Team india: బంగ్లాదేశ్‌పై విజయం.. టాప్‌-2లోకి వచ్చిన టీమ్‌ ఇండియా

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్‌ పట్టికలో భారత క్రికెట్‌ జట్టు రెండో స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్‌పై విజయంతో భారత్‌ స్థానం మెరుగుపడింది.

Published : 19 Dec 2022 15:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత క్రికెట్‌ జట్టు (Team india) రెండో స్థానానికి చేరుకుంది. తాజాగా బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి రోజు 11.2 ఓవర్లలోనే కావాల్సిన నాలుగు వికెట్లు తీసి, 188 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. మరోవైపు ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa)ఘోర పరాజయాన్ని చవి చూసింది. పూర్తిగా రెండు రోజులు కూడా సాగని మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్‌ జట్టు దక్షిణాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించింది. ఐదు రోజులు జరగాల్సిన టెస్టు కేవలం 144.2 ఓవర్లు మాత్రమే జరగడం చూస్తే, దక్షిణాఫ్రికా ఎంత ఘోరంగా ఆడిందో చూడవచ్చు. దీంతో తాజా టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టి భారత్‌ రెండో స్థానానికి చేరుకుంది.

ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో ఆసీస్‌ జట్టు అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు 76.92 శాతం (120 పాయింట్లు)తో టాప్‌లో ఉంది. బంగ్లాపై విజయంతో పాయింట్లు మెరుగు పరుచుకున్న భారత్‌ 55.77శాతం(72 పాయింట్లు)తో రెండో స్థానంలోనూ దక్షిణాఫ్రికా 54.55శాతం (64 పాయింట్లు)తో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా శ్రీలంక (53.33%), ఇంగ్లాండ్‌ (44.44%), పాకిస్థాన్‌ (42.42%), వెస్టిండీస్‌ (40.91%), న్యూజిలాండ్‌ (25.95%), బంగ్లాదేశ్‌ (12.52%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫస్ట్‌ సైకిల్‌ ముగిసే సమయానికి భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు టాప్‌లో ఉండగా, ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అదరగొట్టి, టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. తాజా ఛాంపియన్‌షిప్‌ సైకిల్‌ మార్చి 2023తో ముగుస్తుంది. తుది పోరుకు ఈసారి కూడా ఇంగ్లాండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని