప్టెన్ హార్దిక్‌ పాండ్య జట్టు ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించాడు. 

‘‘తొలి వన్డేలో ఆసీస్‌ను ఓడించడం ఆనందంగా ఉంది. దానికోసం జట్టు సమష్ఠిగా ఆడిన తీరు గర్వకారణం. దాదాపు ఎనిమిది నెలల తర్వాత వన్డే క్రికెట్‌ ఆడుతున్న రవీంద్ర జడేజా బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ రాణించడం సూపర్. మ్యాచ్‌ను ఇలా ముగించడం చాలా బాగుంది. ఇదే క్రమంలో జడ్డూతో కలిసి సీనియర్‌ ఆటగాడు కేఎల్ రాహుల్ నిర్మించిన భాగస్వామ్యం మ్యాచ్‌కే హైలైట్. మైదానం వెలుపల నుంచి చూస్తూ.. వారిద్దరూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ముగించిన తీరు ముచ్చటేసింది. మేం బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేసేటప్పుడూ ఒత్తిడికి గురయ్యాం. అయితే, ఆ ఒత్తిడిని అధిగమించి మరీ ఫలితం సాధించాం. ఒక్కసారి పరిస్థితులు మన అదుపులోకి వస్తే చాలు అన్నీ మారిపోతాయి’’ అని హార్దిక్‌ తెలిపాడు. 

ఎనిమిది నెలల తర్వాత ఆడటంపై జడేజా

‘‘దాదాపు ఎనిమిది నెలల తర్వాత వన్డే ఆడా.  వీలైనంత త్వరగా ఈ ఫార్మాట్‌కు అలవాటుపడాలని భావించా.  అదృష్టవశాత్తూ తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు దక్కాయి. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే నేను కేవలం కేఎల్‌తో భాగస్వామ్యం నిర్మించాలని మాత్రమే భావించా. మొన్నటి వరకు టెస్టు క్రికెట్‌ ఆడాం. అక్కడి లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు .. వన్డే ఫార్మాట్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకే వేగంతో బంతులను సంధించకూడదు. అందుకే, సరైన ప్రాంతంలో బంతిని వేసేందుకు ప్రయత్నించా. అందులోనూ కాస్త టర్నింగ్‌ లభించింది’’ అని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్న జడేజా (Ravindra Jadeja) తెలిపాడు. నిన్న అందుకొన్న ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో కొత్త మైలురాయిని చేరుకొన్నాడు. ఆసీస్‌పై అత్యధికంగా ఈ అవార్డులను అందుకొన్న సచిన్‌ (17), కోహ్లీ (9) తర్వాత  రోహిత్‌(6), యువరాజ్‌(6)లతో కలిసి సంయుక్తంగా నిలిచాడు.  

అంచనా వేయలేదు: స్మిత్‌

‘‘మేం అంచనా వేసినట్లు పిచ్‌ లేదు. భారత బౌలర్లు చాలా చక్కగా రాణించారు. కొన్ని కీలక అంశాలను వదిలేశామని అనిపిస్తోంది. కనీసం 250 పరుగులు చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. మిచెల్‌ మార్ష్‌ చాలా అద్భుతంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తొలుత మా ఇన్నింగ్స్‌ దూకుడు ఉంది. అయితే, మిడిలార్డర్‌లో వికెట్లను కోల్పోవడంతో వెనుకబడిపోయాం. ఉత్తమ భాగస్వామ్యాలను నిర్మించలేదు. లక్ష్య ఛేదనలో జడేజా - రాహుల్‌ మంచి భాగస్వామ్యం నిర్మించి చూపించారు. పేస్‌ బౌలింగ్‌కు పిచ్‌ నుంచి సహకారం లభించింది. బంతి చాలా బాగా స్వింగ్‌ అయింది.  తొలుత మేం మరిన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని కచ్చితంగా చెప్పగలను. అన్ని విభాగాల్లో రాణించిన భారత్‌కే ఈ క్రెడిట్‌ దక్కుతుంది’’ అని స్మిత్ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని